కొవిడ్ హడావుడి ఇంకా తగ్గనేలేదు. కేసులు భయపెడుతూనే ఉన్నాయి. కలవరపెట్టే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీటన్నిటి మధ్యా ఓ ఆసక్తికరమైన నివేదిక వెలువడింది. కొవిడ్ కొందరిలో ఎందుకని ఇలా వచ్చి అలా తగ్గిపోతుంది, మరికొందరిని ఎందుకని మరణపు అంచుల వరకూ తీసుకెళ్తుంది? అన్న ప్రశ్నకు సమాధానాన్ని వెతికిన పరిశోధన ఇది. Institute for Systems Biology సంస్థ జరిపిన ఈ పరిశోధన కోసం 200 మంది కొవిడ్ రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. వీటి ద్వారా 1,387 జన్యువుల తీరును గమనించారు. ప్లాస్మాలోని 1,050 రకాల జీవక్రియలకు సంబంధించిన రసాయనాలను కూడా గమనించారు. శరీరంలోకి కొవిడ్ వైరస్ ప్రవేశించినప్పుడు వీటిలో వచ్చే మార్పులు ఒక్కొక్కరిలో, ఒక్కో తీరున కనిపించాయి. దాన్నిబట్టి శరీరం మీద కొవిడ్ ఎలాంటి ప్రభావం చూపుతుందో పసిగట్టవచ్చని తేల్చారు. ఈ పద్ధతి ద్వారా ఎలాంటివారిలో కొవిడ్ ప్రమాదం తీవ్రంగా ఉండే అవకాశం ఉందో గ్రహించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు!