తెలంగాణ గడ్డపై పుట్టిన ఎన్నో కళారూపాలు.. గ్రామీణ ప్రజలకు విజ్ఞానాన్నీ, వినోదాన్నీ పంచాయి. ఆంధ్రుల పాలనలో పోషణ కరువై వాటిలో అనేకం కనుమరుగై పోయాయి. కళాకారుల కృషి ఫలితంగా కొన్ని జానపద రూపాలు మాత్రం మనుగడ సాగిస్తున్నాయి. అలా,ఇప్పటికీ బహుళ ప్రచారంలో ఉన్నవాటిలో ‘శారద కథలు’ ఒకటి. స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను చైతన్యపరచిన ‘బుర్రకథ’కు మూలమిదే.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో వీరులు అమరులయ్యారు. వారి త్యాగాలను పల్లెపల్లెకూ చేర్చి, ప్రజలను చైతన్య పరచడంలో నాటి జానపద కళారూపాలు కీలక భూమిక పోషించాయి. వాటిలో ముఖ్యమైంది.. ‘శారద కథలు’. సంగీత సాహిత్యాల మేలుకలయిక ఈ కళారూపం. చారిత్రక, సాంఘిక, పౌరాణిక కథలతోపాటు చారిత్రక వీర గాథలు, పురాణాల ఆధారంగా రూపొందిన అనేక అంశాలను ఇందులో కథలుగా చెబుతారు. ‘శారద’ అనే తంబూరాను వాయిస్తూ కథలు వినిపిస్తారు. కాబట్టి, ఈ కథకులకు ‘శారదకాండ్రు’ అన్న పేరొచ్చింది.
ఎవరీ శారదకాండ్రు?
తెలంగాణ జానపద సాహిత్యంలో అపార కృషి చేసిన ఆచార్య బిరుదురాజు రామారాజు అభిప్రాయం ప్రకారం.. మున్నూరు, ముతరాశి మొదలైన కులాల నుండి ఉద్భవించిన సంచార జాతులలో ‘శారదకాండ్రు’ ఒకటి. ఇందులోనూ అర్ధ సంచార, పూర్తి సంచార అంటూ రెండు రకాల కళాకారులున్నారు. శారదకాండ్రు శైవాన్ని ఆచరిస్తారు. శివుడితోపాటు ఎల్లమ్మ, పోచమ్మ మొదలైన దేవతలను పూజిస్తారు. శుభ, అశుభ కార్యాల సందర్భంగా కథలు చెబుతారు. పల్లెలు, పట్టణాల్లో ఏడాది పొడవునా కళాప్రదర్శనలు చేస్తారు. ఇతర జానపద గేయాలతో పోలిస్తే, శారద కథల్లో సాహిత్య ప్రతిభ ఎక్కువే. ‘ఓ భారతీ కరుణామతి – భళీ శారద కరుణానిధీ’ అనే మకుటంతో పాడుతుంటారు. వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానానికి ప్రతీక అయిన అమ్మవారి పేరునే తమ తంబూరాకు పెట్టుకొన్నారు. అంతేకాకుండా, శారదాదేవి స్తోత్రంతోనే కథను ప్రారంభిస్తారు. ఈ కారణాల వల్ల వీరికి ‘శారదకాండ్రు’ అనే పేరు వచ్చింది. నిజంగానే శారద వారి నోళ్లపై నాట్యం చేస్తూ ఉంటుంది.
వీరోచితం..
తెలంగాణ సాయుధ పోరాట యోధులైన రేణికుంట రామిరెడ్డి, చింతలపూడి రామిరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి మొదలైనవారి వీరోచిత పోరాట గాథలను శారద కథల్లో చెబుతారు. బాలనాగమ్మ, రాములమ్మ, ఎరుకల నాంచారి మొదలైన కరుణ రసభరిత కథలను, తెలంగాణలో ప్రచారంలో ఉన్న సదాశివరెడ్డి కథ, సర్వాయి పాపన్న వీరగాథలను అద్భుతంగా వినిపిస్తారు. వీటితో పాటు చారిత్రక కథలైన పల్నాటి వీరచరిత్ర, బాలనాగమ్మ, బొబ్బిలి యుద్ధం మొదలైన కథలనూ శారద గాయకులు కథలుగా మలిచారు. ప్రజలకు వినోదాన్ని అందిస్తూ జీవన భృతిని పొందే శారదకాండ్రు.. ఆదరించే వారు లేక ఆగమవుతున్నారు. నిజామాబాద్కు చెందిన మహిళా కళాకారులు లక్ష్మి, శంకరమ్మ తమదైన శైలిలో శారద కథలను గానం చేస్తున్నారు. ఈ కళనూ,ఆ కళాకారులనూ బతికించుకోవాల్సిన అవసరం ఉంది.
‘బుర్ర కథ’కు మూలం..
శారద కథలు ఎప్పటినుంచీ జనబాహుళ్యంలో ఉన్నాయనే ప్రశ్నకు చారిత్రక ఆధారాలు లేవు. కానీ, ఆంధ్ర ప్రాంతంలో విశేష ఆదరణ పొందిన ‘బుర్ర కథ’కు శారద కథలే మూలమని మాత్రం పలువురు చరిత్రకారుల అభిప్రాయం. శారద బృందంలో ముగ్గురు సభ్యులుంటారు. ప్రధాన కథకులు ఎడమచేతి వేళ్లతో అందెలు మోగిస్తూ, కుడిచేతి వేళ్లతో తంబూరా మీటుతూ కథ చెబుతారు. మిగిలినవారు డక్కీలు కొడుతూ వంత పాడుతారు. ఇందులో శారద ప్రధాన వాద్యం అయితే, బుర్ర (డక్కీ)లు, అందెలు సహవాద్యాలు. ఈ కళారూపం చూసేందుకు బుర్రకథ, బోనాల కథ, జముకుల కథల్లాగే ఉన్నా.. సంగీతపరంగా వేర్వేరు వాద్యాలను ఉపయోగిస్తారు. ఒక్కో కథను ఆరు గంటల నుంచి రెండు రోజులపాటు చెప్పగల సమర్థులు శారదకాండ్రు.
-అరవింద్ ఆర్య , 7997 270 270