‘జాతి’ రత్నాలు!
భారతీయులు కస్తూరి మృగం లాంటివారు. వికాస రచనలకోసం స్టీఫెన్ కవే వైపు చూస్తారు. స్ఫూర్తిదాయక వాక్యాలకోసం చెగువేరా రచనలు వెతుకుతారు. మనో విశ్లేషణకోసం ఫ్రాయిడ్ ముందు సాగిలపడతారు. నిజానికి అంతకు వేయిరెట్ల విజ్ఞాన సంపద మన దగ్గరే ఉందన్న విషయమే గుర్తుండదు. వందల ఏండ్ల పరాయి పాలన మనల్ని పరాధీనులను చేసింది. తన రచనలద్వారా ఆ భావ దారిద్య్రాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు గుమ్మన్నగారి వేణుమాధవ శర్మ. సరళమైన తెలుగులో, సులభమైన రీతిలో రామాయణ, భారత, భగవద్గీతలను అందిస్తున్నారు. సాధారణ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు ఎలా గెలవాలో చెబుతాయి. కానీ, గెలుపును ఎలా ఆస్వాదించాలన్న దగ్గరే ఆగిపోకుండా ఓటమిని ఎలా తట్టుకోవాలో కూడా వివరిస్తుంది గీత. జయాపజయాలను సమంగా చూడగల సమ్యక్ దృష్టిని ప్రసాదిస్తుంది. కాబట్టే, ‘భగవద్గీత ముసలితనంలో చదవాల్సిన గ్రంథం కాదు. ఆలోచనల్లో ఎప్పుడూ ముసలితనాన్ని రానివ్వని గ్రంథం’ అంటారు రచయిత. తన రచనలో మూల శ్లోకాలతోపాటు సరళ సుబోధకమైన వ్యాఖ్యానాన్నీ అందించారు వేణుమాధవ శర్మ.
ఆదికావ్యాన్ని జాను తెలుగులో అందించిన తీరూ ప్రశంసనీయమే. ఓ రాకుమారుడు తండ్రికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలి ఆలితో కలసి అడవులకేగడం, అంతిమంగా దుష్ట సంహారం చేసి జన్మభూమికి తిరిగిరావడం తెలిసిన కథే. కానీ ఆ పాత్రలు, స్వభావాలు, సంభాషణలు, అంతర్మథనాలు, ధర్మసూక్ష్మాలు.. అతిలోతైనవి. మనిషిని మహనీయుడిని చేయగలిగినంత శక్తిమంతమైనవి. దశరథ పుత్రుడైన రాముడు నడిచిన ఆ విలువల దారి పేరే రామాయణం! ఆ అడుగులలో మనమూ తడబడకుండా నడవడానికి సరిపడా నైతిక బలాన్ని ప్రసాదిస్తుందీ రచన. మూలం ఆధారంగా రచయిత అందించిన మహాభారతాన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ‘తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలని’ అంటారు. గారెలు నమిలినకొద్దీ రుచి వస్తుంది. నాలుకకు పండుగే. భారతం చదివినకొద్దీ బుర్ర పదును దేలుతుంది. మనలో పరిణతి పెరిగినకొద్దీ మహాభారతం ఉన్నతంగా, మహోన్నతంగా, సర్వోన్నతంగా సాక్షాత్కరిస్తుంది.
వాల్మీకి రామాయణం
పేజీలు: 352; వెల: రూ.160
మహాభారతం
పేజీలు: 320; వెల: రూ.150
భగవద్గీత
పేజీలు: 255; రూ: 125
రచన: వేణుమాధవ శర్మ
ప్రతులకు: బండ్ల పబ్లికేషన్స్ ఫోన్: 9963293399
పల్లెకథల పరిమళాలు
భారతదేశపు ఆత్మ మన గ్రామాల్లోనే ఉంటుందన్నది గాంధీజీ మాట. పట్టణాల్లోని కృత్రిమ నాగరికత పల్లెపట్టుల్లో ఉండదన్న సత్యాన్ని మరోమారు నొక్కి చెప్పాయి కృష్ణస్వామిరాజు కథలు. ‘సల్లో.. సల్ల’ పేరుతో ఇటీవల విడుదలైన తాజా సంకలనంలో పదహారు కథలున్నాయి. స్వచ్ఛమైన పైరగాలిలా, తీయని తేటనీటిలా ప్రతికథా మన గుండెల్లోకి సూటిగా దూసుకుపోతుంది. నేలతో సంబంధం, పశువులతో అనుబంధం, పిలగాండ్ల ఆకతాయి పనులు, జనం నడుమ మమతానుబంధాలకూ ఈ కథలు అద్దం పడతాయి. తిరుపతి చుట్టుపక్కల పల్లెల జనజీవితంలోని మాధుర్యాన్ని చవిచూపిస్తాయి. ఈ కథల్లో శిల్పాన్ని, ఇతర కథాలక్షణాల్ని వెదకడం మానేసి చదువుకుంటే ప్రతీకథా మనల్ని ఆనంద పరవశుల్ని చేస్తుంది. చివరి కథ ’అమ్మ సినిమాకి వెళ్ళాలంటోంది’ రచయిత ఆలోచనా పరిణతిని మనముందు నిలబెట్టి గుండె తడిని గుర్తుచేస్తుంది. పట్టణీకరణ, నగరీకరణలతో నలిగిపోతున్న సగటు మనిషికి ఈ కథలు ఆనందానుభూతులు కలిగిస్తాయనడంలో సందేహం లేదు.
సల్లో..సల్ల – కథలు
రచన: ఆర్.సి. కృష్ణస్వామిరాజు
పేజీలు: 126; వెల రూ.120/-
ప్రతులకు: రచయిత, ఫోన్: 9393662821
-చంద్ర్ర పతాప్
ఇవీ కూడా చదవండి…