శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. తాను తెచ్చిన పసరు మందుతో బిడ్డను రక్షించుకొంటాడు. కానీ అంతటితో కథ సుఖాంతం కాలేదు. ఎన్నో మలుపులు. ప్రభువుల సభకు బాల సంచారి రాక అతి పెద్ద మలుపు.
హో! మాయావీ! శ్రీహరీ.. నువ్వెన్ని మాయోపాయాలు చేసినా, ఎందర్ని కూడగట్టుకొని వచ్చినా, ఏ రూపంలో వచ్చినా నన్ను నువ్వు ఏమీ చేయలేవు” అనుకొంటూ ‘కాచుకో’ అని సింహనాదం చేశాడు. నకిలీ సింహాల అరుపులకు, పిల్లి కూతలకు అసలు సింహం బదులివ్వకుండా ఉంటుందా? గద పట్టుకొని వేగంగా తనమీదకు దూసుకొస్తున్న హిరణ్యకశిపుని ఒక్క చూపు చూశాడు. వెంటనే నిప్పుల్లో పడి కాలిపోయిన మిడతలా నృసింహుడి తేజస్సులో పడి అదృశ్యమయ్యాడు. మహా శక్తిమంతుడైన భగవంతుడి విషయంలో ఇది పెద్దగా చెప్పుకోవలసింది కాదు. ఎందుకంటే, సృష్టి ఆరంభంలోనే స్వామి తన తేజస్సుతో తమోగుణ ప్రధానమైన అంధకారాన్ని తాగేసి ఉన్నాడు.స్వామిని చూస్తూనే, హిరణ్యకశిపుడు గదను వేగంగా తిప్పుతూ పైకి విసిరేశాడు.నారసింహుడు చూస్తూ ఊరుకొంటాడా? గరుడ పక్షి పామును పట్టుకొన్నట్టు.. పట్టుకొని పైకి ఎత్తుకొని, చటుక్కున వదిలేశాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఏమనుకొన్నాడంటే.. ‘ఈ నరసింహుడు నా బల పరాక్రమాలకు భయపడి నన్ను వదిలేశాడు’ అని..
శ్రీ నరసింహావతారం అసాధారణమైనది. సకల దుష్ట శక్తులను, అష్టకష్టాలను శ్రీ నారసింహుడి నామస్మరణ ఒక్కటే దూరం చేస్తుంది. మనసారా నమ్మిన మనిషికి మనోవేదన ఉండదు. సకుటుంబ సమేతంగా, సపరివారంగా సుఖ శాంతులతో జీవించగలుగుతారు నారసింహుడి భక్తులెవరైనా!
ఎప్పుడైతే నారసింహుడి పట్టునుండి జారి ఇవతలపడ్డాడో.. అప్పుడే హిరణ్యకశిపుడిలో అహంకారం జడలు విప్పింది. మృగము, మనిషీ కాని ఈ వింతజీవి నన్నేమి చేయగలడు అనుకొన్నాడు. ఎందుకంటే.. ఆ రాక్షసరాజు పొందిన వరం సామాన్యమైనది కాదు. బ్రహ్మకోసం కఠోరమైన తపస్సు చేశాడు. ఆ మహా తపశ్శక్తితో బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకొన్నాడు. సర్వసమర్థుడైన బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునికి అతడు కోరిన అనూహ్యమైన వరాలను ప్రసాదించాడు.
యది దాస్యస్వభిమతాన్
వరాన్మే వరదోత్తమ!
భూతేభ్యస్త్వది సృష్టేభ్యో
మృత్యుర్మాభూన్మమప్రభో!!
“ప్రభూ! బ్రహ్మదేవా.. వరాలిచ్చే దేవుళ్లందరిలో గొప్పవాడివి. నా తపస్సు నిన్ను మెప్పించింది కనుక.. నీవు నిజంగా నాకు వరం ఇవ్వదలిస్తే.. మాట తప్పనని మాటిస్తే.. నేనో వరం కోరుకొంటాను. నువ్వు సృష్టించిన ఏ ప్రాణి వలనా నాకు చావు రాకూడదు. అంటే మనుషులు, పశుపక్ష్యాదులు, ప్రాణం ఉన్నా.. లేకపోయినా నన్ను చంపరాదు. అదే విధంగా దేవతలు, దైత్యులు, నాగులు.. మొదలైన వారి వల్ల నాకు మృత్యువు సంభవింపరాదు. అంతేకాదు, లోపల కానీ, బయట కానీ.. పగలు కానీ, రాత్రి కానీ నీచే సృష్టింపబడిన ప్రాణులకంటే వేరైన ఏ జీవుని వలన గానీ, అస్త్రశస్త్రముల చేత, భూమ్మీద, ఆకాశంలోనూ నాకు మరణం కలుగరాదు. సమస్త ప్రాణులకూ నేనే సార్వభౌముడిగా ఉండాలి”
అద్భుతమైన నారసింహావతార ఘట్టాన్ని కనులకు కట్టినట్టుగా వర్ణిస్తున్న బాల సంచారి మాటలకు మంత్రముగ్ధులై వింటున్నారు.. త్రిభువనమల్ల చక్రవర్తి, రామభట్టు, రాణీ చంద్రలేఖ, రాకుమారుడు సోమేశ్వరుడు.
“హిరణ్యకశిపుడు అన్ని వరాలూ పొందాడు కదా?” అడిగాడు సోమేశ్వరుడు.
“అవును” అన్నాడు బాల సంచారి.
“మరి ఆ వరాలను అతిక్రమించకుండా హిరణ్యకశిపుని నరసింహ స్వామి ఎలా చంపగలిగాడు? అంటే, దేవుడు కాబట్టి వరాలను, వరాల ప్రభావాన్ని పక్కకు పెట్టి.. రాక్షసుణ్ని చంపేశాడా?” సోమేశ్వరుని మాటలకు ఆశ్చర్యం కలిగింది బాల సంచారికి.
“అదేం ప్రశ్న.. దేవుడెక్కడైనా ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటాడా? బ్రహ్మదేవుడిచ్చిన వరాలు సామాన్యమైనవి కావు. వాటిని కాదనే శక్తి ఎవరికీ లేదు. పైగా హిరణ్యకశిపుడు తీవ్రమైన తన తపస్సు ద్వారా వాటిని సాధించుకున్నాడు. వరాలకు సంబంధించిన నియమాలను ఎవరూ పక్కన పెట్టలేరు. ఆ ప్రభావాన్నుంచి తప్పించుకోలేరు. తప్పించలేరు”
“మరైతే.. ఆ రాక్షసుడు కోరిన వరాలు ఇవే కదా! సృష్టిలో ఉన్న ఏ ప్రాణీ చంపలేదు. పగలూ – రాత్రి ఏ సమయంలోనూ చావు రాకూడదు. లోపల కానీ బయట కానీ.. భూమ్మీద, ఆకాశంలో మరణం ఉండదు. అస్త్రశస్ర్తాలు చంపలేవు. మరి హిరణ్యకశిపునికి చావు ఎలా వచ్చింది?”
“మహర్షి వేదవ్యాసులవారు సవివరంగా వర్ణించారు. శ్రీ నరసింహ స్వామి వారు మనిషి కాదు. మృగమూ కాదు. ఆయన బ్రహ్మ సృష్టిలోని వాడు కాదు. తానే దేవాధిదేవుడు. రాక్షసుణ్ని చంపింది రాత్రి కాదు.. పగలూ కాదు. అది సాయంసంధ్య. లోపల చంపలేదు.. బయటా చంపలేదు. సభా ద్వారం దగ్గర తన తొడలపైన పడేసి చంపాడు. అస్ర్తాలు, శస్ర్తాలు ఉపయోగించలేదు. పదునైన గోళ్లతో గరుడుడు, పామును చీల్చినట్టు చీల్చేశాడు”. అర్థమయ్యిందన్నట్టుగా తలూపాడు సోమేశ్వరుడు.
“ఎక్కడో ఏదో కలిసొచ్చి, అనేక శక్తులూ, పదవులూ సాధించుకొన్న తర్వాత.. ఆ వ్యక్తి ఒక శక్తిగా మారిన తర్వాత.. ఆ శక్తి అనేది ప్రజలకు ఉపయోగపడితే, దైవశక్తిగా మారుతుంది. ఆ వ్యక్తి దైవస్వరూపుడే అవుతాడు. తాను సాధించిన అపూర్వ శక్తులను, విజయాలను తన ప్రజలకు అంకితం చేస్తాడు. అటువంటివారినే ‘కారణజన్ములు’ అంటారు. జన్మను సార్థకంచేసుకొన్న ఆ పుణ్య పురుషులు.. మహాత్ములు, యుగ పురుషులూ అని కీర్తించబడుతారు. వారి కీర్తికి, శక్తికి, ప్రజానురక్తికి, ప్రభావానికి ఎవరైనా అసూయగ్రస్తులైతే, ఆ శక్తిని లేదా ఆ వ్యక్తిని నిర్మూలించాలని ప్రయత్నిస్తే.. ఆ ప్రయత్నం విఫలం చేయడానికి ఎన్నో శక్తులు తోడై నిలుస్తాయి..” ప్రశాంతంగా చెప్పాడు బాల సంచారి.
“అంటే మన ప్రభువులు త్రిభువనమల్ల చక్రవర్తిలాగా అన్నమాట..” వినమ్రంగా పలికాడు రామభట్టు.
“నేను కేవలం భూమిపైన పుట్టినటువంటివాడిని. ఆకాశం నుండి దిగొచ్చిన అవతారమూర్తిని కాదు. కారణజన్ములైన మహాత్ములతో, పుణ్యాత్ములతో నన్ను పోల్చడం సరికాదు”
..త్రిభువనమల్ల చక్రవర్తి మాటల్లోని మేధోవిధేయత రామభట్టును ఆలోచింపజేసింది.
“ప్రభూ! మీరు కారణజన్ములు. పొగడ్త కోసం నేనిది చెప్పడం లేదు. జన్మతః మీరు చక్రవర్తులు కాదు. మీ అన్నగారు సింహాసనం అధిష్టించారు. మీ నాయనగారు మిమ్మల్ని వారసుడిగా నిర్ణయించగా, అది సంప్రదాయం కాదని గట్టిగానే తిరస్కరించారు. అయినప్పటికీ.. భువనగిరి సామ్రాజ్య లక్ష్మి.. జనహితం కోరి మిమ్మల్నే వరించింది. మీరు సామ్రాజ్యాన్ని సుస్థిరం చేయడమే కాక.. చరిత్రలో మీ స్థానాన్ని సువర్ణాక్షరాలతో లిఖించుకొన్నారు..” రామభట్టు వినయంగా అన్నాడు.
అంతవరకూ మౌనంగా ఉన్న రాణీ చంద్రలేఖ.. తన భర్తను చూసింది.
ఎంత ప్రశాంతత.. ఆ వదనంలో!
తాను సర్వంసహా చక్రవర్తిననీ, ప్రజల తలరాతలను మార్చగల ‘అభినవ విధాత’ననీ.. సింహాసనాన్ని అధిష్టించిన లోకైకపతిననీ.. ఏ మాత్రం గర్వం లేదు. అహంకారం లేదు. ఇటువంటివాడు కాకుండా మరొకరు ఎలా అవుతారు యుగపురుషులు?
“ప్రభూ! జ్ఞాన వృద్ధులు, పెద్దలు రామభట్టుగారు చెప్పింది నూటికి నూరుపాళ్లూ నిజమే. చరిత్రను సృష్టించారు మీరు.. రాబోయే కాలాల్లో చాళుక్యవంశ చరిత్రను రాసే చరిత్రకారులు మీ పరిపాలనను ఒక ‘బంగారు కాలం’గా తప్పకుండా పేర్కొంటారు”
ఉద్వేగంతో రాణీ పలికిన మాటలు విని ప్రభువు చిరునవ్వు నవ్వాడు.
“రాణీ చంద్రలేఖా! రామభట్టుగారి మాటలను నేను నిజాలు అనో.. పొగడ్తలు అనో భావించడం లేదు. వాటిని ప్రజల తరఫున దీవెనలు అనుకొంటున్నాను. కవుల గొప్పతనం కావ్యాల్లో ఉంటుంది. రాజుల గొప్పతనం రాజ్యపాలనలో ఉంటుంది. పరిపాలన బాగుంటే.. పది కాలాలపాటు చెప్పుకొంటారు. ప్రజల నోళ్లమీద నానిన చరిత్రే నిజమైన చరిత్ర అవుతుంది. శిలా శాసనాలు ప్రమాణం కాదు. శాసనాల వలన బతుకులు బాగుపడిన పౌరుల సుఖ సంతోషాలే అసలైన ఘనతను చాటి చెబుతాయి. ‘గొప్పవాడివి’ అని కొందరితో అనిపించుకొంటే.. నేను గొప్పవాడిని కాలేను. అందరి సుఖ సంతోషాలకు కొంతైనా.. నేను కారణమైనప్పుడు నా జన్మ చరితార్థమైనప్పుడే.. నాకు నేను గొప్పవాడిననుకొంటాను. ప్రజలకంటే.. అధికారులు, అధికారులకంటే.. ప్రభువు, ప్రభువు కంటే.. దేవుడు, దేవుడి కంటే.. భక్తుడు గొప్పవాడు అనుకొంటాను”.
త్రిభువనమల్లుని అభిప్రాయం అర్థమైంది ఒక్క బాల సంచారికి మాత్రమే!
“త్రిభువనమల్ల చక్రవర్తీ! బాగా చెప్పావు. దేశాన్నేలే రాజుకంటే ఆయన పూజించే దేవుడు గొప్పవాడు. అలాంటి దేవుడి కంటే భక్తుడే గొప్పవాడు. నువ్వు చెప్పింది అక్షరాలా సత్యం! అయితే, ఇంకో విషయం ఉంది. అంతటి గొప్పవాడైన భక్తుడు రాజ్యాన్ని పరిపాలించే భక్తుడైతే.. అదింకా గొప్ప విషయం” అన్నాడు బాల సంచారి.
బాల సంచారి ధోరణి ఎటు నుంచి ఎటు వెళ్తుందో తెలియక, తల్లికేసి అయోమయంగా చూశాడు సోమేశ్వరుడు.
“బాల సంచారీ! ఏమిటి నీ మాటలకర్థం. రాజ్యాన్ని పరిపాలించాల్సింది పాలన తెలిసిన ప్రభువులే కానీ.. ఆరాధనా విధానాలు తెలిసిన ఆచార్యులు కాదు. పరిపాలన అనేది లౌకికం. భక్తి అనేది ఆధ్యాత్మికం. పాలనలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. అది కొంతమందికి బాధ కలిగించవచ్చు. కానీ, భక్తి అనేది వ్యక్తిగతం. పరిపాలనా వ్యవస్థలో అది అసంగతం అని నా అభిప్రాయం” తన మనసులో భావాలను వెల్లడించింది రాణీ చంద్రలేఖ.
“భక్తి అనేది వ్యక్తిగతమనీ.. పరిపాలనలో అది అవసరం లేని అంశమని మీరంటున్నారు. అమ్మా.. మీకొకటి తెలుసా? రాజు ఎలా ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు. అందుకే, ‘యథారాజా తథా ప్రజా’ అంటారు. రాజు భక్తిపరుడైతే.. ప్రజలూ అదే బాటలో నడుస్తారు. భక్తి అనేది వ్యక్తిగతం కాదమ్మా! అది సంపూర్ణంగా సామాజికం! అదొక విలక్షణ క్రమశిక్షణ! నువ్వు నియమాల మాల ధరిస్తే.. ప్రజలూ అదే దారిన నడుస్తారు. ఆదర్శంగా తీసుకొంటారు. ధార్మికత అనేది మార్మికత కాదు. అది దార్శనికత. మనసును ప్రక్షాళనం చేసి జవజీవాలను నిలుపుతుంది. పరిపాలకుడు గుడి కట్టిస్తే.. ఆ గుడిలోకి ఆయనా, వారి కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్లరు కదా! అది అందరి ఆలయం అవుతుంది. అందరికీ ఆధ్యాత్మిక ఆదర్శ కేంద్రం అవుతుంది. నేర్చుకోవడంలో గుడి కూడా ఒక బడి అవుతుంది. బడి మనకు వ్యక్తిగతంగా ఎలా ఎదగాలో నేర్పిస్తే.. గుడి సామూహికంగా, సామాజికంగా ఎలా ఒదిగి ఉండాలో, ఆ రకంగా ఎలా ఎదగాలో నేర్పిస్తుంది”
బాల సంచారి నవ్వుతూ చెప్పిన ఆ మాటల్లోని తీవ్రత అందరికీ అర్థమైంది.
బాల సంచారి ఉద్దేశించిన భావం అక్కడున్న వారికి.. ఒక్కొక్కరికీ ఒక్కోలా అర్థమయ్యింది.
“బాల సంచారీ! భక్తి ఒక సామూహిక శక్తి అని నువ్వు అంటున్నావు. అంటే రాజ్యాన్ని పరిపాలించేవారు గుడులూ, గోపురాలు నిర్మించాలనా?” అగిడింది రాణీ చంద్రలేఖ.
“అవునమ్మా! వ్యవసాయమూ, విద్యాలయాలూ, వైద్యశాలలూ, నైపుణ్య శిక్షణా కేంద్రాలూ, వృత్తి విద్యలూ, పశు పోషణా, వ్యాపార స్థలాల నిర్వహణా.. ఇవన్నీ చాలా ముఖ్యమైనవే. ఈ అన్ని పనుల్లో తమ జీవనోపాధిని పొందుతూ జీవితాలు గడిపే వాళ్లకు మానసిక సమతుల్యత కావాలి. నిరాధార పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక ఆధారం కావాలి. నిస్సహాయ స్థితిలో ఒక ఆసరా కావాలి. ఒక ఆశ కావాలి. దానికొక రూపం ఉండాలి. అది మనల్ని ముందుకు నడిపించాలి. మనం కొత్తగా పుట్టించక్కర్లేదు..రూపాలను. ఎందుకంటే, మన పాపాలను, శాపాలను తొలగించడానికి అవతరించిన శ్రీ నారసింహుడే ఉన్నాడు. ‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ!’ అనుకోవాలి. నువ్వే నాకు శరణం. వేరే శరణం లేదు. నీ చరణాలే నాకు గతి. సద్గతి! అని అనుకోవాలి. తోటివారితో అనిపించుకోవాలి. అప్పుడు బాధా వ్యక్తిగతం కాదు. భక్తీ వ్యక్తిగతం కాదు”
“అదేం ప్రశ్న.. దేవుడెక్కడైనా ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటాడా? బ్రహ్మదేవుడిచ్చిన వరాలు సామాన్యమైనవి కావు. వాటిని కాదనే శక్తి ఎవరికీ లేదు. పైగా హిరణ్యకశిపుడు తీవ్రమైన తన తపస్సు ద్వారా వాటిని సాధించుకున్నాడు. వరాలకు సంబంధించిన నియమాలను ఎవరూ పక్కన పెట్టలేరు. ఆ ప్రభావాన్నుంచి తప్పించుకోలేరు. తప్పించలేరు”
పరిపాలకుడు గుడి కట్టిస్తే.. ఆ గుడిలోకి ఆయనా, వారి కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్లరు కదా! అది అందరి ఆలయం అవుతుంది. అందరికీ ఆధ్యాత్మిక ఆదర్శ కేంద్రం అవుతుంది. నేర్చుకోవడంలో గుడి కూడా ఒక బడి అవుతుంది. బడి మనకు వ్యక్తిగతంగా ఎలా ఎదగాలో నేర్పిస్తే.. గుడి సామూహికంగా, సామాజికంగా ఎలా ఒదిగి ఉండాలో, ఆ రకంగా ఎలా ఎదగాలో నేర్పిస్తుంది
(మిగతా వచ్చేవారం)
…అల్లాణి శ్రీధర్