గోధూళి వేళ. సిరిమువ్వల సందడి. గోపాలకవృత్తిలో అలసిన పశువుల కాపరులంతా ఇంటిబాట పడుతున్నారు. ఆ గోకులంలో ప్రతి ఇంటి ముందూ దివ్వెలు పరుచుకుంటున్నాయి. కానీ, నందుని ఇంట మాత్రం అలజడి రాజ్యమేలుతున్నది. కన్నయ్య ఇంకా రానేలేదని యశోదమ్మ కలత పడుతున్నది. ‘పొద్దునేమైనా ముద్దుల కృష్ణయ్య అలిగి ఉన్నాడా!’ అని గుర్తుచేసుకునేప్రయత్నం చేస్తున్నది. ‘మా ఇండ్లను పాలుపెరుగు మననీయడమ్మా!’..అంటూ ఇరుగుమ్మపొరుగమ్మలు చెప్పిన చాడీల వల్ల తను గట్టిగా మందలించిన మాటా నిజమే. కానీ బుజ్జిపొట్టలో బ్రహ్మాండాన్ని దాచుకున్నవాడు, అమ్మ మీద కోపగిస్తాడా? పోనీ ఏదైనా ఆపద వచ్చిందేమో! పూతనను పిప్పి చేసి, శకటాసురులను ఎగరగొట్టినవాడికి హాని జరిగే ప్రసక్తే లేదు. దారి తప్పాడా? అంటే ముముక్షులకు వైకుంఠ మార్గం చూపేవాడికి బాటలు తెలియవా? మరి ఏమైనట్టు?ఇంతలో… మంద్రంగా వేణునాదం. అది కన్నయ్య రాకకు సూచన. ఆ సద్దుతో రేపల్లె మొత్తం సందడిగా మారిపోయింది. శిశువు నుంచి పశువు దాకా… ప్రతి జీవీ మరోసారి ప్రాణం పోసుకున్నట్టుగా తలవిదిలించింది. అప్పటివరకూ యశోదమ్మ తాను మాత్రమే గోపాలుడి రాక కోసం నిరీక్షిస్తున్నానని అనుకుంది. కానీ గోకులంలో చెట్టూ పుట్టా గాలీ ధూళీ.. అన్నీ అతని ఉనికి కోసమే ఊపిరి తీసుకుంటున్నాయని గమనించలేదు. ఆ మాటకు వస్తే కృష్ణభక్తులకు ప్రతి ఇల్లూ రేపల్లే. ప్రతి రోజూ జన్మాష్టమే! అందుకే కృష్ణతత్వం ఓ నమ్మకంగా మాత్రమే మిగిలిపోలేదు. మన జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చింది. వాటిని స్పృశించే ప్రయత్నమిది.. సృశించే ప్రయత్నమిది!
-కె.ఎల్. సూర్య
భక్తుల మనసులో కృష్ణుడు దైవం మాత్రమే కాదు. ‘మనిషి అంటే ఇలా ఉండాలి’ అని సూచించే పూర్ణ స్వభావం. అందుకేనేమో తనను పరిపూర్ణ అవతారంగా భావిస్తుంటారు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యమైనా, గీతాబోధతో జగద్గురువుగా మారినా, సాంఖ్యయోగంతో వేదాంతాన్ని చూపినా తనకే సాధ్యమైంది. ప్రమాదంలో ఆదుకునే నేస్తం తనే, జీవిత రథచక్రాలను నడిపించే మార్గదర్శకుడూ అతనే. అష్టసఖుల ముచ్చట తీర్చినా, కుచేలుడి పాలిట కుబేరుడైనా… ఆ నల్లనివానికే చెల్లింది. అందుకే తనను నమ్మినవారి పాలిట కృష్ణుడు ఓ సూపర్హీరో! భారతీయ సంప్రదాయంలో, జీవనవిధానంలో పెనుమార్పులు తీసుకువచ్చిన తత్వమిది. చాలా సందర్భాలలో కృష్ణ చైతన్యం నిశబ్దంగా సమాజ గమనాన్నే మార్చేసింది.
భక్తి ఉద్యమం
మన సంప్రదాయాలు, విశ్వాసాల మీద అనూహ్యమైన ప్రభావం చూపిన మజిలీలలో భక్తి ఉద్యమం ఒకటి. అప్పటివరకూ భగవంతుని చేరుకునేందుకు క్రతువులూ, కులాలే ప్రధానమని అనుకునేవారు. కానీ, భక్తి ఉద్యమం సమూలమైన మార్పు తెచ్చింది. దైవం అందరి హృదయంలోనూ కొలువై ఉంటాడనీ… నమ్మకంతో, నామస్మరణతో అతడిని ప్రసన్నం చేసుకోవచ్చనే భావన కలిగించింది. అందుకే నిమ్న వర్గాలకు చెందినవారు కూడా భక్తి ఉద్యమకారులుగా, అపూర్వమైన సాహిత్యాన్ని సృజించారు. ఏడో శతాబ్దంలో… దక్షిణ భారతదేశంలోని నయనార్లు, ఆళ్వార్లతో మొదలైన భక్తి ఉద్యమం క్రమంగా ఉత్తరాదికి చేరుకుంది. వెయ్యి సంవత్సరాల పాటు ఆ ప్రభావం కొనసాగింది. ఇందులో కృష్ణభక్తి పాత్ర కీలకం. అందుకు ఆళ్వార్ల రచనల సమాహారమైన దివ్యప్రబంధమే సాక్ష్యం. ఉత్తరాదిలోనూ కృష్ణజప ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకువెళ్లింది. భౌతికంగా ఇది భక్తికి సంబంధించిన వ్యవహారంగా తోచినా.. నాటి సంస్కృతి, సంప్రదాయాల మీద అనూహ్యమైన ప్రభావం చూపింది. ఆ భక్తి ఉద్యమకారులు సృజనతో, విశ్వాసంతో నాటి సమాజం మీద ఎలాంటి ముద్ర వేశారో స్పష్టమవుతుంది.
జయదేవుడు:
‘గీతగోవిందం’ పేరుతో అష్టపదులు రాశాడు. మధురభక్తిని పరాకాష్టకు తీసుకువెళ్లాడు. పైపైకి భౌతికమైనవిగాతోచే కృష్ణ-గోపికల విరహాన్ని ఆత్మ-పరమాత్మల కలయికకు సూచనగా ప్రకటించాడు. ధీర సమీరే యమునా తీరే, సా విరహే తవ దీనా, ప్రియే చారుశీలే… అంటూ ఇప్పటికీ సంగీతలోకాన్ని పరవశింపచేసే గీతాలు వెయ్యేండ్ల క్రితం ఎంత ఉర్రూతలూగించి ఉంటాయో కదా! జయదేవుని అష్టపదులు పాటలుగా, రూపకాలుగా, నృత్యంగా, సంగీతంగా, చిత్రలేఖనంగా… ప్రతి కళనూ ప్రభావితం చేశాయి.
చైతన్య మహాప్రభువు:
భక్తి ఉద్యమం అనగానే గుర్తుకు వచ్చే పేరు ఇది. సాక్షాత్తు రాధాకృష్ణుల అవతారంగా భక్తులు కొలుచుకునే చైతన్యుడు… హరేకృష్ణ నామాన్నే మహామంత్రంగా ప్రచారం చేస్తూ విస్తృతంగా పర్యటించారు. మానవులంతా ఒకటేనంటూ పంకి ్తభోజనాలను కూడా ప్రోత్సహించారు. భక్తుల జ్ఞాపకాల్లోంచి కనుమరుగవుతున్న బృందావన క్షేత్రానికి పునర్వైభవం తెచ్చారు చైతన్యులు. ఆయన ముఖ్య శిష్యులను ‘ఆరుగురు బృందావన గోస్వాములు’గా పేర్కొంటారు. వారిలో ఇద్దరు (రూప గోస్వామి, సనాతన గోస్వామి) తెలుగువారే. సూర్దాస్ – మై నహి మాఖన్ ఖాయో (నేను వెన్న తినలేదుగా) అనే భజన వినని కృష్ణభక్తులు ఉండరు. 15 శతాబ్దానికి చెందిన సూర్దాస్ రాసిన వేలాది కీర్తనలలో ఇదీ ఒకటి. పుట్టుగుడ్డిగా జన్మించి ఇంట్లో వాళ్ల తిరస్కరణకు గురైన సూర్దాస్, కృష్ణభక్తిలో సాంత్వన పొందాడు. ప్రముఖ గురువు వల్లభాచార్యుని ప్రియశిష్యులలో ఒకరిగా మెలిగాడు. భక్తి అనేది కులమతాలకు, వ్యక్తిగత పరిస్థితులకూ అతీతంగా మారిందనేందుకు ఓ సూచన సూర్దాస్. ‘బ్రజ్ భాష’ అనే స్థానిక లిపిలో రాయడం వల్ల… అప్పటికే క్షీణదశకు
చేరుకున్న ఆ యాసకి ప్రాణం పోసినట్టు అయింది.
కబీర్:
భక్తి ఉద్యమంతో ప్రభావితుడైన కబీర్, దాన్ని విప్లవాత్మక స్థాయికి తీసుకువెళ్లాడు. రెండేసి పంక్తుల దోహాలతో అసాధారణమైన వేదాంతాన్ని గుప్పించాడు. క్రతువులనూ, ఆచారాలనూ నిర్దంద్వంగా తిరస్కరించి సామాజికవేత్తగా మారాడు. ‘కబీర్ పంథ్’ పేరుతో సరికొత్త భక్తిమార్గాన్ని సూచించాడు. కబీర్, సూర్దాస్ లాంటి ఉద్యమకారుల రచనలు భగవంతుని ఆరాధనను వ్యక్తిగత స్థాయికి సరళీకరించాయి. సిక్కు మతం ఆవిర్భావానికి కూడా పరోక్షంగా కారణమయ్యాయి. సిక్కుల పవిత్ర గ్రంథంలో వీరిద్దరి రచనలు కనిపించడమే ఇందుకు తార్కాణం.
మీరాబాయి:
మధుర భక్తికే అంకితమైన జీవితం తనది. ఆమె భజనలతో భక్తి ఉద్యమం తారస్థాయికి చేరుకుంది. భజనలకు సంగీత పరిజ్ఞానం అవసరం లేదు, మత గ్రంథాలతో పని లేదు. అందుకే… వాడవాడలా పరుచుకున్న మీరా భజనలు, పల్లె పదాలుగా మారాయి. ఆమె స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కీర్తనలు అల్లసాగారు. తాన్సేన్ లాంటి సంగీతకారులు హిందుస్థానీ సంగీతంలో కొత్త బాటలు వేయడానికి అలాంటి ప్రభావం కూడా కారణమే!
ఇంతమంది గురించి చెప్పుకొన్నాక తెలుగువారి గురించి ఎలా మర్చిపోగలం. శుద్ధాద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించడమే కాకుండా… కృష్ణుడే దైవంగా ‘పుష్టిమార్గాన్ని’ రూపొందించిన వల్లభాచార్యులు తెలుగువారే. మోక్షం సాధించడానికి సన్యసించాల్సిన పనిలేదన్న వల్లభాచార్యుల సూచన, చాలామందికి స్ఫూర్తిగా నిలిచింది. కృష్ణభక్తిని ప్రచారం చేసేందుకు ఆయన దేశంలో 84 చోట్ల భాగవతకథను వినిపించారట. ఇక, మొవ్వలో గోపాలుని మీద రాసిన క్షేత్రయ్య పదాలు, ఆ పక్కనే ఉన్న కూచిపూడి నృత్యానికి ఆలంబనగా నిలిచాయి. భరతనాట్యంలోనూ భాగమయ్యాయి. కర్ణాటక సంగీతం ప్రాచుర్యం చెందడంలోనూ కృష్ణభక్తిది ముఖ్యపాత్ర. గోపాలుని నామమే ఊపిరిగా బతికిన నారదతీర్థుల ‘కృష్ణలీలా తరంగిణి’ నృత్యసంగీతాలకు ముడిసరుకును అందించింది. కూచిపూడికి ఆద్యుడైన సిద్ధేంద్రయోగి ఆయన శిష్యుడే! శ్రీకృష్ణుడే స్వయంగా ఆయనతో నృత్యం చేయించేవాడట. సిద్ధేంద్రుడు రూపొందించిన భామాకలాపంతోనే కూచిపూడి ప్రాచుర్యంలోకి వచ్చింది. జానపదమైనా, శాస్త్రీయ సంగీతమైనా అన్నమాచార్యులను తల్చుకోకుండా ఉండలేము. ఆయన కీర్తనల్లోనూ బాలకృష్ణుడిది ముఖ్యపాత్ర. జోలపాటల నుంచి నృత్యరీతుల వరకూ ఈ కీర్తనలు మన జీవనవిధానంలో మమేకమైపోయాయి. సంకీర్తనాచార్యుడు బాల కృష్ణుడి లీలలను వెన్నముద్దల్లాంటి పలుకులతో వర్ణించి తరించాడు.
పురుషోత్తముడు
కృష్ణుడు తన మేనత్తకూతురు మిత్రవిందను ఇష్టపడ్డాడు. కానీ మిత్రవింద సోదరులకు కృష్ణుడంటే మంట. తన సోదరిని దుర్యోధనుడికిచ్చి పెండ్లి చేయాలన్నది పన్నాగం. మిత్ర
విందకు స్వయంవరం ఏర్పాటు చేసి రాజులందరినీ పిలిచారు, ఒక్క కృష్ణుడిని తప్ప. వచ్చినవారిలో దుర్యోధనుడే శ్రేష్టుడు కనుక, తమ సోదరి అతడినే వరించక తప్పదని వారి ఆలోచన. విషయం తెలుసుకున్న కృష్ణుడు, స్వయంవరం జరుగుతున్న అవంతీ రాజ్యానికి చేరుకున్నాడు. కృష్ణుడికి మిత్రవింద అంటే ఇష్టం. ఆమెకూ తనంటే ప్రేమని తెలుసు. కానీ ఆ విషయాన్ని నేరుగా తెలుసుకోవాలనుకున్నాడు. తన సోదరి సుభద్ర ద్వారా మిత్రవింద మనసులో తాను ఉన్నానని రూఢి చేసుకున్నాకే… స్వయంవరం నుంచి ఎత్తుకెళ్లాడు. తన కాలంలోనే భగవంతునిగా పూజలు అందుకున్నవాడు, ఇంద్రుని గర్వాన్ని సైతం అణచినవాడు… ఒక మహిళ హృదయం తెలుసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేశాడు. ఏకపక్ష ప్రేమల ఆకతాయి కుర్రకారుకు తెలియాల్సిన పాఠమిది.
లోకక్షేమమే కృష్ణ వ్యూహం
తెలంగాణలోని అనంతగిరిలోని పద్మనాభస్వామికి, కృష్ణకథలకు మధ్య ఉన్న సంబంధం చాలా కొద్ది మందికే పరిచయం. పూర్వం ముచికుందుడనే రాజు, రాక్షసులతో సుదీర్ఘకాలం పోరాడి విజయం సాధించాడు. ఆ పోరుతో ఆయన అలసిపోయాడు. తనకు సుదీర్ఘనిద్ర కావాలనీ, ఎవరైనా తనను నిద్రాభంగం చేస్తే.. వారు తన చూపులతో భస్మమైపోవాలని వరం అందుకుని అనంతగిరి పానువులలో సేదతీరాడు. ఇదే సమయంలో కాలయవనుడు కృష్ణుడి మీదకు దండెత్తాడు. తెలివిగా కాలయవనుడిని దారిమళ్లించి, ముచికుందుడు విశ్రమిస్తున్న గుహలోకి తీసుకువెళ్లాడు కపటనాటక సూత్రధారి. గుహలో ఉన్నది కృష్ణుడే అని భ్రమపడిన కాలయవనుడు, ముచికుందునికి నిద్రాభంగం కలిగించి భస్మమైపోయాడు. ఆపై కృష్ణుడు, ముచికుందునికి అనంతపద్మనాభస్వామిగా సాక్షాత్కరించాడట. నాటి ముచికుంద నది మూసీనదిగా మారిందని అంటారు.
హరేకృష్ణ ఉత్సాహం!
20వ శతాబ్దం నాటికి భక్తి ఉద్యమం చల్లబడింది. పారిశ్రామిక విప్లవంతో ఆధునిక జీవనశైలి అలవడింది. బతుకు సులభమైపోయింది. కానీ పెరుగుతున్న సుఖాలతో పాటు తెలియని బాధ ఏదో వేధించడం మొదలుపెట్టింది. పైపై మెరుగులు మందమైపోతూ… మనిషి తనకు తాను దూరమైపోతున్నాడు. ఎవరి మీద ఎదురుతిరగాలో తెలియక మత్తుపదార్థాలతో, విశృంఖల శృంగారంలో మైమరచిపోయే హిప్పీ సంస్కృతి మొదలైంది. ఇలాంటి సమయంలో ఓ 70 ఏండ్ల సన్యాసి… పాశ్చాత్య దేశాల్లో కృష్ణభక్తిని ప్రచారం చేయాలనుకున్నాడు. తను రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలను గుండెకు అదుముకుని, ఓడలో అమెరికాకు ప్రయాణమయ్యాడు. ఆయనే.. స్వామి ప్రభుపాద. అప్పటికి విదేశాల్లో ఇంకా భారతీయులంటే చిన్నచూపు, భారతీయత పట్ల చులకన ఉండేవి. అలాంటి వాతావరణంలో అడుగుపెట్టి ఇస్కాన్ అనే సంస్థను స్థాపించారు ప్రభుపాద. ఆయన రాసిన భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృతం లాంటి గ్రంథాలు లక్షల సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఆధ్యాత్మిక అయోమయంలో ఉన్నవారికి హరేకృష్ణ ఉద్యమం కొత్త మార్గాన్ని చూపించింది. జప, నామ సంకీర్తనల్లో పారవశ్యం దక్కింది. హిప్పీలను కూడా గంజాయి మత్తు నుంచి ఏమార్చి కృష్ణ మైకంలోకి మళ్లించగలిగారు.
‘నేను వాళ్లను హిప్పీల నుంచి హ్యాపీలుగా మార్చాను’ అన్నారట ప్రభుపాద.తొలి రోజుల్లో ఇస్కాన్ మీద ఆరోపణలు వచ్చాయి. హక్కులను కాలరాస్తున్నారనీ, బ్రెయిన్ వాషింగ్ జరుగుతున్నదనీ కేసులు నడిచాయి. పరాయి గడ్డ మీద అలాంటి అభియోగాలను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. కానీ తొలినాళ్ల నుంచీ ఇస్కాన్ పట్ల ప్రభావితులైన సెలబ్రిటీలెందరో అటు ఆర్థికంగా, ఇటు నైతికంగా ఆ సంస్థకు మద్దతుగా నిలిచారు. 1960లలో బీటిల్స్ అనే రాక్ బ్యాండ్ లోకాన్ని ఉర్రూతలూగించింది. అందులో ముఖ్యుడైన జార్జ్ హారిసన్, ప్రభుపాద శిష్యునిగా మారడమే కాదు… ఇంగ్లండులో కూడా ఇస్కాన్ వ్యాప్తికి సాయపడ్డాడు. కృష్ణుడి మీద హారిసన్ రూపొందించిన ‘మై స్వీట్ లార్డ్’ అనే ఆల్బమ్ ఓ సంచలనం. అప్పటి నుంచీ రసెల్ బ్రాండ్ లాంటి నటులు, ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ లాంటి పారిశ్రామికవేత్తలు హరేకృష్ణ ఉద్యమానికి అండగా నిలుస్తూనే వచ్చారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదివందలకు పైగా ఇస్కాన్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. భక్తి ప్రచారమే ధ్యేయంగా మొదలైన కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) సమాజసేవనూ స్వీకరించింది.
అందులో ‘Food for Life’ గురించి చెప్పుకొని తీరాలి. ఒకరోజు పిల్లలు, ఆహారం కోసం వీధికుక్కలతో పోట్లాడటం చూసి చలించిపోయారట ప్రభుపాద. వెంటనే తన శిష్యులతో ‘ఇక నుంచి ఇస్కాన్ మందిరాలకు పదిమైళ్ల చుట్టూ ఎవరూ ఆకలితో అలమటించడానికి వీల్లేదు’ అని చెప్పారట. అలా మొదలైన ఈ సేవ లోకంలోనే అతి పెద్ద అన్నదాన పథకంగా (శాకాహారంలో) మారింది. ప్రస్తుతం 60 దేశాలలో నిత్యం లక్షలమంది కడుపులు చల్లగా ఉంచుతున్నది. ప్రభుత్వాలు మొదలుపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఇస్కాన్ పాలు పంచుకుంటున్నది. ‘అన్నామృతం’ పేరుతో రోజూ పదిలక్షల మంది పిల్లలకు పోషకాహారాన్ని అందిస్తున్నది. ఆపదల్లో, ప్రకృతి విపత్తుల్లో బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నది ఇస్కాన్.
శ్రావణమాసం కృష్ణాష్టమి!
విష్ణుమూర్తి జన్మనక్షత్రం శ్రవణమని అంటారు. అందుకే, చంద్రుడు ఆ నక్షత్రానికి దగ్గరగా ఉండే శ్రావణ మాసం ఆయనకు ఇష్టమైన సమయం. ఈ నెలలో కృష్ణాష్టమి ప్రత్యేకత ఎలాగూ తెలిసిందే. ఆయనతో ముడిపడి ఉన్న మరో రెండు పర్వదినాలు కూడా ఆ మాసంలోనే రావడం విశేషం. ఒకటి రక్షాబంధనం! శిశుపాలుని సంహార సమయంలో కృష్ణుడికైన గాయానికి తన చీరకొంగు చింపి కట్టిన సందర్భమే ‘రాఖీ’గా మారిందని ఓ ఐతిహ్యం. ఈ నెలలో జరుపుకొనే మంగళగౌరి వ్రతం కూడా శ్రీకృష్ణుడు, సుభద్రల అనుబంధాన్ని సూచించేదే.
స్వాతంత్య్ర సంగ్రామం
స్వాతంత్య్ర సంగ్రామానికి సమాంతరంగా.. భారతీయ సనాతన ధర్మాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. ముందు వివేకానందుడు, ఆ తర్వాత పరమహంస యోగానంద (ఒక యోగి ఆత్మకథ రచయిత) అమెరికాలో అడుగుపెట్టి అనూహ్యమైన ఫలితాలు సాధించారు. వీరిద్దరూ భగవద్గీత నుంచి స్ఫూర్తి పొందినవారే. మత గ్రంథాలను శుష్క భాషణలుగా కాకుండా ఉత్తేజం రగిలించే వాక్యాలుగా భావించిన వివేకానందుడు సహజంగానే గీతను తలకెత్తుకున్నారు. ఇక యోగానంద God Talks With Arjuna పేరుతో గీత ద్వారా మనసును నియంత్రంచుకోవడం ఎలాగో వివరించారు. కృష్ణభక్తినీ, అందుకు సంబంధించిన గ్రంథాలనూ సానుకూలంగా అన్వయించుకునే విచక్షణ ఉంటే… భవిష్యత్తులోనూ ఎన్నో మార్పులకు భూమికగా మారుతుంది.
భాగవత కథలు భక్తి ఉద్యమాన్ని ప్రభావితం చేస్తే… భగవద్గీత పోరుబాటలోనూ మార్గదర్శిగా మారింది. అర్జునుడిని సంశయానికి సూచనగా, కృష్ణుడిని తిరుగులేని సమాధానంగా చూపిస్తూ.. ఏ సందర్భానికైనా అన్వయించుకోగలిగే జీవిత పాఠంగా నిలిచింది. ఆదిశంకరాచార్య నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ వరకూ ప్రతి తత్వవేత్తా తమదైన రీతిలో గీతాభాష్యం చెప్పారు. విస్తృతమైన అనువాదాలతో, ప్రచురణలతో… దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో సమయంలో పలకరిస్తున్నది భగవద్గీత. చాలామందిని ప్రభావితం చేస్తున్నది కూడా! ఇదంతా ఒక ఎత్తు అయితే, మన చరిత్రలో మేలు మజిలీగా నిలిచిన స్వాతంత్య్ర సంగ్రామంలో భగవద్గీత పాత్ర గుర్తు చేసుకుని తీరాల్సినది. అందుకు ఉదాహరణలు కోకొల్లలు…
అనిబెసెంట్: బ్రిటిష్ గడ్డ మీద పుట్టినా, భారతీయుల స్వాతంత్య్రం కోసం తపించిన అరుదైన వ్యక్తి. అనిబెసెంట్కు థియోసఫీ (దివ్యజ్ఞానం) సిద్ధాంతాల మీద అపారమైన నమ్మకం ఉండేది. అనేక మతాల సమ్మేళనంగా సాగిన థియోసఫీ మీద శ్రీకృష్ణుని ప్రభావం కూడా చాలా ఉంది. అందుకనే అనిబెసెంట్ భగవద్గీతను The Lords Song పేరిట అనువాదం చేశారు. గీతను అనువదించిన తొలి మహిళగా ఆమెను పేర్కొంటారు. ఆ అనువాదం అనిబెసెంట్తో పాటుగా మరెంతో మంది స్వాతంత్రయోధుల కార్యాచరణకు ప్రేరణగా నిలిచింది.
అరబిందో: బ్రిటిషర్ల మీద నేరుగా తిరుగుబాటు చేసిన విప్లవకారుడు. తర్వాత ఆధ్యాత్మిక వేత్తగా మారి పుదుచ్చేరిలో ఆశ్రమాన్ని నెలకొల్పి, మార్మికమైన గ్రంథాలు రాశారు. అరబిందో దృష్టిలో భగవద్గీత కేవలం నిష్కామకర్మను సూచించే మార్గం కానే కాదు. అవసరమైనప్పుడు యుద్ధం చేసి తీరాలని ప్రోత్సహించే పోరుబాట కూడా. ఆ అవగాహనే ఆయనను విప్లవం దిశగా నడిపించి ఉంటుందని ఓ అభిప్రాయం. తన Essays on the Gita లో చాలా సూటిగా తనకు తట్టిన భాష్యాన్ని వివరించారు.
బాలగంగాధర్ తిలక్: బ్రిటిషర్లు నాలుగు హక్కులు ఇస్తే చాలని అనుకునే కాలంలో ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని కుండ బద్దలు కొట్టేశారు తిలక్. చిన్నప్పటి నుంచి తిలక్ మీద భగవద్గీత ప్రభావం అపారంగా ఉండేది. స్వాతంత్య్ర పోరాటంలో కూడా అదే తన మార్గదర్శి అని స్పష్టంగా తేల్చారు తిలక్. అందులో కర్మయోగానికి ప్రాధాన్యం ఇస్తూ ‘గీతా రహస్యం’ పేరుతో ఒక ఉద్గ్రంథాన్నే రాశారు. బర్మాలోని మాండలే జైల్లో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యానం రాయడం విశేషం. తిలక్తో పాటు సంపూర్ణస్వరాజ్యానికి మద్దతు పలికిన లాలా లజపతిరాయ్ కూడా భగవద్గీత వల్ల ప్రభావితం అయినవారే. ఆయన కూడా The Message of Bhagwad Geeta అనే పుస్తకం రాశారు.
గాంధీ: ‘నిరాశ నన్ను నిలువరించినప్పుడు, నలుదిశలా అంధకారం అలుముకున్నప్పుడు… నాకు అండగా నిలిచేది భగవద్గీతే!’ అంటారు గాంధీ. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన దృష్టిలో గీత ఓ ఆధ్యాత్మిక నిఘంటువు. భగవద్గీత సారాన్ని గాంధీ అనాసక్తి యోగంగా పేర్కొంటారు. ప్రతి పనిలోనూ మనసు లగ్నం చేస్తూనే, దాని ఫలితాల మీద ఎలాంటి ఆసక్తీ లేకుండా ఉండటమే అనాసక్తి యోగం! తన వాదనకు అనుకూలంగా లెక్కలేనన్ని వ్యాసాలు రాశారు గాంధీజీ.
..వీళ్లు మాత్రమే కాదు. ఉరి శిక్ష పడిన తొలి విప్లవకారుడిగా పేరున్న ఖుదీరాం బోస్ దగ్గర నుంచీ రాజాజీగా మన్ననలు పొందిన రాజగోపాలాచారి వరకూ… నాటి వీరులెందరికో భగవద్గీత దీప్తిగా, స్ఫూర్తిగా నిలిచింది.