“వాట్! ఫ్రాన్సిస్ విజయ్కుమార్ చనిపోయారా?”.. అని ఉద్వేగంగా కేక పెట్టాడు రఘుపతి.
అతని కంఠంలో దుఃఖం సుడులు తిరుగుతున్నది. దేశంలోనే టాప్-5 బిలియనీర్లలో ఒకడైన రఘుపతి.. ఉద్వేగాన్ని ఆపుకోలేక పసిపిల్లాడిలా ఏడ్చాడు. వెంటనే తేరుకొన్నాడు. అప్పుడు రాత్రి పదకొండు అవుతున్నది. ఎకాఎకిన తన అపాయింట్మెంట్లన్నీ రద్దు చేసేసి, జమ్మలమడుగుకు బయల్దేరాడు.
సమయం.. రాత్రి రెండు దాటింది.
“ఇంకాస్త వేగంగా నడపొచ్చు కదా! ఇంకా ఎంతసేపు పట్టొచ్చు?” వెనుక సీట్లో నుంచి రఘుపతి తొందరపెట్టాడు.
“సర్! మనం తెల్లవారి ఐదింటిలోపు కచ్చితంగా చేరుకుంటాం సర్”.. వేగంగా కారు నడుపుతూనే, వినయంగా సమాధానం చెప్పాడు డ్రైవర్. హైదరాబాద్ నుంచి కర్నూలును అప్పటికే రెండు గంటల్లో దాటేశారు.
చిమ్మచీకట్లో గంటకు నూటయాభై కిలోమీటర్ల వేగంతో జమ్మలమడుగు దిశగా దూసుకెళ్తున్నది మెర్సిడెస్ బెంజ్ కారు.
చాలా ఏకాగ్రతగా నడుపుతున్నాడు డ్రైవర్.
డ్రైవర్ పక్కసీట్లో కూర్చోని ఉన్న విక్రమ్కు వింతగా ఉంది.. తమ యజమాని ప్రవర్తన.
ఎప్పుడూ నెమ్మదిగా వెళ్లమనీ, వేగం వద్దనీ హెచ్చరించే ఆయన.. ఇవ్వాళ ఇలా తొందర పెట్టడం విక్రమ్కు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
రఘుపతి.. దేశం గర్వించదగ్గ బిలియనీర్లలో ఒకరు. దేశంలోని టాప్-5 కుబేరుల జాబితాలో అతని స్థానం గత పదేండ్లుగా పదిలంగా
ఉంటూ వస్తున్నది.
వ్యాపారంలో అతను అడుగుపెట్టని రంగం లేదు. హోటల్స్, ఔషధ తయారీ, భవన నిర్మాణం, ఇన్ఫ్రా, సాఫ్ట్వేర్, విద్య.. ప్రతి రంగంలోనూ విలువలతో కూడిన తనదైన ముద్రవేస్తూ, ప్రత్యేకతను నిలబెట్టుకొంటూ వస్తున్నాడు. ఆయన కంపెనీ తాలూకు షేర్లు దగ్గరున్నాయంటే.. ఎవరైనా సరే భరోసాగా నిద్రించొచ్చు.
ఎక్కడా రాజీపడకుండా, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ మంచిపేరు తెచ్చుకొన్నాడు. రఘుపతిని కలవడానికి ప్రధాని సహా, దేశంలోని అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులూ ఎదురుచూస్తుంటారు. ఇంటర్వ్యూ చేయడానికి దేశవిదేశీ మీడియా సంస్థలన్నీ ఉవ్విళ్లూరుతుంటాయి.
ప్రతి పనీ ఎంతో ప్రణాళికాబద్ధంగా జరిగిపోతూ ఉంటుంది.. రఘుపతి విషయంలో! అలాంటిది రాత్రికి రాత్రే అన్ని అపాయింట్మెంట్లూ రద్దు చేసుకొని, జమ్మలమడుగుకు ఈ ప్రయాణం పెట్టుకొన్నాడు. అసలు ‘జమ్మలమడుగు’ అన్న ఊరిపేరే మొదటిసారి వింటున్నాడు విక్రమ్. ఆ రోజు రాత్రి పదకొండు గంటలప్పుడు ఎవరో ఫోన్ చేశారు.. రఘుపతి వ్యక్తిగత నెంబర్కు.
ఆ కాల్ అందుకొని.. “వాట్! ఫ్రాన్సిస్ విజయ్కుమార్ చనిపోయారా?” అని ఉద్వేగంగా కేక పెట్టాడు రఘుపతి. అంతే.. ఆ తరువాత పరిణామాలన్నీ చకచకా జరిగి పోయాయి. అపాయింట్మెంట్లన్నీ రద్దు చేసుకోవడం, ప్రయాణానికి సిద్ధం కావడం.. కేవలం అర గంటలో పూర్తయ్యాయి.
వాతావరణం అనుకూలించని కారణంగా ఎయిర్ట్రాఫిక్ కంట్రోల్వారు హెలీకాఫ్టర్ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. అందుకే, కార్లో జమ్మలమడుగుకు బయల్దేరాడు.
“సర్! కాస్త హార్లిక్స్ గానీ, టీ గానీ తీసుకొంటారా?” ఫ్లాస్క్ను చేతిలోకి తీసుకొంటూ అడిగాడు విక్రమ్.
‘వద్దు’ అన్నట్టుగా తలూపాడు రఘుపతి.
తన పదిహేనేండ్ల సర్వీసులో యజమానిని ఇంత ఉద్విగ్నంగా చూడటం విక్రమ్కు ఇదే మొదటి సారి. రఘుపతి వయసు.. నలభై ఎనిమిదికి అటు ఇటుగా ఉంటుంది.
ఎప్పుడో పాతికేండ్ల క్రితం ఫ్రాన్సిస్ విజయ్కుమార్ జీవితంలోకి రాకుంటే.. అతని జీవితం ఎలా ఉండి ఉండేదో!
ఆయన చూపిన మార్గదర్శనం, ఇచ్చిన భరోసా కారణంగానే తను ‘డిప్రెషన్’ అన్న పెనుభూతాన్ని వదిలించుకొని, ఈ వేళ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదగగలిగాడు. ఆ తర్వాత ఫ్రాన్సిస్ విజయకు మార్ను చూడటానికి వీలు కాలేదు. ఆయన చిరునామా కూడా దొరకలేదు. ఎంత ప్రయత్నిం చినా ఆయన ఎక్కడున్నాడో కూడా తెలుసుకోలేక పోయాడు. కేవలం తన జీవితాన్ని మార్చడానికి ఆయన ఒక దేవదూతలాగా తన జీవితంలోకి వచ్చాడేమో!
ఇవ్వాళ ఆయన చిరునామా తన దగ్గర ఉంది. ఆయన్ని కలవడానికే తను ఇప్పుడు వెళ్తున్నాడు. కానీ, ఆయన్ని మాట్లాడించలేడు. కేవలం విగతజీవుడిగా చూడగలడు.. అంతే!
రాత్రి ఎవరో ఫోన్ చేసి.. ఫ్రాన్సిస్ విజయ్కుమార్ ఫోన్ నంబర్, చిరునామా చెప్పినప్పుడు ఎగిరి గంతేసి ఆయన్ని కలవాలని అనుకొనేంతలోపే.. ఆయన చనిపోయాడంటూ చల్లగా చెప్పారు. ‘చావు కబురు చల్లగా చెప్పడం’ అంటే ఇదేనేమో!
ఎన్ని ఏండ్ల అన్వేషణ ఇది? ఇప్పుడు ఫలించింది. కానీ, ఏం లాభం?
లాభనష్టాలు ఆలోచించాల్సిన సమయం కాదిది. అందుకే, తక్షణం బయల్దేరాడు.
జీపీఎస్ సిగ్నల్స్ను అనుసరిస్తూ హైవే పైనుంచి బనగానపల్లి వైపు కారు మలుపు తిరిగింది. రోడ్డు ఏమాత్రం బాగాలేదు. అయినా, వింటి నుంచి సంధించిన బాణంలాగా దూసుకుపోతున్నది. అంతకన్నా వేగంగా రఘుపతి ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి.
అప్పటికి రఘుపతి వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు. అప్పుడతనో సామాన్యుడు. పాదాలకు హవాయి చెప్పులు, సాదాసీదా దుస్తుల్లో ఉండేవాడు. చెప్పుకోవడానికి ఏదైనా ఉందా అంటే.. అత్తెసరు మార్కులతో పాసైన బీకాం. ఆ డిగ్రీ పట్టాతో భవిష్యత్ వంక ఆశగా చూసేవాడు. దూరదర్శన్ మినహా దేశంకూడా సాధించిన ప్రగతేం లేదు.. ఆ కాలానికి.
‘పద్దెనిమిదో ఏట ప్రేమలో పడకున్నా.. ఇరవయ్యో ఏట కమ్యూనిజం పట్ల మొగ్గు చూపకున్నా.. నీకు హృదయం లేదని అర్థం’ అని ఎవరో మేధావి చెప్పిన ప్రకారం, తనకు హృదయం ఉన్నదని రఘుపతి అప్పటికే నిరూపించుకున్నాడు.
కానీ, తన ప్రేమ వల్ల అతను అశాంతినే పొందాడు. భగ్నమైన హృదయం. దానికి తోడు వామపక్ష భావజాలంతో నిండిన సాహిత్యం.. అతని ‘అశాంతి’ అనే అగ్నికి ఆజ్యం పోసేది.
చివరికి శ్రీశ్రీ ‘సంధ్యా సమస్యలు’లో చివరి వాక్యంలా తయారైంది పరిస్థితి. ‘ఆత్మహత్యకు ఏది సరైన దారి’ అనే దిశగా సాగుతున్నాయి అతని ఆలోచనలు. అలాంటి పరిస్థితిలో అతనికి తారసపడ్డాడు.. ఫ్రాన్సిస్ విజయ్కుమార్.
క్యాంటీన్లో నెలకొన్న రణగొణ ధ్వనులన్నిటినీ అధిగమిస్తూ.. సుస్పష్టమైన ఒకస్వరం అతని చెవులను చేరుతున్నది. తన వెనుక టేబుల్ నుంచి వినిపిస్తున్న ఆ మాటలను తనకు అన్వయించు
కొని, ఒక్కసారిగా ఏదో కుదుపు వచ్చినట్టు నిలువెల్లా కదిలిపోయాడు రఘుపతి.
“నువ్వు డిప్రెషన్లో ఉన్నావంటే.. నీ ఆలోచనలు గతం అనే ఊబిలో కూరుకుపోయాయని అర్థం. నువ్వు ఆందోళనలో ఉన్నావంటే.. నీ ఆలోచనలు భవిష్యత్ ముఖచిత్రాన్ని భయం కోణంలో చూస్తున్నాయని అర్థం. అలా కాకుండా ప్రశాంతంగా, ఆనందంగా, ప్రతి క్షణాన్నీ
ఆస్వాది స్తూ.. ఉల్లాసంగా ఉన్నావంటే.. నువ్వు జీవితాన్ని సరైన విధంగా జీవిస్తున్నావని అర్థం. దీన్నే వర్తమానంలో జీవించడం అంటారు”.. ఎవరినో ఉద్దేశించి, ఎవరో అపరిచితుడు చెప్పిన ఆ వాక్యాలు రఘుపతిపై గాఢమైన ప్రభావాన్నే చూపాయి. ఆ రద్దీలో ఆయన్ని సరిగ్గా చూడలేకపోయాడు. కానీ, ఆ రూపం చూచాయగా గుర్తుపెట్టు కొన్నాడు రఘు.
ఆ మాటల ప్రభావం వల్ల అతని జీవితంలో ఎకాఎకిన పెనుమార్పులు సంభవించాయని చెప్పలేం. కానీ, తన ఆలోచనలను తానే ఒక సాక్షిగా గమనించడం ప్రారంభించాడు ఆ రోజు నుంచి. ఆ చర్యవల్ల అతని ఆలోచనలు ఒక సకారాత్మక మలుపు తిరిగాయి. మరికొన్ని రోజుల తరువాత అంతే ఆశ్చర్యకరమైన పరిస్థితిలో ఆయనను కలిశాడు రఘుపతి. ‘ప్రాప్తంబు గలచోట ఫలమేల దప్పురా!’ అన్నారు కదా పెద్దలు.
దేవుని కడప వేంకటేశ్వర స్వామి గుడిలో ఉత్సవాలకు వెళ్లాడు రఘు. స్పీకర్లలోంచి అన్నమయ్య కీర్తనలు అద్భుతంగా వినిపిస్తున్నా యి. గుడిలోని వేదిక పైనుంచి వినసొంపుగా ఆలపిస్తున్నారు ఎవరో. ‘ఆహా! ఇది దేవగానం. ఇలాంటి స్వరం దైవదత్తం. ఇలాంటి అమృతస్వరం ఉన్న వ్యక్తిని దగ్గర నుంచి చూడాలి’ అని అర్చన, తీర్థ ప్రసాదాలు, శఠగోపం అనంతరం కచేరీ వైపు దారి తీశాడు రఘు.
ఆశ్చర్యపోవడం తిరిగి రఘు వంతైంది. ఆ అమృతస్వరం ఎవరిదో కాదు.. హోటల్లో తన మాటలతో తనపై తెలియకుండానే ప్రభావాన్ని చూపాడే.. ఆ వ్యక్తి స్వరమే అది. ఆ వ్యక్తే మైకు ఎదుట కూర్చొని కమ్మగా పాడుతున్నాడు.
అప్పటికి ఆయన పేరు కూడా తెలియదు రఘుకు. మూడు గంటలసేపు శ్రోతలను రంజింపజేస్తూ అందర్నీ ఏదో లోకాలకు తీసుకెళ్లాడు. చివర్లో సవినయంగా చేతులు జోడించి, సభికులందరికీ నమస్కరించి ముగించాడు. ఆ తర్వాత జరిగిన సన్మానం సందర్భంగా ఆయన పేరు తెలిసింది. రఘు మరొక్కసారి ఉలిక్కిపడి, ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎందుకంటే..
ఆయన పేరు ‘ఫ్రాన్సిస్ విజయ్కుమార్’.
‘ఓ మైగాడ్! ఈయన క్రిస్టియనా?’ ప్రేక్షకుల్లోని చాలామందిలా రఘు కూడా ఆశ్చర్యపోయాడు.
ఆయన ఒక బ్యాంక్ ఆఫీసరనీ, ఆయన ఇల్లు తమ ఇంటికి దగ్గరేనని తెలిసింది రఘుకు. మరుసటి రోజు ఆయనింటికెళ్లి, తనను తాను పరిచయం చేసుకొన్నాడు. అది ఒక పొదరిల్లు. ఇంటి చుట్టూ చిన్ని తోట. ఆకట్టుకొనే ఆహ్లాదకర వాతావరణం. ఎందుకో తెలియదు, ఆ ఇంటి వాతావరణంలో ఒక విధమైన కారుణ్యం, ప్రేమ పొంగి ప్రవ హించేవి. ఆయన తనను ఆదరించి ఆహ్వానించిన తీరులో ఎంతో ప్రేమ, సంస్కారం ఉట్టి పడుతున్నాయి. అప్పటికి రఘు ఏ విధంగానూ స్థిరపడలేదు. ‘నా పేరు రఘు’ అని తప్ప.. తన గురించి చెప్పుకోవడానికి ఏ ప్రత్యేకతా లేదు.
కానీ, గడపతొక్కి వచ్చిన అతిథిని ఆయన ఆద రించిన తీరు అద్భుతం. ఎంతో జన్మ సంస్కారం ఉంటేనే అది సాధ్యం. అదే అనుకొన్నాడు రఘు.. అతని గురించి.
ఇవన్నీ ఒకెత్తు. ఆయన పర్సనల్ లైబ్రరీ ఒకెత్తు.
శ్రుతి, స్మృతి పురాణాదులు, వేదవేదాంగాల భాష్యాలు, ఉపనిషత్ గ్రంథాలు, కన్ఫ్యూషియస్, బెర్ట్రాండ్ రస్సెల్స్, ఖలీల్ ఘీబ్రాన్, జీన్ పాల్ సార్త్రే వంటి మేధావుల గ్రంథాలు, జీవిత చరిత్రలు.. అబ్బో! అదో అద్భుత ప్రపంచం.
“ఏది కావాలన్నా తీసుకెళ్లి, చదువుకొని తెచ్చి ఇవ్వవచ్చు” అని చెప్పాడు.
‘ఓ జీవిత కాలం సరిపోతుందా? ఈ గ్రంథాలన్నీ చదువడానికి’ అని అనిపించింది రఘుకు.
ఓ రోజు ఓగ్ మేండినో రాసిన ‘ది గ్రేటెస్ట్ సేల్స్మెన్ ఇన్ ది వరల్డ్’ అనే చిన్ని పుస్తకం ఇచ్చి.. దాన్ని బాగా చదువమన్నాడు రఘును.
“ఏంటి సార్.. నన్ను సేల్స్మ్యాన్ జాబ్ చేయమంటారా?” నవ్వుతూ అడిగాడు రఘు.
“అది సేల్స్కు సంబంధించిన పుస్తకం కాదు. పేరలా ఉందంతే! లోతుగా చదువు. ఆ తర్వాత ఈ పుస్తకం గురించి మనం సుదీర్ఘంగా మాట్లాడు కొందాం” అన్నాడు విజయ్కుమార్.
ఆ పుస్తకాన్ని చదువడం ప్రారంభించాడు రఘు. అంతే.. తన ప్రమేయం లేకుండానే అక్షరాల వెంబడి తన చూపులు పరిగెత్తడం ఆరంభించాయి.
అది పుస్తకమా? కానే కాదు. అది ఒక మాయా తివాచి. అది ఒక మంత్ర నగరి. అది ఒక మంత్ర దండం. అందులోని ప్రతి అక్షరం.. తనలోని అణువణువునా ఏదో కొత్త శక్తిని నింపినట్టు అనిపించింది. తనలోని శక్తి.. జాగృతం అయిన భావన. కుండలినీ శక్తి జాగృతం అవడం అంటే ఇదేనా? రఘుకు మాటలు రావడం లేదు. కండ్ల వెంబడి అశ్రు ధారలు. ఒక ఆనందానుభూతికి గురయ్యాడు రఘు.
ఆ పుస్తకం చదివిన రాత్రి నిద్ర రాలేదు రఘుకు. ఏదో ఉద్వేగం, ఏదో భావ తీవ్రత.
“చదివావా?” మరుసటి రోజు కలవగానే ఆయన అడిగిన మొదటి ప్రశ్న.
“చదివాను సర్. చాలా బాగుంది. నాలో ఏదో కొత్త శక్తి ప్రవహిస్తున్న అనుభూతి కలుగుతున్నది. ఇన్నాళ్లూ నాకే తెలియకుండా నన్ను ఏదో శక్తి అడ్డు పడుతున్నట్టు అనిపించేది. ఇప్పుడు నాకు ఏ అడ్డూ లేదు” చాలా భావ తీవ్రతతో చెప్పాడు రఘు.
తనిచ్చిన మందును పుచ్చుకొన్న రోగి, తనకు గుణంగా ఉన్నదంటూ తన స్థితిని వర్ణిస్తుంటే.. అతని వంక దయగా చూసే వైద్యునిలా రఘును చూస్తుండి పోయాడు ఫ్రాన్సిస్.
రఘులోని ఆత్మహత్యా ధోరణులను మొదట్లోనే అర్థం చేసుకొని, పెద్ద పెద్ద ఉపన్యాసాలివ్వకుండా, అతనికిష్టమైన పుస్తక పఠనం ద్వారానే మార్పును తీసుకురాగలిగాడు ఫ్రాన్సిస్. ఆ తరువాతా పుస్తకాల వెల్లువ కొనసాగింది. అనేక వ్యక్తిత్వ వికాస గ్రంథాల ద్వారా రఘు వ్యక్తిత్వంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చాడు. విశ్లేషణతో కూడిన సంభాషణలు, తర్కంతో కూడిన చిన్న వాగ్వాదాలకు తెరలేపుతూ రఘు ఆలోచనల్లో పెద్ద సునామీనే సృష్టించాడు.
ఆయన ప్రేరణతో పై చదువులు చదవడం, సీఏ కోర్స్ చేయడం.. చకచకా జరిగిపోయాయి.
సీఏ కోర్సు కోసం బొంబై బయల్దేరుతున్నప్పుడు, ఆయన రైల్వేస్టేషన్కొచ్చి వీడ్కోలు ఇస్తూ.. తనతో చెప్పిన మాటలు రఘు ఇప్పటికీ మరచిపోలేదు.
“రఘూ! ప్రేమ ఎప్పటికీ కార్యరూపేణ మాత్రమే వ్యక్తమవుతుంది. అందులోనూ నిరంతర ప్రేమ, నిష్కామ ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ.. భగవంతుడి రూపమని చెప్పచ్చు. ప్రేమకు ప్రతిగా ప్రేమనే వాంఛించడం నువ్వు ఎప్పుడు ప్రారంభిస్తావో.. అప్పుడు మానసిక క్లేశాలు కలుగుతాయి. అది పతనానికి నాంది. నువ్వు ఏ ప్రతిఫలం ఆశించకుండా ఎప్పుడైతే సాటి మనిషికి సాయం ద్వారా నీ ప్రేమను అందిస్తావో.. అప్పుడు నువ్వే దేవుడివి. ఏదో కోరుకుంటూ నీ ప్రేమను నువ్వు అందించడం ప్రారంభించావో.. అప్పుడు నువ్వు మనిషిలాగా కనిపిస్తున్నా కూడా ఒక రాక్షసుడివి. అప్పుడు నీకే తెలియకుండా నీలో ప్రతికూల భావాలు గూడు కట్టుకొంటాయి. నిన్ను వలచి వంచించిన అమ్మాయిని క్షమించు. నీలో కరుణ కట్టలు తెంచుకొని ప్రవహించనీయ్. దీనివల్ల నీకే మంచి జరుగుతుంది”.
రఘు ఆశ్చర్యంతో చూస్తుండిపోయాడు. తను ప్రేమోపహతుడని ఆయనకు తాను ఎన్నడూ చెప్పుకోలేదు. ఆయన కురిపిస్తున్న దయా వర్షంలో తడిసి ముద్దయ్యాడు రఘు.
ప్లాట్ఫాంపై నిలబడ్డ ఫ్రాన్సిస్ను భారమైన హృదయంతో, సజలమైన కండ్లతో.. కదిలే రైల్లోంచి చూస్తూ ఉండిపోయాడు రఘు. అదే ఆయన్ని చివరిసారి చూడటం. ఆ తర్వాత తన ఎదుగుదల క్రమంలో, తన గొడవలో తాను తల మునకలయ్యాడు రఘు. కానీ, ఏ క్షణమూ ఆయనను మరచిపోలేదు. ఫ్రాన్సిస్ అందించిన జీవనోత్సాహంతో, తనతో చదివించిన పుస్తకాల ప్రేరణతో, పట్టుదల, క్రమశిక్షణలతో దినదిన ప్రవర్ధమానమయ్యాయి రఘుపతి చేపట్టిన వ్యాపారాలన్నీ.
జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రి ఆవరణలో ఫ్రీజర్ బాక్స్లో ఉంచిన ఫ్రాన్సిస్ శవాన్ని చూసి చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు రఘుపతి.
ఆ ఊరికి రఘుపతి రావడమే వార్త అనుకుంటే, ఆయన పిల్లాడిలా ఏడ్చేసిన దృశ్యాన్ని ఒడిసి పట్టుకోవడానికి పోటీ పడ్డారు మీడియా వాళ్లు.
అంత్యక్రియలు ముగిశాయి.మీడియా వారికి ఏమీ అర్థం కావడం లేదు.
వారికి పిచ్చెక్కిపోతున్నది.
‘ఒక సామాన్యుడైన ఫ్రాన్సిస్ మృతికి రఘుపతి ఎందుకు ఇంత ప్రాముఖ్యమిస్తున్నాడు?’.. తెలుగు, జాతీయ మీడియా అంతటా ఇదే చర్చ.
మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్లాడు రఘుపతి. అది చాలా చిన్న ఇల్లు. ఆయన తన యావదాస్తినీ దానధర్మాలకు వినియోగించాడని రఘుపతికి ఆసుపత్రి ఎండీ చెప్పాడు. ఆయనింటి వాతావ రణాన్ని చూస్తే.. అది నిజమేనని తెలుస్తున్నది.
నుదుటన ఎర్రటి బొట్టుతో శ్రీలక్ష్మిలా ఉంది వారమ్మాయి. పేరు సరస్వతి అట. తమవంతు సాయం చేస్తానన్న రఘుపతి ప్రతిపాదనను శ్రీమతి ఫ్రాన్సిస్ సున్నితంగా తిరస్కరించింది.
“మాకు తగినంత ఉంచి వెళ్లారు. మాకే లోటు లేదు” అని.. కాసేపాగి ఆవిడ ఇలా అన్నారు.
“నాన్న తన చివరి రోజుల్లో మిమ్మల్ని బాగా గుర్తుచేసుకొన్నారు. ఎన్నడూ ఎవరి నుంచీ ఏ సహాయం ఆశించలేదు. కానీ, వారికి మీరేదో సాయం చేయాలట. ఈ ఉత్తరంలో ఆ విషయం రాసి ఉన్నదట. దీన్ని మీకు ఇమ్మన్నారు” అంటూ ఒక సీల్ చేసిన ఉత్తరాన్ని రఘుపతికి ఇచ్చింది.
దానిని వెంటనే తెరిచాడు రఘుపతి.
ముత్యాల్లాంటి అక్షరాల వెంబడి.. అతని చూపులు ఆప్యాయంగా పరుగులు ప్రారంభించాయి.
ప్రియమైన రఘు..
ఎలా ఉన్నావు? ఇప్పుడు నువ్వున్న స్థితిలో నిన్ను ఏకవచనంతో సంబోధించే చనువు నాకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. రఘూ! నువ్వు సాధిస్తున్న విజయాలు, ప్రగతీ గమనిస్తూనే ఉన్నాను. అయామ్ ప్రౌడాఫ్ యూ మై బాయ్.
ఎన్నో టీవీ ఇంటర్వ్యూలలో నా గురించి ప్రస్తావించావు. నన్ను ‘గురువు’ అన్నావు. ‘దైవం’ అన్నావు. అదంతా నీ సంస్కారం, పెద్దలు నీకు అందించిన వినయం. అదే మన సనాతన సంప్రదాయంలో ఉన్న విశిష్టత.
నీ ప్రతి విజయం వెనుకా నీ కృషి ఉంది, నీ పట్టుదల ఉంది. నేను కేవలం కొన్ని పుస్తకాలు చదువమని ప్రేరేపించాను. నీలో ఉన్న కసికి, సరైన సమయంలో ఒక సన్మార్గం కల్పించాను. అది దైవకృప. అందులో నా గొప్పతనం ఏదీ లేదు.
నువ్వు బొంబాయి వెళ్లిపోయిన తర్వాత నాక్కూడా బదిలీ అయింది. పదోన్నతుల మీద దేశం అంతటా తిరిగాను. పనిలో పనిగా అనేక మంది మహనీయుల సాంగత్యం లభించింది. అనేక క్షేత్రాలను దర్శించే భాగ్యం కలిగింది.
నా జ్ఞానాన్ని మరింత విస్తృత పరుచుకొన్నాను. ఐదేండ్ల క్రితం వలంటరీ రిటైర్మెంట్ తీసుకొని జమ్మలమడుగులో స్థిరపడ్డాను.
నేను ఒక సామాన్యుడిని. కానీ, నీతో సహా చాలామంది తమకు కొత్త జీవితాన్ని అందించానని చెబుతుంటారు. అనేక మందికి దుఃఖోపశమనం కల్పించానని అంటుంటారు. అది మీ అందరి మంచితనం. నాకో సాయం చేయగలవా? రఘూ.. నాకు దుఃఖోపశమనం కావాలి. మీకెవ్వరికీ తెలియని దుఃఖం నాలో ఇన్నేళ్లూ ఒక జ్వాలలా నిరంతరం రగులుతూనే ఉంది. వయస్సు పెరిగేకొద్దీ నాలో దుఃఖం పెరుగుతూ వచ్చింది. ఇది ఒక చిత్రమైన పరిస్థితి.
నా బాల్యం నుండి కూడా ఎక్కడైనా గుడి గంటలు వినపడితే నాలో ఒక విధమైన పారవశ్యం కలిగేది.
వేదనాదం విన్నా, మంత్రోచ్ఛారణ విన్నా మనసు ఆనందంతో గంతులు వేసేది. కానీ, మా తల్లితండ్రులు ఆ దిశగా ప్రోత్సహించే బదులు, మా మతపెద్దలతో చెప్పి నా గుణాన్ని మాన్పించేలా ప్రయత్నించారు. పరమత సహనం అటుంచి, కన్నతల్లిలాంటి సనాతన సంప్రదాయం పట్ల ద్వేషం రగిల్చే ప్రయత్నం చేసేవారు. జ్ఞానం వికసించే కొద్దీ నాలో ఈ సంఘర్షణ పెరుగుతూ వచ్చింది.
విదేశీ పాలకులు ఒక ప్రణాళికతో మనల్ని మన సంస్కృతికి ఎలా దూరం చేశారో తెలుసుకునే కొద్దీ, మన సంస్కృతికి వారు చేసిన ద్రోహం తెలుసుకునే కొద్దీ నాలో ఈ దుఃఖం పెరుగుతూ వచ్చింది.
సనాతన ధర్మం ఏదైతే ఉందో.. ఇది మతం అనే సంకుచిత చట్రంలో ఇమిడే అంశం కాదు. ఎందుకంటే, ఇది మతం కాదు. మతం అనేది కొందరు మహానుభావుల చేత స్థాపించబడి, వారు రూపొందించిన కఠిన నియమావళిని తు.చ. తప్పకుండా పాటించేలా రూపుదిద్దుకొన్న పిల్లకాలువ లాంటిది. కానీ, సనాతన ధర్మం అనేది ఎవరి చేతా స్థాపించబడలేదు. అందుకే, ఇది మతం కాదు. ఇది ఒక ధర్మం. యావత్ మానవాళీ ఆనందంగా జీవించడానికి ఇది ఒక మాన్యువల్ లాంటిది. ఇది అత్యంత పురాతనమైంది. అత్యంత నవీనమైంది కూడా. ఇది ‘విన్-విన్ సిట్యుయేషన్’ లాంటి నిరంతర ప్రక్రియ. ‘నా గెలుపు కోసం నువ్వు ఓడిపోనక్కరలేదు. నువ్వు ఆనందంగా జీవించు, నేనూ ఆనందంగా జీవిస్తాను. నాకు నువ్వు రక్ష – నీకు నేను రక్ష. మనిద్దరం యావత్ విశ్వానికీ రక్ష’ ఇలాంటి మహదోద్ధేశాలతో రూపుదిద్దుకొన్న ఒక విశ్వమానవ సంక్షేమానికై ఏర్పడ్డ ధర్మం ఇది. దీనికి దేశ, కాల, లింగ పరిమితులు లేవు.
పాశ్చాత్యులు మొదటిసారి మనల్ని చూసినప్పుడు మన సంస్కృతినీ, మన జీవన విధానాన్నీ చూసి అవాక్కయ్యారు. సుఖ శాంతులతో, ఆనందంతో, ఐష్టెశ్వర్యాలతో తులతూగుతున్న మనల్ని చూసి దిగ్భ్రమ చెందారు. నాగరికతతో విలసిల్లుతున్న మన స్థితికి అబ్బురపడ్డారు. దోచుకోడానికి వచ్చిన దొంగ.. ఇంటివారి ఐశ్వర్యాన్ని చూసి ‘శభాష్’ అని అభినందించి వెళ్లిపోడు కదా! ‘ఎలా దోచుకోవాలా?’ అని ఆలోచిస్తాడు.
సరిగ్గా అలాగే జరిగింది మన సంస్కృతిపై దాడి.
బ్రిటీష్ వాళ్లు మన సంపదలను దోచుకొని, మనల్ని బానిసలను చేసుకొన్నదే కాకుండా, మన సంస్కృతిని మనమే ద్వేషించేలా చేయడమనే ఒక భయంకరమైన కుట్రను విజయవంతంగా అమలు చేయగలిగారు.
హిందుత్వం.. ఒక మతం కాదు. ‘మానవుడు ఎలా జీవించాలి’ అన్న విధానాన్ని ప్రతిపాదించిన ఒక శాస్త్రీయ పద్ధతి. ఒక సిలబస్. సనాతన ధర్మాన్ని ధిక్కరించడం అంటే.. మనం కూర్చున్న చెట్టు కొమ్మను మనం నరుక్కోవడమే! ప్రకృతితో, పంచ భూతాలతో మమేకమవుతూ సుఖ సంతోషాలతో ఎలా జీవించాలో తెలిపే ఒక అద్భుతమైన విధానం. దీనికి మతాలతో సంబంధం లేదు. విశాలమైన ఇలాంటి అమృత సాగరాన్ని వదులుకొ ని, ఒక చెంచాడు నీటిలో ఈత కొట్టమని శాసిస్తే ఎలా ఉంటుందో.. అలా ఉండేది నా పరిస్థితి.
రఘూ! ప్రపంచంలో అన్ని మతాలూ మంచివే.
ప్రజలు భ్రష్టుపట్టిపోకుండా ఉండేందుకు కొందరు మహానుభావులు నడుం బిగించి, కొన్ని నియమా లుగా ఏర్పరిచిన వ్యవస్థలే ఈ మతాలన్నీ. ఏ మతమూ చెడు చేయమని చెప్పదు.
కాకపోతే, కొన్ని విషయాలను మతావలంబకులు అర్థం చేసుకోవడంలో పొరపాట్లు జరిగి, మూఢ విశ్వాసులుగా మారి ఇతరులను ద్వేషించడం మొదలైంది. కానీ, ‘సర్వేజనా సుఖినోభవంతు’ అన్న ఆర్యోక్తిని విశ్వసించే సనాతన ధర్మం.. నాస్తికుల్ని, చార్వాకుల్ని కూడా ప్రోత్సహిస్తుంది. వారి సందేహాల్ని ఎప్పటికప్పుడు తీరుస్తూ పోతుంది. ‘ప్రశ్నించడం అభివృద్ధికి సూచన’ అని విశ్వసించే విధానం ఇది. అందుకే, సనాతన ధర్మం.. అత్యంత ప్రాచీనం.. నిత్య నూతనం.
ఇలా చెప్పుకొంటూ పోతే దీనికి అంతే లేదు రఘు. మనం ఏదైతే సైన్స్ అనుకొంటున్నామో.. ఈ సైన్స్ ఇంకా టెలిస్కోపు కాదు కదా, అందులో లెన్సుకు వాడే గాజు ముక్కను కూడా కనుగొనక ముందే ఖగోళ శాస్త్రంపై పూర్తి పట్టు సాధించి గ్రహగతులను, గ్రహణాలను ముందుగా లెక్కించి చెప్పింది ఈ ధర్మం. శాస్త్రజ్ఞులకు ముందే భూమి గోళాకారంలో ఉన్నదని పురాణాల్లోనే పేర్కొన్న నాగరిక ధర్మమిది.
రఘూ! నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. అమ్మానాన్నలు, అయిన వాళ్లనూ నొప్పించడం ఇష్టంలేక బతికినంతకాలం అన్యమతస్థుడిగానే జీవించాను. ఇక ఈ కపట నాటకం చాలు రఘూ! నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు.
రఘూ.. నువ్వు చేయాల్సిన సాయం చాలా చిన్నది. చాలా చిత్రమైనది కూడా! కనీసం నా ఆత్మనైనా హిందువుగా సాగిపోని. జీవించినంత కాలం సంఘర్షణ అనుభవించాను. ఇలాంటి సంఘర్షణే నేను శ్రీ ఏపీజే కలాం గారిలోనూ గమనించాను. నాలా.. ఇలా సతమతమయ్యే చాలామందిని నా జీవన యాత్రలో గమనించాను.
రఘూ! నువ్వేం చేయాలంటే.. కాశీ విశ్వనాథుడి క్షేత్రమైన వారణాసిలోని గంగా తీరంలో సశాస్త్రీయంగా నాకు పిండ ప్రదానం చేయి. నాకు శాస్ర్తోక్తంగా జరగాల్సిన కర్మకాండ, మాసికాలు, పిండ ప్రదానం, సంవత్సరీకం జరిపించు. నా అత్మను హిందువుగా ప్రయాణం చేయనివ్వు.
‘యద్భావం తద్భవతి’.. నా భావనే నిజమవు గాక.
నువ్వు నన్ను ‘గురువు’ అని అనేక వేదికల మీద పేర్కొన్నావు కదా! నేను చెప్పగా నువ్వు చదివిన గ్రంథాలన్నీ పాశ్చాత్య సమాజం నుండి మనకు దిగుమతి అయినవే. నేటి మేటి వ్యక్తిత్వ వికాస గ్రంథాలన్నీ మన శాస్ర్తాలు, గీతలో చెప్పిన విషయా లే! అదంతా తమ సృజనేనని జబ్బలు చరచుకొం టూ ఉంటారు పాశ్చాత్య మేధావులు.
‘మాకు ప్రేరణ సనాతన ధర్మం తాలూకు గ్రంథాలే!’ అని చెప్పుకోవాలనే కనీస మర్యాద పాటించరు ఈ రచయితలు.
నా చివరి కోరిక తీర్చడం ద్వారా నువ్వు నాకు గురుదక్షిణ చెల్లించిన వాడివి అవుతావు. ఇటీవల నేనొక గ్రంథం చదివాను. రాసింది వామదేవ శాస్త్రి. నిజానికి అతను పాశ్చాత్యుడు.
అసలు పేరు ‘డేవిడ్ ఫ్రాలే’. అతను రాసిన ఆ గ్రంథం పేరు.. ‘నేనెందుకు హిందువుగా మారాను?’. ఈ గ్రంథం చదివి చాలా ఉద్వేగానికి గురయ్యాను. వీలైతే నువ్వూ చదువు.
ఉండనా మరి!
హైదరాబాదు నుంచి వారణాసి వెళ్లే విమానం రన్వే నుంచి వేగంగా పైకి ఎగిరింది. అందులో రఘుపతి.. ప్రశాంత మనస్కుడై కూర్చున్నాడు.
రాయపెద్ది వివేకానంద్
డాక్టర్ రాయపెద్ది వివేకానంద్ స్వస్థలం కడప. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ఇంగ్లిష్ తరగతులు బోధించడం, వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇవ్వడం వీరి వృత్తి. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ రచనలు చేయడం ప్రవృత్తి. పన్నెండో ఏట నుంచే రచనలు చేయడం అలవాటు చేసుకొని, ఇరవై ఏండ్లలోపే వందకుపైగా కథలు రాశారు. ‘హొగినెక్కల్ జలపాతం’, ‘నాన్నా పులి.. నిజంగానే’, ‘ఇడ్లీ బాబాయి’, ‘దారి దోపిడి’ కథలు, ‘ప్లేటోనిక్ ప్రేమ’ సీరియల్ నవల మంచి పేరు తీసుకొచ్చాయి. తన అక్షరాలతో సమాజానికి ఎంతోకొంత మేలు జరగాలనేది ఆకాంక్ష. మానవత్వానికి, కరుణకు పెద్దపీట వేస్తూ కథలు రాస్తుంటారు. రచయితగా అందుకొన్న మొదటి బహుమతి ‘పునరాగమనం’ కథకే. కానీ, వృత్తిపరంగా అనేక అవార్డులు, సన్మానాలు అందుకొన్నారు. 2019లో బెస్ట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రెయినర్ ఇన్ ఇండియా అవార్డును దక్కించుకొన్నారు. జీహెచ్పీయూ (అమెరికన్ యూనివర్సిటీ) నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. భారత్ కే అన్మోల్ రత్న అవార్డు, ఇండియాస్ మోస్ట్ ఎవొకేటివ్ ట్రెయినర్ అవార్డును గెలుచుకొన్నారు.