మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా నిర్వహించుకున్నాం. బహుభాషా కోవిదుడు, రాజకీయ దురంధరుడు అయిన పీవీ గురించి ఎంత చెప్పుకొన్నా, ఎంతో కొంత మిగిలే ఉంటుంది. పరిపూర్ణతకు ఉదాహరణగా నిలిచే పాములపర్తివారి వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే ప్రయత్నాలు ఇంకా కొనసాగాల్సి ఉంది. ఆ దార్శనికుడి ఆలోచనలను 360 డిగ్రీల కోణంలో ప్రపంచానికి చాటాల్సి ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా వెలువడిన గ్రంథమే ‘పి.వి.నరసింహారావు- కొన్ని వచన రచనలు- ఒక పరిశీలన’. ఆయనలోని సాహితీమూర్తిని అవలోకనం చేసిన పుస్తకం ఇది. పీవీ రచనా వైచిత్రిని వినూత్నరీతిలో పరిచయం చేశారు రచయిత డాక్టర్ బీవీఎస్ స్వామి. పీవీ రచించిన
‘లోపలి మనిషి’ని మరింత లోతుగా విశ్లేషించారు రచయిత. సాహిత్య పరిశీలనలో భాగంగా పీవీ సన్నివేశాలను మలిచిన తీరు, పాత్రల చిత్రణ, సంభాషణలు పలికించిన వైనం, వ్యక్తి వర్ణన ..ఇలా ఆ భాషావేత్త రచనా పటిమను చిత్రికపట్టారు. ‘గొల్లరామవ్వ’ కథ, ‘మంగయ్య అదృష్టం’, ‘అబలా జీవితం’ తదితర రచనలను ప్రస్తావిస్తూ పీవీ సాహితీసాగులోని విశేషాలను సవివరంగా ఆవిష్కరించారు పుస్తక రచయిత.
పి.వి. నరసింహారావు
(కొన్ని వచన రచనలు ఒక పరిశీలన)
రచన: డా॥బి.వి.ఎన్.స్వామి
పేజీలు: 139, వెల: రూ.150
ప్రతులకు: 98490 85727,
92478 17732