ఒక రైతు తన బిడ్డను చదివిస్తే..ఆ బిడ్డ తను సంపాదించిన జ్ఞానంతో వ్యవసాయ
రంగంలోని సమస్యకు పరిష్కారం చూపిస్తే..రైతు కష్టం ఫలించినట్టు.ఆ బిడ్డ విజయం సాధించినట్టు. చదువూ సార్థకం అయినట్టు. అలాంటి ఓ గెలుపునేఏరువాక శ్రీరామ్ సాధించాడు. మత్స్య సేద్యంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు.
చేపలు, రొయ్యల పెంపకంలో తలెత్తే సమస్యలను గుర్తించడం, పరిష్కరించడం, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం..ఈ మూడు కోణాలలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చింది ఏరువాక టెక్నాలజీస్. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ సాంకేతిక విధానాన్ని అభివృద్ధి చేసింది ఒక తెలుగు తేజం కావడం విశేషం. ఆక్వాకల్చర్లో ‘ఏరువాక టెక్నాలజీస్’ ప్రవేశపెట్టిన మార్పులవల్ల రైతులు రెట్టింపు ఆదాయం పొందుతున్నారు. శ్రీరామ్ రావి అనే యువకుడు ఎలక్ట్రికల్ ఇంజినీర్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పెదనందిపాడు స్వస్థలం. అక్కడే పుట్టి, పెరిగిన శ్రీరామ్కు బాల్యం నుంచి మిరప, పత్తి పొలాలతో అనుబంధం ఉండేది. ఇంజినీరింగ్ తర్వాత బెంగళూరులోని ఓ ప్రముఖ సంస్థలో సెమీ కండక్టర్ డిజైనింగ్ విభాగంలో చేరాడు. అక్కడ, బ్రాడ్బ్యాండ్ ఎక్విప్మెంట్లో ఉపయోగించే చిప్స్ను డిజైన్ చేసేవాడు. అయినా, అతని ధ్యాసంతా వ్యవసాయంపైనే. సేద్యానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్తింపజేసే పద్ధతులు రూపొందిస్తేనే, తాను చదివిన చదువులకు సార్ధకత ఉంటుందనేది ఆ యువకుడి భావన. ఆ లక్ష్యం కోసం తన ఉద్యోగాన్ని వదిలేశాడు శ్రీరామ్. 2011లో స్వగ్రామానికి వచ్చేశాడు. ఆ సమయంలోనే శ్రీరామ్ బంధువులకు చెందిన చేపల చెరువులో ఏదో తేడా వచ్చింది. నీటి నాణ్యతలో అనూహ్యమైన మార్పు కనిపించింది. రాత్రికి రాత్రే చేపలన్నీ చనిపోయాయి. ఆ రైతు తీవ్రంగా నష్టపోయారు. విషయం తెలుసుకొన్న శ్రీరామ్, ఆ మార్పులకు కారణాలను తెలుసుకొనేందుకు లోతైన అధ్యయనం చేశాడు. లాటిన్ అమెరికా శాస్త్రవేత్తలను కలిశాడు. నీటి నాణ్యతను ట్రాక్ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాడు. 2012 ఏప్రిల్లో విజయవాడ కేంద్రంగా ఏరువాక టెక్నాలజీస్ను ప్రారంభించాడు. సెన్సర్లు, మొబైల్ కనెక్టివిటీతో ఈ టెక్నాలజీ పనిచేస్తుంది.
పాండ్ గార్డ్
చేపల పరిశ్రమపై ఎలాంటి అవగాహన లేకపోయినా.. సమస్యలతో కునారిల్లుతున్న ఆ రంగానికి దిశా నిర్దేశం చేయాలని అనుకొన్నాడు శ్రీరామ్. చేపలు, రొయ్యల ఉత్పత్తి సమయంలో ఆక్సిజన్ స్థాయిలను సమన్వయం చేసేలా ‘పాండ్ గార్డ్’ను రూపొందించాడు. ఇది ఆక్సిజన్ స్థాయిని పర్యవేక్షిస్తుంది. ఆ వివరాలను మొబైల్ ఫోన్లకు అందిస్తుంది. హెచ్చరికను కూడా పంపుతుంది.
ఆక్సిజన్ ఉత్పత్తి
చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిని పసిగట్టి, రైతును అప్రమత్తం చేస్తుంది పాండ్ గార్డ్. అంతేకాదు, పాండ్గార్డ్ సెన్సర్లు ఆక్సిజన్ పరిమాణాన్ని కొలుస్తాయి. టెలిమెట్రీ సిస్టమ్ ఆ డేటాను ఏరువాక క్లౌడ్ సర్వర్లకు, రైతుల స్మార్ట్ఫోన్కు సందేశం పంపుతుంది. పాండ్గార్డ్ లేనప్పుడు రైతులు సాధారణంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనాలను ఉపయోగించి చెరువుల్లో కొంత ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించేవారు. ఏరువాక ఆవిష్కరణతో ఆ అవసరం లేకుండా పోయింది. శ్రీరామ్ విజయాలపై తాజాగా ఫోర్బ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ‘ఈ యువకుడి ఆవిష్కరణలు ఆక్వా సాగులో రిస్క్ను నామమాత్రం చేస్తాయి. ఉత్పాదకతను పెంచుతాయి’ అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. ‘ఉద్యోగాన్ని అంటిపెట్టుకుని ఉంటే ఈ విజయం సాధ్యమయ్యేది కాదు. సమాజానికి నా వంతుగా ఏదో ఒకటి అందించాలన్న ఆలోచనే నన్ను ఆవిష్కర్తను చేసింది’ అంటాడు శ్రీరామ్.
ప్రపంచ మార్కెట్లో
ఏరువాక ‘ష్రిమ్టాక్’ ద్వారా చెరువులోని రొయ్యల పరిమాణాన్ని అంచనా వేయవచ్చు. కాబట్టే, శ్రీరామ్ ఆవిష్కరణ తక్కువ సమయంలోనే లాటిన్ అమెరికా, ఈక్వెడార్, పెరూ, మెక్సికోలలో కస్టమర్లను సంపాదించుకొన్నది. బహుళజాతి సంస్థలను ఆకర్షించి అతిపెద్ద మార్కెట్ను సొంతం చేసుకున్నది ‘ఏరువాక టెక్నాలజీస్’. 90% అమ్మకాలు విదేశాల్లోనే ఉన్నాయి. ఏరువాకలో 120 మంది ఇంజినీరింగ్ బృందం పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశ్రమ విలువ 20
బిలియన్ డాలర్లు.