‘అగరొత్తుల కురులే వలగా విసిరేశావే’(ప్రేమమ్) అంటూ సరికొత్త పదబంధాలతో మనల్ని అలరించిన కవి, ‘మౌన హృదయరాగమే ప్రేమపలుకు భావం’(తిప్పరా మీసం).. అంటూ అక్షర ప్రయోగంతో మనల్ని మురిపించిన భావుకుడు, సినీగేయ రచయిత.. పూర్ణాచారి. ‘అలా ఎలా?’ సినిమాలోని ’ఓషో యు ఆర్ మై కాదల్ కాదల్’ పాటతో పరిచయమైన పూర్ణ ‘జోరు’, ‘మథనం’, ‘కనబడుటలేదు’ తదితర సినిమాల కోసం అద్భుతమైన పాటలు రాశారు. నిండైన కవితా సౌందర్యం, భావ సౌకుమార్యం ఆయన పాటల్లో పొంగిపొర్లుతాయి.
కవిగా, సినీగేయ రచయితగా పేరు తెచ్చుకొన్న చల్లూరి పూర్ణాచారి ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు సమీపంలోని బండారుపల్లిలో జన్మించారు. తండ్రి రాజమౌళి, తల్లి లక్ష్మి. చిన్నప్పటినుంచే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అలా పాటలపై మక్కువ ఏర్పడింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ చేసిన పూర్ణ సినీగేయ రచయితగా ఎదగాలన్న సంకల్పంతో అనేక ప్రయత్నాలు చేశారు. 2014 లో ‘అలా ఎలా?’ సినిమాలోని ‘ఓషో యు ఆర్ మై కాదల్ కాదల్’
అనే పాటతో గీత రచయితగా పరిచయమయ్యారు. ‘సారవంతం అయ్యే నిన్ను తాకిన నేల భారమంతా తీరే నిన్ను చూసిన వేళ’ అంటూ అల్లిన పాటలోని సాహిత్యం అందర్నీ ఆకట్టుకుంది. మొదటిపాటతోనే తన ప్రతిభావ్యుత్పత్తులు చాటుకున్నారు.
‘జోరు’తో జోరుగా..
‘జోరు’ సినిమా కోసం పూర్ణ ‘మనసా చెప్పవే పొడుపు కథ’ అనే పాటను రాశారు. లేత వయసు మనసు పుటలు విప్పి ప్రేమభావాల్ని ఆవిష్కరించిన తీరు ఈ పాటలో కనబడుతుంది. ‘ప్రేమమ్’ లో ‘అగరొత్తుల కురులే వలగా విసిరేశావే.. పువ్వులకే రంగులనిచ్చే హరివిల్లువే..’ పాటలోని ప్రయోగాలు అభివ్యక్తి కావ్యాత్మకంగా సాగాయి. కురుల్ని అగరొత్తుల్లా ఊహించడం, హరివిల్లుల వర్ణాలు పూలకు అద్దడం.. వంటి కల్పనలన్నీ ప్రబంధ వర్ణనలను తలపిస్తాయి. ఇదే
సినిమాలో‘ప్రేమ పూసెనోయ్ వాడిపోయెనోయ్’ పాట కూడా పూర్ణాచారి కలం నుంచి జాలువారిందే. ‘అతడే’(2018)లో ‘సీతా కల్యాణమే’ పాటను రాశారు. ఈ గీతంలో ‘జీవితం చెరో సగం ప్రమాణమేగా, కాలమే ముడేసే ముళ్ళు మూడుగా’ అంటారాయన. రెండు నిండు జీవితాల్ని ఒక్కటి చేసే మూడు ముళ్ళ బంధాన్ని చాలా చక్కగా వివరించారీ గీతంలో. ‘ఆ మర్రిచెట్టు నీడ రాములోరి’,
‘రోషోమోన్ రోషోమోన్’ పాటలూ ఆయనవే.
ప్రేమకు నిర్వచనం
‘మౌనమే ఇష్టం’(2019) కోసం ‘ఎంత కొత్తగుంది ప్రేమలోన’ అనే ప్రణయ గీతాన్ని హృద్యంగా రాశారు. ‘తీపికబురేదో చెవిని తాకేలా లోపలేమూలో ఊపిరాపేలా’ వంటి పంక్తుల్లో తొలిప్రేమలోని పులకరింత కనబడుతుంది. ప్రేమ చిగురించిన మనసు పరవశించిపాడే తీరు కనిపిస్తుంది. ఇదే సినిమాలో ‘నీవల్లే నీవల్లే’, ‘మనసుకథ ఏమైందో’ తదితర పాటల కూడా రాశారు. ‘నిన్ను తలచి’(2019) లోని ‘నిన్ను తలచి నీతోనే ఉన్నా, నిన్ను తలచి నాతో లేకున్నా’ అనే విరహగీతం కరుణ రసాత్మకంగా సాగుతుంది. దూరమైన ప్రేయసీప్రియుల మనసుల్లో మొదలైన సంఘర్షణను, ఆవేదనను కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. ఈ సినిమాలోని ‘ఓహో చెలీ’, ‘ఓరి ఓరి మై గాడ్’, ‘ఏదో ఏదో’ పాటలు కూడా ఆయనవే. ‘బ్రాండ్ బాబు’(2018) లోని ’రావే రావే అలివేణి నీవేనీవే యువరాణి.. తెలుగింట పూసిన పసిడి కొమ్మవే పుడమి చూసి మురిసే’ పాట సంప్రదాయ
భావుకతకు అద్దం పడుతుంది. ఇదే సినిమాలోని ‘అందాల బ్లాక్ బెర్రీ’ పాట యువ హృదయాలకు చేరువైంది. ఈ సినిమాలోని అన్ని పాటలూ పూర్ణాచారి రాసినవే. ప్రతి పాటా ఉత్తమ సాహిత్యపు విలువల్ని చాటుతుంది.
అంతర్ ‘మథనం’
‘మథనం’(2019) లోని‘ఎగిరే ఎగిరే ఎగిరే హృదయమెందుకో’ పాట ప్రత్యేకమైంది. ‘తననే వెతికే క్షణమే మధురం, పరుగై కరిగే సమయం’ వంటి వాక్యాల్లో ప్రేయసి కోసం అన్వేషించే హృదయం తొంగి చూస్తుంది. ఇదే సినిమాలో ‘చందమామ’, ‘చూశా కనులను దాటి’ పాటలు కూడా అంతే లోతుగా రాశారు. ‘తిప్పరా మీసం’(2019)లోని ‘మౌనహృదయ రాగమే ప్రేమపలుకు భావం తాను వెతికె తీరమే చేరలేని దూరం’ పాట పూర్ణాచారికి ఎంతో గుర్తింపును తెచ్చింది. ఎంతో లయాత్మకంగా, రసాత్మకంగా, కవితాత్మకంగా సాగిందీ పాట. ఈ సినిమాలో ‘రాధారమణం’, ‘తిప్పరామీసం’ వంటి పాటలు కూడా రాశారు. ‘సవారి’(2020) లో ‘ఉండిపోవా నువ్విలా రెండుకళ్ళలోపల’ అంటూ ప్రియురాలిని సర్వస్వంగా భావించే ప్రేమికుడి హృదయాన్ని వివరిస్తారు. ‘కనబడుటలేదు’(2020)లోని ‘ఎదకేమై ఉంటుందే ఏదో చిత్రం జరిగిందే’ ఎదిగే వయసులో మనసు చిలిపి సందడిని, అలజడిని ఈ పాట వినిపిస్తుంది. ఇవే కాకుండా ఫ్రెండ్స్ vs లవ్, ఐ లవ్ యు ఇడియట్.. ఇలా 70 సినిమాల్లో 150 సినిమా పాటలు రాశారు.
-తిరునగరి శరత్ చంద్ర ,6309873682