భవన నిర్మాణమంటే మాటలు కాదు. పునాదులు తీసింది మొదలు.. స్లాబ్ వేసేదాకా ఎన్నో వస్తువులు, ఎన్నెన్నో పనులు. నెలలు, సంవత్సరాల తరబడి ఎదురుచూపులు. ఇవేవీ లేకుండానే నిర్మాణాలు సాధ్యం అవుతున్నాయి. షిప్పింగ్ కంటైనర్లతో కండ్లు చెదిరే భవనాలు పురుడు పోసుకుంటున్నాయి. క్షణాల్లో ఆసుపత్రిగా, బడిగా మారిపోతున్నాయి.ఇటీవల అత్యాధునిక మాడ్యులర్ క్లినిక్లను ఏర్పాటుచేసింది ఢిల్లీ సర్కారు. అవి మామూలు నిర్మాణాలే అయితే.. ఇక్కడ చర్చకు వచ్చేవే కాదు. షిప్పింగ్ కంటైనర్లతో నిర్మించినవి కాబట్టే.. దేశమంతా వాటి గురించి మాట్లాడుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ.. ఆస్పత్రుల్లో సరిపడా బెడ్లు లేక ఎన్నో దేశాలు ఇబ్బంది పడ్డాయి. అయితే దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు మాత్రం.. ఒకే ఒక ఐడియాతో ఈ సమస్య నుంచి గట్టెక్కాయి. షిప్పింగ్ కంటైనర్లను ఆస్పత్రులుగా మార్చి, కరోనా రోగులకు ఆశ్రయమిచ్చాయి. కారణం.. ఇనుప కంటెనర్లతో నిర్మాణాలు త్వరగా పూర్తికావడమే!
కొత్తేమీ కాదు..
షిప్పింగ్ కంటైనర్లను ఆవాసాల కింద మార్చడం కొత్త విషయమేమీ కాదు. ఇప్పటికే ఎన్నో దేశాల్లో వీటిని నివాస గృహాలుగా ఉపయోగించుకొంటున్నారు. ఫాం హౌస్లు, చిన్నచిన్న రెస్టారెంట్లుగానూ రూపుదిద్దుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నిరుపయోగంగా ఉన్న కంటైనర్లతో దేశ రాజధాని వ్యాప్తంగా వెయ్యి మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దాదాపు 500 క్లినిక్లు ఏర్పాటు చేయగలిగారు. ఇప్పుడు, మరో రెండు అత్యాధునిక పోర్టబుల్, మాడ్యులర్, ఏసీ క్లినిక్లను ఏర్పాటుచేసి, మరిన్ని వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిలో డాక్టర్కు, రోగులకు, ఫార్మసీకి సరిపడినంత చోటు ఉండేలా డిజైన్ చేస్తున్నారు.
కంటైనర్లో క్లాసులు!
ఎప్పుడు పడితే.. ఎక్కడ పడితే అక్కడికి మార్చుకునేందుకు వీలున్న కంటైనర్లను.. పాఠశాలలుగానూ మార్చుతున్నారు. మహారాష్ట్రలో ‘సమర్థ్ భారత్ వ్యాసపిత్’ అనే ఎన్జీఓ.. థానే మున్సిపల్ కార్పొరేషన్ సాయంతో నగరంలోని ఓ ఫ్లైఓవర్ కింద ‘సిగ్నల్ శాల’ పేరుతో కంటైనర్లతో ఓ బడిని రూపొందించారు. ఢిల్లీకి చెందిన ‘సఫేడుకేట్’ అనే సంస్థ గురుగ్రామ్లోని బినోలాలో దాదాపు ఎనిమిది కంటైనర్లతో శిక్షణా కేంద్రాన్ని నిర్మించింది. మురికివాడల్లోని పిల్లలు, భిక్షాటన చేసేవారి పిల్లల కోసం మరో 50 కంటైనర్ పాఠశాలలు నిర్మించనున్నట్లు ‘అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్’ వ్యవస్థాపకుడు అమరీశ్ చంద్ర ప్రకటించారు. కంటైనర్ల జీవితకాలం 12 ఏండ్లు. వాటిని రీసైక్లింగ్ చేయడం కష్టం. కాబట్టి, వాటిని కొత్తగా పునర్నిర్మించడమే ఉత్తమ మార్గమని ఘజియాబాద్కు చెందిన వాస్తుశిల్పి రాహుల్ జైన్ అంటున్నారు. ఇవి దృఢంగా, నాణ్యతగానూ ఉండటంతో భవనాలకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. వీటిన తరలించడమూ సులభమే కాబట్టి, అవసరమైన చోటికి తీసుకెళ్లొచ్చు.