రుతువు ఏదైనా.. భుజానికి కెమెరా తగిలించుకుని అడవిబాట పడుతాడు. వాగులూ వంకలూ దాటుతూ.. కొండలూ గుట్టలూ ఎక్కి దిగుతూ.. అరుదైన పక్షులు, వన్యప్రాణులను తన కెమెరాతో ‘క్లిక్’మనిపిస్తాడు. గిరిజన జీవన చిత్రాలను ఛాయా చిత్రాలుగా మలుస్తాడు వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ.
తీరిక లేకపోతేనేం, తపన ఉంటే చాలు.. ప్రవృత్తికి పదునుపెట్టుకోవచ్చని నిరూపిస్తున్నాడు ఆదిలాబాద్కు చెందిన లింగంపల్లి కృష్ణ. ఓ వైపు క్షౌరవృత్తి.. మరోవైపు పాత్రికేయ బాధ్యతలు నిర్వహిస్తూ తన జిల్లా అందాలను ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఏమాత్రం తీరిక దొరికినా పల్లెల వెంట ప్రయాణం మొదలు పెడుతాడు. ప్రకృతి, పక్షులు, వన్యప్రాణులు.. కెమెరా కండ్లకు కనిపించిన ప్రతి అబ్బురాన్నీ క్లిక్మని బంధిస్తాడు. జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకూ తనవంతు కృషి చేస్తున్నాడు. ఆదిలాబాద్ అడవుల్లో అరుదైన పక్షులెన్నో ఉన్నాయి. విదేశాల నుంచీ వచ్చి వెళ్తుంటాయి. వాటిని బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయత్నంలో ప్రొఫెషనల్ కెమెరాను కొనుగోలు చేసి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులను జల్లెడ పట్టాడు. ఆయా పక్షి జాతుల పేర్లు.. ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడికికెళ్తాయి? ఆహారం ఏమిటి? అనే సమాచారాన్నీ సేకరిస్తాడు.
బర్డ్వాక్ ఫెస్టివల్స్లో..
కృష్ణకు రెండుసార్లు బర్డ్ వాక్ ఫెస్టివల్స్ నుంచి ఆహ్వానం అందింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాతోపాటు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని పాఖాలలో నిర్వహించిన బర్డ్ వాక్ ఫెస్టివల్లోనూ అరుదైన పక్షులను తన కెమెరాలో బంధించాడు. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. అమాయక గిరిజన జీవితాలకు అద్దంపట్టే చిత్రాలూ అనేకం తీశాడు లింగంపల్లి కృష్ణ.