మారథాన్, వాక్థాన్, ఫుడ్థాన్, శారీథాన్.. ఇప్పుడు కొత్తగా ముందుకొచ్చిన మహత్తర కార్యక్రమమే ‘ఎగ్థాన్’. పోషకాహారం లభించక ఇబ్బంది పడుతున్న చిన్నారులకు, పేదలకు ఆరోగ్యాన్ని పంచే ప్రాజెక్టు ఇది. అవసరమైన వారికి విటమిన్లు, ప్రొటీన్లు అపారంగా ఉన్న గుడ్డును ఉచితంగా అందించడానికి కృషి చేస్తున్నారు .. ‘ఎగ్థాన్’ నిర్వాహకులు.
చికిత్స కోసం వెళ్లినవారికి వైద్యులు చివరిగా చెప్పేమాట – ‘మీరు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలున్న ఫుడ్ తీసుకోవాలి. కనీసం రోజుకో గుడ్డు తినండి చాలు’. ఎందుకంటే గుడ్డులో విటమిన్స్, ప్రొటీన్స్ వంటి ఎన్నో పోషకాలుఉంటాయి. డబ్బున్నవారైతే ఎలాగైనా తినగలుగుతారు. అదే పేదవారైతే, అనాథలైతే, వృద్ధాశ్రమాల్లోని వృద్ధులైతే, రోడ్డున బతికే అన్నార్థులైతే.. రోజూ ఓ గుడ్డు తినగలరా? అంత స్థోమత వారికి ఉంటుందా? ‘అలాంటివారి కోసమే మా ఎగ్థాన్’ అంటున్నారు వాల్మీకి ఫౌండేషన్ నిర్వాహకులు
హరికిషన్. ఆరోగ్యవంతమైన సమాజం కోసం పేదలకు, నిస్సహాయులకు రోజూ ఓ గుడ్డును అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో పుట్టింది..
ఎగ్థాన్. జూలై 1న ప్రారంభమైన
ఎగ్థాన్ ద్వారా ఇప్పటికే 50వేల గుడ్లను సేకరించారు నిర్వాహకులు. అనాథాశ్రమాల్లో ఉండేవారికి, పేద పిల్లలకు వీటిని పంపిణీ చేశారు.
కొత్తగా ‘ఎగ్లెన్స్’..
ఎగ్థాన్ అనేది నిరంతర ప్రక్రియ. పేదలకు రోజూ ఓ గుడ్డు చేరేవరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. దీనిలో భాగంగా అంబులెన్స్ మాదిరిగా..
‘ఎగ్లెన్స్'(ఎగ్స్ ఆన్ వీల్స్) వాహనాలను త్వరలో ప్రారంభించనున్నారు. వీటిద్వారా సమీప బస్తీల్లోని పేదలు, అనాథలు, వృద్ధులకు ఉచితంగా గుడ్లు అందిస్తారు. ‘ఎగ్లెన్స్’ వాహనంలో గుడ్లు నింపుకొని అవసరమైన చోటికి చేరవేస్తారు. అందుకోసం కోళ్ల పరిశ్రమల నిర్వాహకులనుంచి సామాన్యుల వరకూ అందరినుంచీ గుడ్లు సేకరిస్తున్నారు. “గుడ్డి దానాల కన్నా.. గుడ్డు దానం మిన్న.. అన్నది నేను నమ్మే సిద్ధాంతం. అందుకే నిత్యం పదివేల గుడ్లు నిల్వ ఉంచే ఉద్దేశంతో ‘ఫిజికల్ ఎగ్ బ్యాంక్’ను బోయిన్పల్లిలో ప్రారంభించనున్నాం. దీని ద్వారా మరింతమందికి పౌష్టికాహారం అందించిన వాళ్లం అవుతాం. వచ్చే ఎగ్థాన్స్లో కార్పొరేట్, సాఫ్ట్వేర్ కంపెనీలను భాగస్వాములను చేయబోతున్నాం.
ఎగ్థాన్ను ప్రతి సంవత్సరం నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు చాలామంది సహకరిస్తున్నారు. వారందరికీ వాల్మీకి ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు. మా ద్వారా #ఎగ్బ్యాంక్ చాలెంజ్ను ప్రమోట్ చేస్తున్నాం. మీ దగ్గర్లోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో గుడ్లు పంపిణీ చేసి, ఆ ఫొటో అప్లోడ్ చేసి మా చాలెంజ్లో భాగస్వాములు కండి” అని కోరుతున్నారు హరికిషన్.
ఎగ్బ్యాంక్ కోసం..
సోషల్ మీడియా వేదికగా ఎన్నో చాలెంజ్లు వచ్చాయి. అవన్నీ ప్రజాదరణ పొందాయి. ‘ఐస్ బకెట్’ నుంచి ‘రైస్ బకెట్’ వరకూ ప్రజల్లో సామాజిక స్పృహను రగిలించాయి. ఆ జాబితాలో కొత్తగా చేరింది ‘ఎగ్ చాలెంజ్’. దీని ద్వారా సేకరించిన గుడ్లను ఒకచోట చేర్చి
‘ఎగ్బ్యాంక్’ను ఏర్పాటు చేశారు వాల్మీకి ఫౌండేషన్, రోటరీ క్లబ్ నిర్వాహకులు. 2017లో ప్రారంభమైన ఎగ్బ్యాంక్ దేశంలోని 22 ప్రాంతాల్లో సేవలు కొనసాగిస్తున్నది. ప్రజలనుంచి సేకరించిన గుడ్లను అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఉచితంగా అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. డబ్బు రూపంలో అందిన సాయాన్ని కూడా గుడ్ల రూపంలోకి మలిచి ఎగ్బ్యాంగ్లో నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకొక గుడ్డు కాకపోయినా.. వారానికి కనీసం మూడు గుడ్లు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఎగ్బ్యాంక్కు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ వెన్నుదన్నుగా నిలిచారు. స్వచ్ఛందంగా ప్రచారం చేస్తూ తనవంతు సహకారం అందిస్తున్నారు. ఎగ్బ్యాంక్ను మెక్సికో, నేపాల్లలో కూడా ప్రారంభించారు. అక్కడి స్వచ్ఛంద సంస్థలు నెలకు పదివేల గుడ్లు ఉచితంగా అందించడం ద్వారా.. ఉద్యమానికి అండగా నిలుస్తున్నాయి.