దిబ్బరొట్టె, మినుప రొట్టె, కొయ్య రొట్టె, చోవి రొట్టె.. పేర్లు వేరైనా రుచి ఒకటే. పోషకాలతో పొట్ట నింపే దిబ్బరొట్టె అంటే అందరికీ ఇష్టమే. వందల ఏండ్ల చరిత్ర కలిగినఈ పోషకాల పుట్ట గురించి..
సాధారణంగా ఇడ్లీ, దోశ పిండి పద్ధతిలోనే దిబ్బరొట్టె పిండినీ చేస్తారు. ఒక కప్పు మినుప పప్పునకు రెండు కప్పుల బియ్యం చొప్పున ఐదు గంటలపాటు నానబెట్టి, మెత్తగా రుబ్బి రాత్రంతా పులియబెడతారు. పులిసిన పిండిలో తగినంత ఉప్పు కలిపి, మందపాటి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనెవేసి దాదాపు బెత్తెడు (మూడు ఇంచులు) మందంతో పిండివేసి సన్నని మంటపై ఇరవై నిమిషాలపాటు ఉడకనిస్తారు. రొట్టె గట్టి పడ్డాక రెండో వైపునకు తిప్పి మరికాస్త నూనె వేసి కాల్చుకుంటే బయట కరకరలాడుతూ, లోపల మెత్తమెత్తగా ఉంటూ..నోరూరించే దిబ్బరొట్టె తయార్, ఆకలి పరార్!
ఒకప్పుడు తెలంగాణలో మినుములు, పెసలు, బబ్బెర్ల వంటి పప్పుధాన్యాలు విరివిగా పండేవి. వీటితో మినుప వడలు, మినుప అట్లు, మినుప లడ్డూలు (సున్నుండలు).. వంటి బలవర్ధకమైన వంటలు చేసేవారు. ఇడ్లీ, దోశ వగైరా ఆధునిక అల్పాహారాలకు పూర్వమే మనకు ఆవిరి కుడుములు, దిబ్బరొట్టెల వంటి పౌష్టికాహారం అందుబాటులో ఉంది. తెలంగాణ గృహిణికి జేజేలు!
ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి..ఇలా రోజూ ఉదయం ఏదో ఒకఅల్పాహారం తీసుకుంటాం. సాయంత్రం అయ్యిందంటే చాలు.బజ్జీ, సమోసా, సర్వపిండి, జంతికలు, చేగోడీలు.. వంటి చిరుతిళ్లు కావాల్సిందే. కానీ, దిబ్బరొట్టెకు అలాంటిపరిమితులేం లేవు. ఉదయమైనా,సాయంత్రమైనా.. వేళలతో పన్లేకుండా వేళ్లకు పనిచెప్పే ప్రత్యేక వంటకమిది.
దిబ్బరొట్టె – తేనెపాకం తిరుగులేని జోడీ. కొన్ని ప్రాంతాల్లో తేనెకు బదులు బెల్లం పాకంతో తింటారు. పిండి మిశ్రమంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర వేస్తారు. పల్లీ చట్నీ, అల్లం చట్నీ, పచ్చిమిర్చి చట్నీ, సాంబారు మంచి కాంబినేషన్. కొన్నిచోట్ల పిండిలో పచ్చికొబ్బరి, బెల్లం వేసి తీపి రొట్టెలూ చేస్తారు.
మధుమేహంతో బాధపడేవారు బియ్యం, మినుప పప్పునకు బదులుగా కొర్రలు, సామల వంటి
చిరుధాన్యాలతోనూ చేసుకోవచ్చు.ఇందులో వాడే పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. పిండి బాగా పులియడం వల్ల ఎంత మందంగా ఉన్నా ఇట్టే జీర్ణం అవుతుంది. మరెందుకు ఆలస్యం.. మీరూ ఓ రొట్టె కాల్చేయండి.