ఆ కలం.. ‘సాఫ్ట్వేర్ లైఫ్ కోసం’ అంటూ చిత్రసీమలో తొలి అడుగు వేసింది. ప్రేమలోని మైమరపును వర్ణిస్తూ సాగే పాటలతో పరుగులు తీసింది. హుషారు గీతాలతో యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఆ ఖలేజా ఉన్న కలం .. సినీకవిగా అందరితో ‘శభాష్’ అనిపించుకొంటున్న నాగరాజు కువ్వారపుది.
కవిగా, వర్ధమాన సినీ గేయ రచయితగా సుపరిచితులు నాగరాజు కువ్వారపు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని వెంకటాపురం నాగరాజు స్వస్థలం. శ్రీనివాసరావు – అరుణ దంపతులకు 1991 సెప్టెంబర్ 21న జన్మించారు. తండ్రి తెలుగు అధ్యాపకుడు కావడంతో చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువ ఏర్పడింది. కవితలు రాయడం, పాటలు పాడటం అభిరుచిగా అలవడింది. సినిమా సాహిత్యంపైనా ఆసక్తి కలిగింది. దీంతో బాల్యం నుంచే అధ్యయనాన్ని అలవాటు చేసుకొన్నారు. ఖమ్మంలో బీటెక్ చేశారు. సాంకేతిక విద్యను అభ్యసించినా, సాహిత్యరంగంలోనూ సత్తా చాటారు. కవిత్వంతోనే ఆగిపోకుండా, సినీ పాటల వైపూ వడిగా అడుగులు వేశారు.
తొలి అడుగు.. ‘అమీర్పేట్లో’
2016లో దర్శకుడు అనిల్ మద్దెల ప్రోత్సాహంతో ‘అమీర్పేట్లో..’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు నాగరాజు. ఇందులో ‘సాఫ్ట్వేర్ లైఫ్ కోసం..’ అంటూ ఐటీ ఉద్యోగుల జీవితాలను అక్షరబద్ధం చేశారు. ‘ముందు చూస్తే పొట్ట.. నెత్తిపైన బట్ట.. కంటి చూపు ఫట్టా.. పిల్లనివ్వట్లేదు ఎట్టా’ లాంటి వాక్యాల్లో ఉద్యోగాన్వేషణలో పడిపోయి జీవితాన్ని కోల్పోతున్న యువకుల జీవితాలను కండ్లముందుంచారు. ఆ తర్వాత, 2017లో వచ్చిన ‘ఉందా లేదా?’ చిత్రంకోసం ‘సెల్ఫీపిల్లా’ అనే పాట రాశారు. అలకలో ఉన్న చెలిని బుజ్జగిస్తూ, ఆమె అందచందాల్ని హృద్యంగా పొగిడారు. ఈ పాటలోని ‘నింగిలోని పాలపుంత కూడా చిన్నబోదా నిన్ను చూస్తే’ వంటి పంక్తుల్లో ప్రేయసి అందాన్ని కవిత్వీకరించారు. ఇదే సినిమాలో ‘పిల్లా.. రసగుల్లా’ అంటూ ఓ హుషారు గీతాన్నీ రాశారు. లేత వయసులో ఓ ప్రేమికుడు పాడుకునే పాటను అందంగా ఆవిష్కరించారు. ఇందులో ‘నా చుట్టూ ఉన్న లోకాన్ని మరచిన.. ముందే ఉన్న రూపాన్ని కలిసిన.. చూపుల్లోని బాణాలు తగిలిన నిన్నే చూస్తున్నా..’ అంటూ ప్రేమికుడి వయసు తపనను హృద్యంగా మలిచారు.
ప్రైవేట్ గీతాల్లోనూ..
ప్రతి పాటనూ లయబద్ధంగా, కవితాత్మకంగా ఆవిష్కరించే నాగరాజు ప్రతిభాపాటవాలకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు వరించాయి. ‘నాన్నతో అనుబంధం’ అనే డాక్యుమెంటరీకి ఉత్తమ గీత రచయిత పురస్కారం దక్కించుకొన్నారు. తెలంగాణ కళాపరిషత్ నుంచి ఉగాది పురస్కారం అందుకొన్నారు. సినిమా పాటలతోపాటు అనేక ప్రైవేటు గీతాలనూ అందించారు. కవిగానే కాకుండా గాయకుడిగానూ చిత్రసీమలో రాణిస్తున్నారు. తొమ్మిదిసార్లు ఉత్తమ గాయకుడిగా ఎంపికయ్యారు.
తొలిప్రేమను వర్ణిస్తూ..
ప్రేమ పాటల రచనలో నాగరాజు కలం సరికొత్తగా ఉరకలేసింది. తొలిప్రేమలోని సోయగాన్ని వర్ణిస్తూ ముందుకు సాగింది. 2020లో వచ్చిన ‘ఉత్తర’ సినిమా కోసం రాసిన ‘ఓ చూపే చుక్కల ముగ్గులా.. రూపం గోపెమ్మలా..’ అనే పాట కూడా ప్రణయ భావుకతను చాటుతుంది. ఇందులోని ‘అందాల దేవత.. భూలోకవాసిగా మారి, ముందుంటె చూస్తున్నా..’ అంటూ సాగే వాక్యాల్లో ప్రేయసిని స్వర్గలోక అధిదేవతగా భావించిన తీరు బాగుంది. ప్రేమికుడు ఆమెపై చూపిస్తున్న నిండైన ప్రేమకు సాక్ష్యంగా ఈ పాట నిలిచింది. అదే ఏడాది వచ్చిన ‘ఓయ్ ఇడియట్’ సినిమాలోని పాటలన్నీ నాగరాజు రాసినవే. ఇందులో ప్రతి పాటా ఎంతో వైవిధ్యభరితంగా సాగుతుంది. అటు ప్రణయాన్ని, ఇటు విషాదభరితమైన ప్రేమను ఆవిష్కరిస్తుంది. అందులోనూ‘కనుపాపే కన్నీటితో తడిసే వేళ’ అనే పాట, సరికొత్త అభివ్యక్తిని పరిచయం చేస్తుంది. ‘గాజు బొమ్మల్లే చూసుకున్నానే.. గాయమే చేసి వెళ్లిపోతుందే.. తీపి ముల్లల్లే గుచ్చుకున్నాదే..’ వంటి పంక్తుల్లో విరహ భావన వింతగా తొంగిచూస్తుంది.
–తిరునగరి శరత్ చంద్ర ,6309873682