అతని పాటల్లో తెలంగాణ తేజస్సు వేయిముఖాలతో దర్శనమిస్తుంది. అతని మాటల్లో మానవతా సందేశం కోటిగొంతుకలతో నినదిస్తుంది. అతనే ప్రసిద్ధకవి, సినీగీత రచయిత మాష్టార్జీ. ప్రబోధ, ప్రణయ, భక్తిగీతాలతో సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారాయన. తన పేరును మాష్టార్జీగా మార్చుకొని, అశేష ప్రజానీకానికి పాటల మాస్టారయ్యారు శ్రీరాములు.
కవిగా, గీత రచయితగా, గాయకునిగా తెలంగాణ సాహితీలోకానికి సుపరిచితులు మాష్టార్జీ. ఆయన అసలు పేరు గంగాధరి శ్రీరాములు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని బొల్లారం స్వస్థలం. తల్లిదండ్రులు గంగాధరి సత్యమ్మ, రాజయ్య. 1952 సెప్టెంబర్ 7న జన్మించారు మాష్టార్జీ. 1974లో ఉస్మానియాలో మెట్రిక్ తర్వాత, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి బీఏ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి., తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (జానపదం) పట్టాలు పుచ్చుకొన్నారు.
మాష్టార్జీ తండ్రి రాజయ్య వీధి భాగవతాల గాయకుడు. అలా తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొన్నారు మాష్టార్జీ. మేనత్త చంద్రమ్మ పాడే జానపద, తాత్విక గీతాలను వింటూ గానప్రతిభను అలవరుచుకున్నారు. అస్పృశ్యత ప్రబలిన నాటి సమాజంలో ఎన్నో ఈసడింపులను భరించారు. తన ఆత్మవిశ్వాసానికి పాటను జత చేసి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ‘రావా! నరసింహా! భక్త మనోహరా!’ అంటూ బాల్యంలో మాష్టార్జీ రాసి, పాడిన భక్తిగీతం ఎందరి హృదయాలనో ఆర్ద్రంగా తడిమింది. ఏడేండ్ల వయసునుంచే కవితా రచనను మొదలుపెట్టారు. విద్యార్థిదశలో ఉర్రూతలూపే ఉద్యమగీతాలు, ప్రేమగీతాలూ రాశారు. ఆలిండియా రేడియోలో దేశభక్తి గీతాలు గానం చేశారు. 400లకు పైగా ప్రైవేటుగీతాలు రసజ్ఞుల హృదయ వేదికలపై నర్తించాయి. అందులో ‘అందుకో దండాలు’ పాట 8 భాషల్లోకి అనువాదమై, అనేకమంది మన్ననలు అందుకుంది. 2001లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ప్రపంచజాతుల సదస్సులో నల్లజాతీయులపై ‘బ్లాక్ ఈజ్ బ్యూటీ’ అనే ఇంగ్లీష్ పాటను మాష్టార్జీ అప్పటికప్పుడే రాసి పాడారు. ఇవేకాకుండా ‘వెన్నెలగానం’, ‘మట్టిపూలు’, ‘ఔనుమల్లా’ మొదలైన గ్రంథాలనూ వెలువరించారు.
‘జానీ’తో చిత్రసీమలోకి..
2004లో సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రోత్సాహంతో ‘జానీ’ సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టారు మాష్టార్జీ. అయితే, అంతకుముందే ఆయన రాసిన ‘వీరులార మీకు.. ఎర్రెర్ర దండాలు’ పాటను 1999లో వచ్చిన ‘శ్రీరాములయ్య’ సినిమాలో వాడుకొన్నారు. జానీ సినిమాకోసం మాష్టార్జీ రాసిన ‘నారాజు గాకుర మా అన్నయా.. నజీరు అన్నయా’ అనే పాట సమాజానికి గొప్ప ఆత్మశక్తినిచ్చింది. ‘కులమతాల గొడవలు మనకెందుకురన్నా’ అనే పంక్తుల్లో అందరూ ఐకమత్య పథంపై కలిసి నడవాలని, కులమతాల కుళ్లును తొలగించుకోవాలని నినదించారు. ‘గంగా జమునా తెహజీబ్’ లాంటి హైదరాబాద్ నగరఖ్యాతిని చాటుతూ రాసిన ఈ పాట మాష్టార్జీకి ఎంతో పేరు తెచ్చింది. ఇదే సినిమాలో ‘రావోయి మా ఇంటికి.. మావా’, ‘సారా దాగుట మానరా’ పాటలనూ అందించారు.
హైదరాబాదీయతను చాటుతూ..
‘మనోరమ’ (2009) సినిమాలో ‘హైదరాబాద్ అంటేనే పానిపూరి.. ఈ చాట్ని మించింది లేదు వోరి’ అంటూ భాగ్యనగరంలో ప్రసిద్ధ తినుబండారమైన ‘పానీపూరి’ ప్రత్యేకతను చాటారు. ‘లష్కర్ పట్నములున్నోళ్లంత చేరి తిననీకి వస్తారు నోరూరి’ అంటూ.. హైదరాబాదీయతను అద్భుతంగా అద్దుకొన్నదీ పాట. తర్వాత ‘గల్ఫ్’ (2017) చిత్రం కోసం ‘మేరే అల్లా.. మేరె మౌలా.. కడతాను నిలువెల్లా నా కనులు వీడని కలల గుడిని ఎదనెల్లా’ అన్న పాటను రాశారు. ప్రశాంతంగా సాగే జీవితాన్ని తనకు కానుకగా అందించిన భగవంతుడికి ఓ భక్తుడు సమర్పించే గీతమాలిక ఇది.
అడవితల్లికి అక్షర నీరాజనం..
నగరం చుట్టూ, యువత చుట్టూనే కాదు, అడవుల వెంట, పల్లె జనాల వెంటకూడా తన పాటలు పరుగులు తీస్తాయని నిరూపించారు మాష్టార్జీ. ‘అడవి నా తల్లిరో’ సినిమాకోసం ఆయన ఇలాంటిదే ఓ అద్భుత గీతాన్ని అందించారు. ‘అడవి నా తల్లిరో.. విరబూసిన మల్లిరో’ అంటూ అడవితల్లికి అక్షర నీరాజనం పట్టారు. ‘గుడుంబా శంకర్’, ‘సూర్యం’, ‘కోనసీమలో చిట్టెమ్మ కిట్టయ్య’ మొదలైన 20 సినిమాలకు దాదాపు 30కి పైగా పాటలు రాశారు. నాలుగు సినిమాల్లో నటించారు. మరో మూడు సినిమాల్లో పాటలుకూడా పాడి తన ప్రతిభను చాటారు. బహుముఖ ప్రతిభావంతుడైన మాష్టార్జీ రచనలపై పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు పరిశోధనలు చేశారు.
హుషారు గీతాలతోనూ..
శ్రీరాములయ్య, జానీ చిత్రాల్లో విప్లవ, సామాజిక పాటలతో సత్తా చాటిన మాష్టార్జీ యువతను ఆకట్టుకొనే గీతాలనూ రాయగలనని నిరూపించారు. ‘తపన’ (2005) సినిమా కోసం ‘ఐలవ్ యూ మై డార్లింగ్ దండిగా.. నువు ఎస్ అంటే బతుకంతా పండగా’ అంటూ హుషారు గీతం రాశారు. కమర్షియల్ సినిమా పాటలకు కావలసిన పదాల సరుకు తన కలంలో పుష్కలంగా ఉందని చాటిచెప్పారు. తర్వాత ‘అన్నవరం’ (2005) చిత్రంలో దోపిడీ విధానాన్ని, అక్రమార్కుల అవినీతిని కాలరాస్తూ మరో విప్లవగీతాన్ని అందించారు. ‘రాక్షసరాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలియుద్ధం.. కత్తికి కండగ నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్ధం’ అంటూ, అన్యాయానికి కాలం చెల్లిందని చాటి చెప్పారు.
…?తిరునగరి శరత్ చంద్ర
6309873682