బిల్డింగుల మీద నిటారుగా మొక్కలను పెంచే ట్రెండ్ ఊపందుకుంటున్నది. దీని వల్ల భవనాలు కూడా చల్లగా ఉంటాయనీ, చుట్టూ వాతావరణంలో కాలుష్యం తగ్గుతుందనీ తెలిసిందే! కానీ, చూసేవారి మనసును కూడా ఆ పచ్చని మొక్కలు సేదతీరుస్తాయా? అంటే, అవుననే చెబుతున్నారు సింగపూర్ పరిశోధకులు. అక్కడి నాన్యాంగ్ విశ్వవిద్యాలయం వారు ఈ విషయాన్ని నిరూపించే ప్రయోగం చేశారు. ఇందుకోసం వందమందిని ఎంచుకున్నారు. వారికి వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ అమర్చారు. వాటిలో కొందరికి మొక్కలతో నిండిన భవనాలను, మరికొందరికి సాధారణ భవంతులను చూపించారు. వీరిలో ఒత్తిడి తీరును గమనించేందుకు, శరీరాలకు ఈసీజీ పరికరాలను అమర్చారు. పచ్చదనాన్ని ఆస్వాదించినవారి మనఃస్థితి ప్రశాంతంగా మారిందట. మానసిక చికిత్సలోనూ పచ్చదనాన్ని ఓ మందులా సిఫారసు చేస్తున్నారు వైద్య నిపుణులు.