నేటి యువతకు బుక్ అంటే ‘ఫేస్బుక్’. పేజీ అంటే ‘ఎఫ్బీ అకౌంట్’. క్యాంపస్ అంటే వాట్సాప్ యూనివర్సిటీ.స్మార్ట్ టెక్నాలజీ ఇంతగా మన ఆలోచనల్ని మార్చేసింది, పుస్తకాన్ని మరిపించింది.కానీ, నిజానికి పుస్తకం ఒక విజ్ఞాన సర్వస్వం. ఇంటర్నెట్తో ఇష్టారాజ్యంగా విహరిస్తున్న ఈ తరాన్ని లైబ్రరీల్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నది.. జస్ట్ బుక్స్.
RRR అంటే.. చాలామంది దృష్టిలో రాజమౌళి, రామారావు, రామ్చరణ్ల కాంబినేషన్లో వస్తున్న
కొత్త సినిమా. ఆ మూడక్షరాలను Rent.. Read.. Return అని కూడా చదువుకోవచ్చు. ‘జస్ట్ బుక్స్’ లైబ్రరీ పరిచయం చేస్తున్న ఓ కొత్త పథకం పేరిది. పసి వయసు నుంచే పుస్తక పఠనం అలవాటు చేస్తే కంప్యూటర్ రాజ్యంలోనూ అక్షర ప్రియులను తయారుచేయవచ్చని నిరూపించింది జస్ట్ బుక్స్. బెంగళూరు కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తున్నది. ఇది డిజిటల్ యుగం. కూర్చున్న దగ్గరకే ప్రపంచాన్ని రప్పించే అద్భుత ఆవిష్కరణల జమానా. పాఠకుడిని తన దగ్గరకు రప్పించే సత్తా పుస్తకానికి ఉందనే నమ్మకంతో జస్ట్ బుక్స్ ప్రారంభమైంది. ఆరంభంలో అనుకున్నది జరగకపోయినా, ఆటుపోట్లు వెంబడించినా అదే నమ్మకంతో కొనసాగుతున్నది. ఇప్పుడిప్పుడే ఆ విశ్వాసం నిజం అవుతున్నది. డేటా విశ్లేషణ సంస్థ స్టాటిస్టా ప్రకారం.. 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఇ-బుక్ అమ్మకాల కంటే, ముద్రిత పుస్తకాల విక్రయాలేఎక్కువ. భారతదేశంలో ముద్రిత పుస్తకాన్ని 24.5 శాతం మంది కొనుగోలు చేస్తే,ఇ-బుక్స్ను 5.6 శాతం జనాభా మాత్రమే ఇష్టపడుతున్నారు.
మంచి టర్నోవర్
జస్ట్ బుక్స్ 2008లో ప్రారంభమైంది. బెంగళూరుకు చెందిన ఐటీ నిపుణుడు సుందర్ రాజన్ దీన్ని స్థాపించారు. వెంచర్ క్యాపిటలిస్ట్ సురేశ్ నరసింహ ప్రస్తుతం లీజ్ మీద నడిపిస్తున్నారు. జస్ట్ బుక్స్ను రాజన్ ప్రారంభించినప్పుడు అసలు ఇ-రీడర్లు లేరు. కానీ మధ్యలో చాలా మార్పులు వచ్చాయి. కిలోమీటర్ల దూరం వెళ్లి లైబ్రరీలో చదువుకోవడం అంటే ఇష్టపడని వాళ్లకు పుస్తకాలను హోం డెలివరీ చేస్తూ జస్ట్ బుక్స్ మార్కెట్ను ఆకర్షించింది. ఆరు నెలల్లో 2000 మంది సభ్యులుగా చేరారు. మూడేండ్లలో పుణె, చెన్నై, హైదరాబాద్, గురుగ్రామ్, విశాఖపట్నం, ముంబై, కోయంబత్తూరు, ఎర్నాకులం వంటి 14 నగరాలకు విస్తరించింది. అక్కడ 90కి పైగా జస్ట్ బుక్స్ ఉపకేంద్రాలు ఉన్నాయి. వార్షిక టర్నోవర్ రూ.4 కోట్లకు చేరుకున్నది. సవాళ్లను అధిగమిస్తూ తెలుగు, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, మరాఠీ, హిందీ, మళయాల భాషల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. దీనివల్ల పరిస్థితిలో మార్పు కనిపించింది. ‘కల్చరల్ ప్లేస్’ మరో ప్రయోగం. ఇదో ఆన్లైన్ విభాగం. ఇక్కడ పిల్లలకు పాఠాలు నేర్పుతారు. కొవిడ్ వల్ల పిల్లల చదువు అగమ్యగోచరంగా మారింది కాబట్టి, పఠనంపై ఆసక్తి పెట్టించినట్టూ ఉంటుంది, సృజనాత్మకతను వెలికి తీసినట్లూ ఉంటుందనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టారు.
పుస్తకానికి ప్రాణం
‘జస్ట్ బుక్స్’ లైబ్రరీలకు కొత్త నిర్వచనం చెప్పే స్థాయికి ఎదిగింది. ఆన్లైన్లో తబలా క్లాసులు తీసుకుంటుంది. గణితం బోధిస్తుంది, కథలు చెబుతుంది. జస్ ్టబుక్స్ కల్చర్ ప్లేస్లో యువ పేరెంట్స్ 75-80% ఉన్నారు. 20-25% మంది సీనియర్ సిటిజన్లు ఉన్నారు. పుస్తక భాగస్వామ్యాన్ని సులభతరం చేసేందుకు కొత్త యాప్ను రూపొందించారు. ఇంట్లో ఖాళీగా ఉన్న పుస్తకాలను జస్ట్ బుక్స్ లైబ్రరీలో పెట్టుకోవచ్చు. ఎవరైనా అద్దెకు తీసుకుంటే ఓ పది రూపాయలు వస్తాయి. ఎవరూ తీసుకోకపోయినా నష్టమేం లేదు. మన అటక మీద ఉండాల్సిన పుస్తకాలు దర్జాగా జస్ ్టబుక్స్ అరల్లో కొలువుదీరతాయి. ఆడియో బుక్స్పైనా దృష్టి సారించబోతున్నది జస్ట్ బుక్స్. కరోనా లాంటి సంక్షోభ సమయాల్లో మనుగడే ఓ విజయం! లాంగ్లివ్.. జస్ట్ బుక్స్!
కొంగొత్త ఆశలు
సాంకేతికత వల్ల సన్నగిల్లుతున్న పుస్తక పఠనాసక్తిని మెరుగుపరిచేందుకు జస్ట్బుక్ ప్రతినిధులు హోం డెలివరీ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. పన్నెండు కిలోమీటర్ల పరిధిలో ఈ సౌకర్యం కల్పించడంతో ఇంకొంత కలిసి వచ్చింది. సభ్యత్వం ఉన్నవారు నేరుగా వచ్చి నచ్చిన పుస్తకాలను తీసుకెళ్లి చదువుకోవచ్చు. వ్యాపారం ఒక కొలిక్కి వచ్చిందనుకునే సమయానికి కొవిడ్ దెబ్బకొట్టింది. లైబ్రరీలు మూతపడ్డాయి. కొవిడ్ కంటే ముందు జస్ట్బుక్స్ సంవత్సరానికి రూ. కోట్ల విలువైన పుస్తకాలు కొనుగోలు చేసేది. దేశంలో అత్యధికంగా పుస్తకాలు కొనుగోలు చేస్తున్న లైబ్రరీల్లో ఇది ఒకటి. కొవిడ్ వల్ల పుస్తకానికి డిమాండ్ పెరిగింది కానీ, పంపిణీలో సమస్యలు తలెత్తాయి. ఈ సవాలునూ తట్టుకొని నిలిచింది జస్ట్ బుక్స్.