అచ్చమైన పలుకుబళ్ళతో పొదుగుకున్న స్వచ్ఛమైనమాండలికం ఆయనది. సినిమా పాటైనా, చైతన్య గీతమైనా ఆ కలం నుంచి అలవోకగా జాలువారుతుంది. ‘గుడుంబ కుండవెట్టకే..’ అంటూ సారా తయారీని వారించినా, ‘బార్డర్లోసైనికుడా..’ అంటూ వీర జవాన్లను కీర్తించినా ఆయనకే చెల్లింది. గీతరచయితగా, గాయకుడిగా, నటుడిగా ప్రతిభావంతుడు..నేర్నాల కిషోర్.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని మిర్జాపూర్లో 1979 నవంబర్ 15న జన్మించారు నేర్నాల కిషోర్. తల్లిదండ్రులు హనుమయ్య, ఐలమ్మ. హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే కవితలు, పాటలు రాయడం ప్రారంభించారు. వాటన్నిటితో ‘నగారే మోగింది’ పేరుతో ఆడియో క్యాసెట్ విడుదల చేశారు. ‘ఎట్లున్నవే నా పల్లె నువ్వెట్లున్నవే నా తల్లి’, ‘బాడర్లో సైనికుడా.. భారత్కూ రక్షకుడా!’, ‘పొడిసేటి పొద్దోలే ఎలమంద’ లాంటి ఐదొందలకు పైగా ప్రైవేటు గీతాలు రాశారు. తానే స్వయంగా పాడారు కూడా.
‘ఊరు మనదిరా’..
సినిమాల్లో పాటలు రాయాలనే సంకల్పంతో 2001లో హైదరాబాద్కు వచ్చారు కిషోర్. ఆ ప్రయత్నంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. 2002లో వచ్చిన ‘ఊరు మనదిరా’ సినిమాలో ‘గుడుంబ కుండవెట్టకే..’ పాటతో సినీపాటల ప్రయాణాన్ని ప్రారంభించారు. పల్లె ప్రజల జీవన స్థితిగతులను తన రచనలో ఎంతో సహజంగా పొందుపరిచారు.
‘గడిలోని కోడిపుంజు గండిపేటక్క.. గుడిసె పెట్టమీద కన్నేసె గండిపేటక్క’ వంటి పంక్తులతో పల్లెలోని ప్రేమకథల వ్యవహారాలు కండ్లకు కట్టారు. స్వచ్ఛమైన యాస, తెలంగాణ మాండలిక సౌందర్యం.. ఈ పాటకు ప్రేక్షకులతో పట్టాభి షేకం చేయించాయి. ఆ తర్వాత ‘గంగమ్మ జాతర’(2004) సినిమాలోనూ ‘గంగమ్మా ఓ గంగమ్మా.. నా గంగమ్మా నా కన్నతల్లి గంగమ్మా’ అనే పాటద్వారా దొరకొడుకు చేతిలో మోసపోయిన దీనురాలి కన్నీటి కథను ఎంతో విషాదాత్మకంగా వివరించారు. తన కూతురికి జరిగిన అన్యాయానికి తల్లడిల్లుతున్న తండ్రి ఆవేదననూ ప్రస్తావించారు. ‘నీ దీనగతి జూసి కుంగిపోయానే గంగమ్మా.. నా బిడ్డ బతుకులో వెలుగు నింపుటకు కన్నతండ్రిగ నేను కరిగిపోతాను’ అనే వాక్యాల్లో బిడ్డకోసం ఒక తండ్రి పడే ఆరాటం, చూపించే ప్రేమ కండ్లముందు ఆవిష్కృతం అవుతాయి.
పల్లెనూ.. ప్రకృతినీ
‘అమ్మమీద ఒట్టు’(2005) సినిమాకోసం ‘రాగం పుట్టింది రామచిలక నోటి వెంటా..’ అనే పాట రాశారు కిషోర్. ఇందులో పల్లెను, ప్రకృతినీ సంగీతానికి నిలయంగా భావించిన తీరు అబ్బుర పరుస్తుంది. కొండా కోనల్లో వినిపించే ధ్వనులను తాళాలుగా, సెలయేటి గలగలలను స్వరాలుగా ఊహిస్తూ పల్లెసీమలోకి పాట ఎలా అడుగుపెట్టిందన్నది ఎంతో రమణీయంగా చెప్పారు. ‘అమ్మలాంటి గంగిగోవు అంబా అనే పాట.. సిన్నిమేక పిల్లల అల్లరి చప్పుళ్ళు, ఊరంతా కల తిరిగే ఊరవిసుక చప్పట్లు’ వంటి పంక్తుల్లోని భావం ఎంతో లాలిత్యంగా కనిపిస్తుంది. గోవు అరుపులో, మేకపిల్ల అల్లరిలో, ఊర పిచ్చుక చప్పుళ్ళలో సంగీతం ఉందనీ, వినగలిగే హృదయముంటే ప్రకృతిలోని అణువణువునా సంగీతం వినిపిస్తుందనీ ఈ పాటద్వారా తెలిపారు కిషోర్.
కార్మికన్నకు సలామ్
‘వేగుచుక్కలు’ (2003) సినిమాలో ‘వందనమో వందనమన్నా మాయన్నో కార్మికుడా!’ అంటూ శ్రమశక్తికి అక్షరాలతో వందనాలర్పించారు. పగలూ రాత్రి తేడా లేకుండా చెమటోడ్చి పని చేసే కష్టజీవులకు హారతి పట్టిన పాట ఇది. కార్మికుల నిరంతర శ్రామిక జీవనాన్ని ఎలుగెత్తి చాటారు ఈ పాటలో. ‘సెమట సుక్కల వందనమన్నా సేలసెలకలా వందనమన్నా.. నీకు సుత్తి సమ్మెట వందనమే.. నీకు సైరను మోతల వందనమే మా అన్నా కార్మికుడా!’ అనే పంక్తుల్లో చెమట చుక్కలు, చేనూచెలకలు, సుత్తి, సమ్మెట, సైరన్ మోతలు.. అన్నీ కలిసి శ్రామికుని తిరుగులేని కృషికి సలాం చేస్తున్నాయనడం అద్భుతంగా ఉంది. ‘వీర తెలంగాణ’ (2010) సినిమాలో కిషోర్ రాసిన ‘తల్లి తెలంగాణ’ అనే ఒగ్గుకథ కూడా విశేషంగా గుర్తింపు పొందింది. ‘అమ్మా నీకు వందనాలు అమ్మా వందనాలే.. మాయమ్మ తెలంగాణ..’ అంటూ సాగిన ఈ ఒగ్గుకథలో తరతరాలుగా దోపిడీ పాలనలో నలిగిపోయిన తెలంగాణ వీరభూమిని గురించి, దాని చారిత్రక వైభవాన్ని, పౌరుషాన్ని చాటి చెప్పారు. నిజాం పాలనలో పేదలపై జరిగిన అకృత్యాలు, అరాచకాలు, అక్రమాలను కండ్లముందు సాక్షాత్కరింపజేశారు. ఇవే కాకుండా పయనం, చంద్రన్న మొదలైన సినిమాలకూ పాటలు రాశారు. సమాజ క్షేమాన్ని, సంస్కారాన్ని ఆకాంక్షించే అభ్యుదయ గీతాలు, మరెన్నో సినీగేయాలు ఆయన కలం నుంచి జాలు వారాయి. నేర్నాల కిషోర్ రాసిన పాటలన్నీ స్పష్టమైన తెలంగాణీయతను ఆవిష్కరిస్తూ, అందరి మన్ననలూ అందుకుంటున్నాయి. తెలుగు సాహిత్యంలో ఆయను అపారంగా ప్రభావితం చేసిన మహా రచయితలు ఎంతోమంది. జానపద గీతాలూ తనకు ప్రేరణ కలిగించాయని చెబుతారు కిశోర్. ఓ నటుడిగానూ తనదైన ముద్ర వేసుకు న్నారు. ఆయనది బహుముఖ పాండిత్యం.
-తిరునగరి శరత్ చంద్ర , 6309873682