పడుకునే ముందు మొబైల్ ఫోన్లు చూడటం వల్ల నిద్రలేమి, ఒత్తిడి లాంటి రకరకాల సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. కొత్తగా ఇప్పుడు పరిశోధకులు మరో తీవ్ర హెచ్చరిక చేస్తున్నారు. నిద్రపోయే వరకూ మనం ఎలాంటి కాంతిలో ఉంటామన్నది, పడుకున్న తర్వాత జరిగే జీవక్రియలను ప్రభావితం చేస్తుందట. నీలం రంగు ఎక్కువగా ఉండే ఎల్యీడీ బల్బుల మధ్య ఎక్కువ సమయాన్ని గడిపితే… నిద్రపోయాక కూడా మన శరీర ఉష్ణోగ్రతలు, కొవ్వు కణాల మీద ప్రతికూల ప్రభావం ఉంటుంది. కొందరు అభ్యర్థుల మీద నీలం రంగు ఎక్కువగా ఉండే ఎల్యీడీ, నీలం రంగు తక్కువగా ఉండే ఎల్యీడీ బల్బులు ప్రసరింపజేసి.. ప్రయోగం చేసినప్పుడు… ఎల్యీడీ ప్రతికూల ప్రభావం స్పష్టంగా తేలింది. విద్యుత్ తక్కువ అవుతుందనో, చూసేందుకు కాంతివంతంగా ఉంటున్నాయనో రకరకాల బల్బులను ఉపయోగించేస్తున్నారు. ఇక వాటి ప్రభావాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చేసింది. వీలైనంతవరకూ సహజమైన కాంతిలోనే మన దినచర్యను పూర్తిచేసుకోవాలన్న సూచన కూడా ఇక్కడ వినిపిస్తున్నది.