ఒకప్పుడు టీవీలో అడ్వర్టయిజ్మెంట్ వస్తుందంటే, అందులో అమితాబ్ బచ్చన్లూ, మహేశ్ బాబులూ కనబడేవారు. సబ్బులు, క్రీములు, పౌడర్లకు అయితే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఫామ్లో ఉన్న హీరోయిన్లంతా దర్శనమిచ్చేవారు. క్రమంగా ఈ ట్రెండ్ మారుతూ వచ్చింది. సింగర్లు, టీవీ ఆర్టిస్ట్లు వచ్చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుల హవా నడుస్తున్నది. ఇదీ యాదృచ్ఛికం కాదు. దీని వెనుకో వ్యూహం ఉంది.
ప్రేక్షకులు హీరోలను అభిమానిస్తారు, హీరోయిన్లను ఆరాధిస్తారు. కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులను ఏ బంధువుతోనో, ఆత్మీయుడితోనో పోల్చుకుంటారు. మాటల రచయితలు కూడా కథానాయకులకు పంచ్ డైలాగులు రాసి చేతులు దులిపేసుకుంటారు. భారీ డైలాగులన్నీ క్యారెక్టర్ ఆర్టిస్టుల ఖాతాలోకే తోసేస్తారు. కథలో ముఖ్యమైన మలుపులన్నీ క్యారెక్టర్ ఆర్టిస్టుల చుట్టే తిరుగుతాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులకు జనంలో కనిపించని ఓ క్రేజ్ ఉంటుంది.
“నడివయసు క్యారెక్టర్లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. అందుకే, వాళ్లతోనూ ఎండార్స్ చేయిస్తున్నాం” అంటున్నారు బ్రాండ్ స్ట్రాటజిస్ట్ హరీశ్ బిజూర్.
మల్టీ బ్రాండ్ ఎండార్స్
బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లు చేస్తూ ఎంతోమందికి అభిమాన నటుడయ్యారు. అలాగే, ఓటీటీలో ప్రసారమైన మీర్జాపూర్ వెబ్ సిరీస్ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. గత రెండు వారాల్లోనే ఆయన నాలుగు బ్రాండ్లకు సంతకం చేశారు. గ్లూకోన్-డి, అబ్జార్బ్, నిలన్స్, బ్రిటానియా మిల్క్ బికీస్ (100 శాతం గోధుమలతో) మొదలైన బ్రాండ్లకు ఎండార్సర్ తనే. మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గిరిరాజ్ రావుకూడా ఇటీవలే టాటా స్టీల్స్కు చెందిన టాటా ప్రవేశ్ డోర్స్కు ఎండార్సర్గా మారారు. ‘లగే రహో మున్నాభాయ్’, ‘జాలీ ఎల్ఎల్బీ’తో మంచిపేరు సంపాదించుకున్న సౌరబ్ శుక్లా మ్యాన్ కైండ్ ఫార్మా కంపెనీకి చెందిన గ్యాస్ ఓ ఫాస్ట్కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. బొమన్ ఇరానీకూడా జీటీపీఎల్ హ్యాత్వే, ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఉత్పత్తులను జనంలోకి తీసుకెళ్తున్నారు. గతంలో ఐటీసీ సావ్లాన్, పీఅండ్జీ వారి అంబిపుర్ వంటి బ్రాండ్లను ఎండార్స్ చేశారు.
ఔదార్యానికి ఫిదా..
లోకల్గానూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఏ తెలుగు టీవీ చానెల్ చూసినా యాడ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్టులే కనిపిస్తున్నారు. కమెడియన్స్ నుంచి విలన్ల వరకు చాలామంది ఎండార్సర్ల అవతారం ఎత్తారు. పేపర్ల ప్రకటనల్లో, హోర్డింగుల మీదా దర్శనమిస్తూ బ్రాండ్కు బ్యాండ్ బాజా మోగిస్తున్నారు. అందులోనూ, ఈమధ్య ఎక్కువగా కనిపిస్తున్న ముఖం పాన్ ఇండియా నటుడు సోనూసూద్. కరోనా సమయంలో తన మానవతా హృదయాన్ని చాటి చెప్తూ నలుగురికీ ఆదర్శంగా నిలిచిన సోనూసూద్ అయితే, బ్రాండ్లకు జేమ్స్ బాండే! ఎమ్ఫైన్ హెల్త్ కేర్, రీబ్యాలెన్స్ ఎనర్జీ డ్రింక్, ఏసర్ పీసీ, జీప్ ఆటోమొబైల్ బ్రాండ్, లాండ్రీ డిటర్జెంట్ బ్రాండ్ ఊష్, షావోమీ, స్పైస్ మనీ, శ్యామ్ స్టీల్, లెన్స్కార్ట్, ఐఎస్ఎం ఎడ్యూటెక్, ఎంపీఎల్.. ఇలా చెబుతూ పోతే ఆయన ఖాతాలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి.
కమెడియన్ టు క్యారెక్టర్ ఆర్టిస్ట్..
కమెడియన్ అలీ కొన్నేండ్లుగా రకరకాల బ్రాండ్లని ఒంటి చేత్తో ప్రమోట్ చేస్తున్నారు. అల్లు అర్జున్తో కలిసి రెడ్బస్, సీనియర్ నటుడు జీవాతో కలిసి సెంటర్ ఫ్రూట్ని ప్రమోట్ చేశారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా ప్రస్తుతం గ్యాస్ ఓ ఫాస్ట్కు ప్రచారకర్త. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు స్ర్పైట్ సీసా పట్టుకుని ‘ఇది క్లియర్’ అంటున్నారు. తెలుగు ప్రేక్షకుల కట్టప్ప సత్యరాజ్ ఆచి చికెన్ మసాలాకు తన బ్రాండింగ్తో కొత్త రుచి తెచ్చారు.
తెలుగువారి అమ్మ బామ్మ అన్నపూర్ణమ్మ కూడా త్రీ మ్యాంగో కారం పొడిని ఘాటుగానే ప్రమోట్ చేస్తున్నారు. సినిమాల్లో అక్క, వదిన క్యారెక్టర్లు చేసే ప్రియ, సురేఖావాణి వంటి నటీమణులు డబుల్ హార్స్ మినుపగుళ్లు బ్రాండ్ని ఎండార్స్ చేస్తున్నారు. ఇలా, ప్రేక్షకాదరణ పొందుతున్న ఎంతోమంది తెలుగు సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు రకరకాల బ్రాండ్లకు ఓ క్యారెక్టర్ ఇస్తున్నారు. నిజానికి ఈ ఎంపిక వెనుక ఓ ఆర్థికకోణం కూడా ఉంది. ఏ హీరోతోనో హీరోయిన్తోనో పోలిస్తే క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికం నామమాత్రం, కానీ ప్రభావం అపారం!