దేశంలో వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో జరిగిన రైతు ఉద్యమాల చరిత్రకు దర్పణం ఈ పుస్తకం. వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలు ప్రస్తావిస్తూ, ఈ రంగం అభివృద్ధి సాధించడం ద్వారానే పల్లెలు ప్రగతి వైపు పయనిస్తాయని సూచిస్తూ డాక్టర్ యలమంచిలి శివాజీ పలు సందర్భాల్లో రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలను
‘పల్లెకు పట్టాభిషేకం’ పుస్తకంగా తీసుకొచ్చారు. గత ఐదు దశాబ్దాలలో వ్యవసాయ రంగంలో ఆశించిన మార్పులు, వ్యవసాయ అభివృద్ధిలో నెలకొన్న సంక్షోభం, వాటిపై ఆధారపడిన కుటుంబాల వ్యథలు, సాగునీరు, విద్యుత్,
ఎరువులు, రుణాలు.. వంటి అనేక అంశాలను విభిన్న కోణాల్లో స్పృశిస్తూ ఆయన రాసిన వ్యాసాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. పార్లమెంటు మాజీ సభ్యుడు, రైతు నాయకుడు యలమంచిలి శివాజీ క్షేత్రస్థాయిలో రైతులు, గ్రామాల పరిస్థితులను విశ్లేషించడమే కాకుండా, భారత్, చైనాల మధ్య ఆసక్తికరమైన సారూప్యతనూ గమనించారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకునేందుకు రైతు శ్రేయోభిలాషులు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విద్యార్థులకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
-వరకవుల దుర్వాసరాజు
పల్లెకు పట్టాభిషేకం (పల్లెల ప్రగతి వ్యాసాల సంపుటి)
రచన: యలమంచిలి శివాజీ
పేజీలు: 452, వెల: రూ. 200
ప్రతులకు: రైతు నేస్తం పబ్లికేషన్స్
9676797777