ఊరూవాడను ఏకం చేసే వేడుక గణపతి నవరాత్రులు. వినాయక మంటపాలు సమాజాన్ని చైతన్య పరిచే వేదికలుగా నిలుస్తాయి. అయితే, నవరాత్రి ఉత్సవాలంటే కాలక్షేపం కోసం చేసే వేడుకలు కావు. మన సంప్రదాయాన్ని కొనసాగించడానికి ఉపకరించే ఆధ్యాత్మిక ప్రక్రియ ఇది. సామూహిక సాధనతో అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకునే క్రతువు ఇది. తొలిపూజలందుకునే విఘ్నేశ్వరుడిని దేవ, మానవ గణాలకు అధినాయకుడిగా భావిస్తారు. వేదాలు ‘గణానాం త్వ గణపతిం హవా మహే’ అని పూజల్లో ఆయనకు అగ్రస్థానమిచ్చాయి. గణపయ్యను స్వాగతించకుండా ఏ శుభకార్యమూ సాగదు.
వైదికంగా గణపతి ప్రాశస్త్యం అటుంచితే, లౌకికంగానూ ఆయన అందరివాడు. పిల్లలకు అలరించే దేవుడు. పెద్దలను ఆలకించే దేవుడు. ఇందరితో ఇంతలా సాన్నిహిత్యం ఏర్పడటానికి గణపతిలోని గుణాలే కారణం. ఇక్కడ గుణం అంటే ఇంద్రియం అని అర్థం. శరీరం, కర్మ, జ్ఞానేంద్రియాలు.. మనిషి మనుగడకు మూలాలు. పంచభూతాల ఏకత్వం వల్ల శరీరం ఏర్పడింది. తమో గుణం వల్ల స్థూల శరీరం, రజో గుణం వల్ల కర్మేంద్రియాలు, సత్వ గుణం వల్ల జ్ఞానేంద్రియాలు ఉద్భవించాయని చెబుతారు. నోరు, చేతులు, కాళ్ళు వంటివి కర్మేంద్రియాలు. అవి మాట, పని వంటి వాటికి ఉపయోగపడతాయి. చెవులు, చర్మం, కండ్లు, నాలుక, నాసికలు జ్ఞానేంద్రియాలు.. వినడానికి, తెలుసుకోడానికి, చూడటానికి, రుచి, వాసన గ్రహించడానికి అవసరమవుతాయి. శరీరం రథం. ఇంద్రియాలు గుర్రాలు. బుద్ధి సారథి. కోరికల నిలయమైన మనసు విషయ సుఖాల కోసమే జీవన రథాన్ని పెడదోవ పట్టిస్తుంది. అప్పుడు బుద్ధి చురుగ్గా ఉండాలి.
ఆ రథాన్ని రహదారిపైకి మళ్లించాలి. ఇలా జరగాలని ఇంద్రియాలపై విజయం సాధించాలని చేసే పూజలే వినాయకుడి ఆరాధనలు. నవరాత్రులూ ప్రార్థించడం వల్ల గణపతి కటాక్షం కలుగుతుంది. మనసు శుద్ధమవుతుంది. నిర్మల జీవనం సాధ్యమవుతుంది. వినాయక చవితినాడు ఈశ్వర తత్వాన్ని విఘ్ననాశక రూపంగా ఆరాధిస్తాం. విఘ్నాలు అంటే అవరోధాలు. విద్యలో, కార్యంలో, ఆధ్యాత్మికతలో ఏర్పడే అడ్డంకులు కాలాన్ని, ప్రకృతిని, జీవుల్ని నియంత్రించే ఈశ్వరుని అనుగ్రహంతో ఈ అవరోధాలను అధిగమించడానికే విఘ్నేశ్వరారాధన.