ఎన్జీవోలు.. కొండలనూ గుట్టలనూ దాటుకొని మారుమూల ప్రాంతాలకు వెళ్తాయి. వైద్యం అందిస్తాయి. విద్య నేర్పిస్తాయి. స్వయం ఉపాధి మార్గాలు చూపుతాయి. కానీ, సాంకేతికంగా మాత్రం వెనుకబడే ఉంటాయి. టెక్నాలజీ మీద పట్టుసాధిస్తే.. సేవలో వేగం పెంచవచ్చు, పారదర్శకత తీసుకురావచ్చు. ఆ కొరతను తీర్చడానికే ‘టెక్4 గుడ్ కమ్యూనిటీ’ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 30 లక్షలకుపైగా ఎన్జీవోలు (ప్రభుత్వేతర సంస్థలు) ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే సేవకు టెక్నాలజీని జోడిస్తున్నాయి. కానీ, ఎక్కడో మారుమూల మండల కేంద్రాల్లో, గ్రామాల్లో పనిచేసే స్వచ్ఛంద సంస్థల పరిస్థితి ఏమిటి? వారికి సాంకేతికత గురించి ఎవరు చెబుతారు? ‘మేమున్నాం’ అంటూ ముందుకొచ్చారు ‘టెక్4 గుడ్ కమ్యూనిటీ’ సభ్యులు. వీరు పల్లెపల్లెకూ వెళ్లి ఎన్జీవోలకు సాంకేతిక సహకారం అందిస్తున్నారు.
ఇప్పటికే 600 ఎన్జీవోలకు..
‘టెక్4 గుడ్ కమ్యూనిటీ’ను రింజు రాజన్, అనూష మెహర్ భార్గవ, అఖిల సోమనాథ్.. అనే ముగ్గురు మహిళలు ప్రారంభించారు. వీరంతా గతంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా బృందంలో పనిచేశారు. ఎన్జీవోలకు సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమన్న విషయం అప్పుడే వారికి అర్థమైంది. ముగ్గురూ ఓ నిర్ణయానికొచ్చి‘టెక్ఫర్ గుడ్’కు రూపమిచ్చారు. ‘ఎన్జీవోలకు ఎలాంటి సాంకేతిక సాయం అవసరం?’ అన్నది తెలుసుకునేందుకు కొన్ని కేస్ స్టడీస్ను లోతుగా అధ్యయనం చేశారు. తొలి ప్రయత్నంగా, కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో దళిత మహిళలు నిర్వహిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించారు. వారికి టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు. ఆ మహిళలు తయారు చేస్తున్న ఆభరణాలను, ఇతర ఉత్పత్తులను ఆన్లైన్ వేదికగా ఎలా విక్రయించాలో నేర్పించారు. సామాజిక మాధ్యమాల ద్వారా సంస్థ కార్యకలాపాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో బోధించారు. ఇ-విరాళాలు సేకరించే విధానాన్నీ పరిచయం చేశారు. ఇక మిగిలింది అకౌంటింగ్ వ్యవస్థ. దాన్నీ డిజిటల్గా మార్చారు. ఇలా, ఇప్పటివరకు దాదాపు 600కు పైగా ఎన్జీవోలకు సాయం అందించారు. అంతేకాదు, ఆన్లైన్ వేదికగా నిర్వహించే ఈవెంట్స్, క్యాంపెయిన్స్, వర్క్షాపుల ప్రచారానికి సంబంధించి క్రియేటివ్ పోస్టర్స్ తయారీలో మెలకువలు చెబుతున్నారు.
ఈ సేవలకు గుర్తింపుగా.. ఫేస్బుక్ వంటి సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) విభాగం నుంచి గ్రాంట్స్ మంజూరు చేస్తున్నాయి. ‘ఓ మంచి ప్రయత్నానికి టెక్నాలజీ అనేది ఇంధనం లాంటిది’ అంటారు వ్యవస్థాపకుల్లో ఒకరైన రింజు రాజన్. ‘మా కార్యక్రమాల్లో మెంటారింగ్ కూడా ఓ భాగమే. ఎన్జీవోలకు వ్యూహ రచనలో, నిధుల సేకరణలో, బ్రాండింగ్లో సహకారం అందిస్తూ.. ఆ సంస్థ స్వావలంబన సాధించేలా తోడ్పడతాం’ అంటారామె. సాధారణ వ్యాపారులు కూడా ఆన్లైన్లో,ఆఫ్లైన్లో తమ దుకాణాలు నిర్వహించుకొనేలా టెక్ ఫర్ గుడ్ ఓ ప్లాట్ఫామ్ను రూపొందించింది. దీనిసాయంతో పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా.. ఇ-విపణిలో లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అమెజాన్తోనో, ఫ్లిప్కార్ట్తోనో పోటీపడవచ్చు.
కష్ట కాలంలో..
‘టెక్4 గుడ్ కమ్యూనిటీ’ రూపొందించిన ఓ సాఫ్ట్వేర్ పుణ్యమాని కరోనా కాలంలో సేవా కార్యక్రమాలు సులభతరం అయ్యాయి. తమతో అనుసంధానమైన ఎన్జీఓల కార్యక్రమాలను
‘బృహత్ బెంగళూరు మహానగర పాలకసంస్థ’కు ఇవ్వడంతో.. ఆయా ఎన్జీవోల్లో ఆశ్రయం పొందుతున్న రోగులకు మెరుగైన వైద్యం అందింది. ఈ నిస్వార్థ సేవలకు గూగుల్, సేల్స్ఫోర్స్, రేజర్పే వంటి పెద్ద కంపెనీలు మెంటర్షిప్ అందించేందుకు ముందుకొచ్చాయి. ‘సేవ అంటే వితరణ కాదు, బాధ్యత’ అంటారీ టెక్ గురువులు.