ఎన్ని ప్రత్యేక వంటకాలున్నా, చివరన కాస్త తీపి పడకపోతే భోజనం పరిపూర్ణం కాదు. అందులోనూ, మిఠాయిలకు చిరునామా మనదేశం . తాతల నాటి చక్కెర గోళీల నుంచి నేటి కత్లీలూ, బర్ఫీల వరకు.. అన్నీ ఈ గడ్డ మీద పురుడు పోసుకున్నవే. అలనాటి రుచుల్లో ఒకటైన మాల్పావ్ (చిట్టి అరిసె) గురించి ఈ వారం..
ఉత్తరాదిలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ తీపి పదార్థాన్ని కొన్ని ఆలయాల్లో ప్రసాదంగానూ పంచుతారు. పూరీ జగన్నాథ క్షేత్రంలో సంధ్యా పూజల్లో స్వామివారికి ఇవే నైవేద్యం. తెలంగాణలో అరిసెలకు ప్రత్యామ్నాయ వంటకంగా మాల్పావ్ ప్రసిద్ధి చెందింది. ‘హోలీ’ రోజున దీన్ని ఎక్కువగా వండుతారు. ఇఫ్తార్ విందులో కోవాతో కలిపి వడ్డిస్తుంటారు.
పండుగలైనా, పబ్బాలైనా .. నోరు తీపి చేసుకోవడమూ, చేయించడమూ తరాలసంప్రదాయం. ఇండ్లలో అయితే.. వారానికోసారైనా ఏదో ఒక పిండివంట చేయాల్సిందే. అదనంగా, వాడవాడలా మిఠాయి కొట్లు ఉండనే ఉన్నాయి, రారామ్మని పిలుస్తూనే ఉంటాయి. ఆ అరల్లో..మాల్పావ్ రుచుల రారాజు!
చిట్టి అరిసెగా పిలుచుకునే మాల్పావ్ అచ్చమైన సంప్రదాయ రుచి. బార్లీ పంటతోపాటే ఇదీ పుట్టిందని చెబుతారు. ఎందుకంటే, మాల్పావ్ను మొదట్లో బార్లీ పిండితోనే చేసేవారు. రానురానూ మార్పులు చేర్పులు జరిగిపోయి.. ప్రస్తుతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా చేస్తున్నారు. కానీ, రుచి మాత్రం అదే! నములుతూ నములుతూ స్వర్గలోకపు అంచులు చూస్తాం.
మాల్పావ్.. నేపాల్, బంగ్లాదేశ్లలోనూ ప్రాచుర్యం పొందింది. బంగ్లాలో దీని తయారీకి పచ్చి కొబ్బరి వాడతారు. నేపాల్లో బాగా పండిన అరటి పండ్లను జోడిస్తారు. చక్కెర, పాలు, గోధుమ మైదా, బియ్యపు పిండి, రవ్వ ప్రధాన దినుసులు. పదార్థాల నాణ్యత పెరిగేకొద్దీ రుచీ అధికం అవుతుంది.
పాలలో గోధుమలు లేదా మైదాతోపాటు రవ్వ, చక్కెర వేసి దోసెల పిండిలా జారుగా కలిపి.. దాదాపు మూడు గంటలపాటు నానబెడతారు. తర్వాత, సలసలకాగే నూనెలో గరిటతో పోస్తారు. చుట్టూ కరకరలాడుతూ పూరీల్లా పొంగిన పావ్లను తీసి, చక్కెర పాకంలో వేసి పైనుంచి డ్రై ఫ్రూట్స్, సోంపు, కోవా వేసి వడ్డిస్తారు. కొన్నిప్రాంతాల్లో పైనాపిల్, యాపిల్, మామిడి, అరటి పండ్ల గుజ్జును కూడా
జతచేస్తారు.
రుచిలోనేకాదు పోషకాల్లోనూ మాల్పావ్ ఎంతో ప్రత్యేకం. తయారీలో విరివిగావాడే పాలు, పిండి, ఎండు ఫలాల్లో శరీరానికి కావలసిన పోషకాలు ఉంటాయి. బెల్లంతోనూ వీటిని వండుకోవచ్చు.
బెల్లం పడితే పోషకాలకు కొదవేం ఉంటుంది? ఇంకెందుకు ఆలస్యం? మీరూ ఓసారి రుచి చూడండి.