తెలంగాణ జానపదులకు ఎంతో ఇష్టమైన పండుగ బతుకమ్మ. పిల్లల నుంచి పెద్దల వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పండుగ ప్రతియేటా ‘పెత్ర అమాస’కే ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమవుతుంది. పితృ అమావాస్యనే పెతర అమాస/ పెత్రామాస/ పిత్రామావాస్యగా పిలుచుకుంటున్నారు మన జానపదులు. దీనిని భాద్రపద అమావాస్యగానూ పిలుస్తారు. పెత్రామాసనాడు ప్రారంభించిన బతుకమ్మకే విలువ. ఈ అమాసకే పెద్దలకు బియ్యమిస్తారు. దీనినే ‘మహాలయ అమావాస్య’ అని కూడా అంటారు. అష్టమి, నవమి పంచాంగాన్ని నమ్మేవాళ్లు ఈ తిథుల్లో ముఖ్యమైన పనులు చేపట్టరు. ఈ మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు అర్ఘ్యము ఇవ్వడం ద్వారా వంశాభివృద్ధి ప్రాప్తిస్తుంది. అలాగే పేదలకు వీలైనంత దానము చేయడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఉన్న 15 రోజులు పితృపక్ష మహాలయంగా చెప్తారు. ఇందులో మరీ ముఖ్యమైన తిథి త్రయోదశి.