‘ఫలితం సంగతి తర్వాత. ముందు ధైర్యంగా అడుగేయాలి.భయపడిపోయి మధ్యలోనే ఆగిపోతే, ఎన్నటికీ గమ్యాన్ని చేరుకోలేవు’అన్న గీతాచార్యుడు శ్రీకృష్ణుడి బోధ కరోనా కష్టకాలంలో ఇస్కాన్ సన్యాసులకు కర్తవ్య దీక్షోపదేశం చేసింది. పరిమితులను అధిగమించి పేదల ఆకలి తీర్చారు.
ఆ ఘట్టాన్ని షార్ట్ఫిల్మ్గా చిత్రీకరించి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోప్రదర్శించారు. అవార్డులు అందుకున్నారు.
కరోనా కష్టకాలంలో ఒక్కొక్కరిది ఒక్కో సేవ. అంతాకలిసి ఆకలితో ఉన్నవారి కడుపునింపారు. ఆ మహాయజ్ఞంలో సర్వసంగ పరిత్యాగులైన ఇస్కాన్ (కృష్ణ చైతన్య సంఘం) సన్యాసులూ పాల్గొన్నారు. లాక్డౌన్ను లెక్కచేయకుండా, కాళ్లరిగేలా తిరుగుతూ అన్నార్థుల ఆకలి తీర్చిన నిస్వార్థసేవే ఆ ముని బృందాన్ని ప్రపంచానికి కొత్తకోణంలో పరిచయం చేసింది. ఓ వైపు ‘హరే రామ.. హరే కృష్ణ’ అంటూ భజనలు చేస్తూనే.. కుచేలులలో కృష్ణ పరమాత్మను దర్శించారు. ఉచితంగా భోజనం అందించారు. ఆ ఘట్టాన్ని ‘మాంక్స్ ఆన్ మిషన్’ పేరుతో 11 నిమిషాల నిడివిగల షార్ట్ఫిల్మ్గా రూపొందించారు. ఇప్పుడా లఘు చిత్రం ‘ఠాగూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్
ఫెస్టివల్’లో ‘అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డు’ను గెలుచుకుంది. ‘హరియాణా ఇంటర్నేషనల్ కల్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘సన్ ఆఫ్ ది ఈస్ట్ అవార్డు’కు ఎంపికైంది.
ఫోన్లతో వాయిస్ రికార్డింగ్
గురుగ్రామ్లోని ఇస్కాన్ ఆలయం పరిసరాల్లో నిర్మించినఈ షార్ట్ఫిల్మ్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సాంకేతిక అనుభవం, ఖరీదైన పరికరాలు లేకున్నా అతి తక్కువ ఖర్చుతో ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు ఇస్కాన్ సన్యాసులు. షూటింగ్ సమయంలో స్మార్ట్ఫోన్లను జేబుల్లో ఉంచి వాయిస్ రికార్డ్ చేశారు. స్ఫూర్తిదాయకమైన షార్ట్ఫిల్మ్ చేయాలన్న తపనే తమను ముందుకు నడిపించిందని చెబుతారు దర్శకత్వం వహించిన రామభద్ర దాస. పదసేవన్ భక్తదాస రచనా సహకారం అందించారు. షూటింగ్, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ వ్యవహారాలన్నీ ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్ పంకజ్శ్యామ్ పర్యవేక్షించారు. ఆరాధ్య గౌరదాస (ప్రధానపాత్ర), శ్రీనిత్యదాస్, గిరిధారి దాస్, హరిదాస్, రాకేశ్ రోషన్, రాహుల్, పదసేవన్ నటించారు.
అద్భుతం.. స్వామీ!
ఈ షార్ట్ఫిల్మ్ చూస్తున్నంతసేపూ, ఎవరోప్రొఫెషనల్ నటులే ప్రాణంపోశారన్న భావన కలుగుతుంది. అంత చక్కగా తమ పాత్రలకు న్యాయం చేశారు ఇస్కాన్ స్వామీజీలు. నిజానికి, అందరూ మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చినవారే. ఒక్కో సన్నివేశానికి దాదాపు 30 నుంచి 40 టేక్లు తీసుకున్నారట. కాబట్టే అవుట్ఫుట్ పరిపూర్ణంగా వచ్చింది. డీఎస్ఎల్ఆర్ కెమెరాతో తీసినా, రెండు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ న్యాయనిర్ణేతలను మెప్పించగలిగారు కాషాయాంబర
ధారులు.
ఓ ఇస్కాన్ సన్యాసికి కరోనా ప్రభావిత కుటుంబం నుంచి ఆకలి తీర్చమంటూ ఫోన్కాల్ అభ్యర్థన వస్తుంది. ఒకటి తర్వాత ఒకటి.. రోజంతా దాదాపు అలాంటి విన్నపాలే. ఓ వైపు కరోనా. మరోవైపు లాక్డౌన్. సన్యాసులు సైతం బయటికి వెళ్లేందుకూ ఎన్నో పరిమితులు. కనీసం వండి పంపిద్దామంటే వాహనాలనూ తిరగనివ్వడం లేదు. సన్యాసులు వంట చేసుకోవడానికి మాత్రమే అక్కడో తాత్కాలిక వంటగది ఉంది. ఆ విపత్కర పరిస్థితుల్లోనూ ‘శ్రీకృష్ణుడి ఆలయానికి పదిమైళ్ల దూరం వరకూ ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ప్రభుపాదుల నినాదమే ఆలంబనగా, ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఉదయం ఆరాధన పూర్తి చేసుకొని, వంట ముగించి, భోజనం పార్సిళ్లతో.. బైక్స్ మీద వెళ్లి మరీ అన్నార్థుల ఆకలి తీర్చుతారు. పేదలలోనే పరమాత్మను దర్శించుకుంటారు.