కరోనాతో గత సంవత్సరం చాలా బాధపడ్డాం. మాటల్లో చెప్పలేనిఆవేదనను అనుభవించాం. ఏడాది దాటినా అదే భయం, అంతేఆందోళన. దీనినుంచి బయటపడాలంటే సంగీతమే మార్గమని అంటున్నారు ఇద్దరు మ్యుజీషియన్లు.అనడమే కాదు, పబ్లిక్ పార్క్లలో సంగీత కచేరీలు చేస్తూకొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
సంగీతం.. ఆనందాన్నే కాదు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. ఆ సరిగమల సాంత్వనలో మనసు ఉల్లాసవంతం అవుతుంది. మనిషికి ఉత్సాహం కలుగుతుంది. మానసిక ఒత్తిడి మాయమైపోతుంది. ఈ కారణంతోనే పార్కులలో కచేరీలు నిర్వహిస్తున్నారు తత్వ ఆర్ట్స్ వ్యవస్థాపకులు అఖిలేష్ వషీకర్, గజేందర్ షెవాల్కర్. ఆ ఇద్దరూ తమ మనసులోని మాట చెప్తే కొందరు నవ్వారు, కొందరు ఎగతాళి చేశారు. ఏ రవీంద్రభారతో, త్యాగరాయ గానసభో కాదు.. కచేరీలకు పార్కులే సరైన వేదికలని నమ్మారు వీరు. సాధారణంగా ఆరోగ్యం కోసం, ఆహ్లాదం కోసం పార్కులకు వస్తుంటారు జనం. వారికి అదనంగా ఆనందమూ పంచవచ్చు. వెంటనే, తమ ఆలోచనకు ఆచరణ రూపమిచ్చారు. మొదటి కచేరీ నారాయణగూడలోని మెల్కొటే పార్క్లో జరిగింది. ఆరున్నర ఎకరాల్లో విస్తరించి ఉంటుందీ ఉద్యానవనం. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ కోసం వందల మంది వస్తుంటారు. వాళ్లంతా నడుస్తూ నడుస్తూ సంగీతాన్ని ఆస్వాదిస్తారు. పార్కు కచేరీలవల్ల మరో ఉపయోగమూ ఉంది. ఓవైపు చక్కని సంగీతం వినిపిస్తూ ఉంటుంది కాబట్టి, కాలక్షేపం కబుర్లకు తాళం పడుతుంది. దీంతో గాసిప్స్కు అడ్డుకట్ట పడుతుంది. చెడు ఆలోచనలూ రావు. ఓ మోస్తరు ధ్యానస్థితిలోకి వెళ్లిపోతారు.
ఆ ఇద్దరూ..
అఖిలేష్ సంగీత నిపుణుడు. తత్వ ఆర్ట్స్ ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సంగీతాన్ని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గజేంద్ర షెవాకర్ తబలా విద్వాంసుడు. ఉద్యాన సంగీత ఉద్యమంలో వీరికి ప్రీతేష్ పాటిల్, ప్రశాంత్ సర్దేశ్ముఖ్ సహకారం అందిస్తున్నారు. వాస్తవానికి కచేరీలు అంటేనే ఖర్చుతో కూడుకున్న పని. అలాంటిది ఉచితంగా నిర్వహించడం గొప్ప విషయమే. మొదటగాఈఎన్టీ స్పెషలిస్ట్ లమాఖాన్ కట్టితో కలిసి ప్రోగ్రామ్ చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. కర్ణాటక, హిందుస్థానీ .. ఇలా అన్ని ప్రక్రియలూ జోడించి, అందరికీ నచ్చేలా ప్లాన్ చేయడం ఈ యువకుల ప్రత్యేకత. కీర్తన ప్రారంభానికి ముందు అది ఏ రాగం? దాని ప్రత్యేకత ఏమిటి? అనేదీ చెబుతారు. ప్రతి కచేరీ నిడివి గంట 20 నిమిషాలు ఉంటుంది. మొదటి కచేరీ జనవరి 24న జరిగింది. డాక్టర్ రమాకాంత్ వేణుగానం అందరినీ అలరించింది. దాదాపు రెండు వందలమంది వాకర్స్ ఆ సుస్వరాల్ని ఆస్వాదించారు. మార్చి 21న కొండాపూర్లోని కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్లో జరిగిన కచేరీ కూడా జయప్రదమైంది. మిగతారోజులతో పోలిస్తే కచేరీ ఉన్నరోజు నడకను బాగా ఆస్వాదించామని వాకర్స్ వెల్లడించారు కూడా.
మ్యూజిక్ థెరపీ
ఆరోగ్య సమస్యలను మందులతో తగ్గించుకోవచ్చు. కానీ, మనసు కుదుటపడితేనే శరీరం స్థిమితపడుతుంది. ఇక్కడే మ్యూజిక్ థెరపీ అవసరం అవుతుంది. తాళ్లపాక అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజస్వామి కృతులు, సితార్, వీణా వాదనలు వింటూ ఉల్లాసపడుతుంటారు వాకర్స్. హైదరాబాద్లో పార్కులకు కొదవ లేదు. వాటిన్నిటినీ సంగీత కచేరీలకు వేదికగా మార్చాలన్నదే తమ ఉద్దేశమని చెబుతారు నిర్వాహకులు. మిగతా రోజులతో పోలిస్తే, వారాంతంలో కచేరీలకు మరింత స్పందన లభిస్తున్నది. నిజమే, ఆదివారాన్ని ఏ ఆదితాళంతోనో ఆరంభిస్తే ఎంత బాగుంటుందీ!మొదట ‘ఎందరో మహానుభావులు’ అంటూ త్యాగరాజ కృతి, తర్వాత ‘ఓ పవనాత్మజ ఓ ఘనుడా’ అంటూ అన్నమయ్య కీర్తన, ముక్తాయింపుగా‘పలుకే బంగారమాయెనా..’ అంటూ రామదాసు కీర్తన.. మహామహుల కృతులు వింటూ నడక సాగిస్తుంటే.. అంతకు మించిన ఆనందం ఏం ఉంటుందీ? ఉదయానికి హృదయపూర్వకంగా స్వాగతం పలకాలనిపిస్తుంది! ‘ఇంకా
తెలవారదేమి..’ అంటూ రేపటి కోసం ఎదురుచూస్తాం.
ఇవీ కూడా చదవండి…
ఆలయం పూడ్చి.. మరుగుదొడ్ల నిర్మాణం
మంత్రి సత్యవతి రాథోడ్కు కరోనా పాజిటివ్
తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు చిరంజీవి కన్నుమూత