ఏ మహానగరంలో అయినా మున్సిపల్ సిబ్బందే ఇండ్లకు వచ్చి చెత్తను తీసుకెళ్తారు. నెల కాగానే, మన దగ్గర ఎంతోకొంత వసూలు చేస్తారు. అయితే, ఈ స్టార్టప్ ఇంటి వద్దకొచ్చి మరీ చెత్తను తీసుకెళ్లి, కిలోల లెక్కన డబ్బులిస్తుంది. ఒక్క హైదరాబాద్లోనే వీరికి ఏడువేల మంది చందాదారులున్నారు.
హైదరాబాద్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు రవీందర్ ఫ్యామిలీ. రోజూ ఇంట్లో పోగయ్యే చెత్తను, వ్యర్థాలను తడి/పొడిగా వేరుచేసి, క్యూఆర్ కోడ్ ఉన్న సంచిలో భద్రపరుస్తారు. వారాంతంలో ఓ వాహనం వచ్చి ఆ చెత్తను కిలోల లెక్కన తూకమేసి తీసుకెళ్తుంది. వాహనం వెళ్లిన గంటల వ్యవధిలోనే రవీందర్ అకౌంట్కు చెత్త తాలూకు డబ్బులు ఠంచనుగా జమ అవుతాయి.
‘ఇంట్లోని చెత్తను మున్సిపల్ సిబ్బందికి వేయడానికి బతిమిలాడాల్సినంత పనైపోతుంటే, చెత్తను తీసుకెళ్లినందుకు డబ్బులు కూడా ఇస్తారా?’ అని ఆశ్చర్యపోకండి. అక్షరాలా నిజం. ‘బిన్టిక్స్’ అనే సామాజిక స్టార్టప్కు వచ్చిన ‘చెత్త’ ఐడియా.. కాదుకాదు ‘కొత్త ఐడియా’ ఇది! అలా తీసుకెళ్లిన చెత్తను రీసైకిల్ చేస్తుంది. పర్యావరణ హితమైన ఈ ఆలోచన ఉదిత్, జయ నారాయణ్, రోషన్ అనే పరిశోధకుల అంతర్మథన ఫలితమే.
మీరూ చేరవచ్చు?
ఈ స్టార్టప్ ద్వారా చెత్తను ఇవ్వాలనుకుంటే ముందుగా బిన్టిక్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సభ్యత్వం తీసుకున్న తర్వాత చందాదారులకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ధ్రువీకరించిన చెత్త సంచులను అందజేస్తారు. వెంటనే, బిన్టిక్స్ ఉద్యోగులు వాహనాల్లో వచ్చి చెత్తను సేకరిస్తారు. వాళ్లు ఇచ్చే బ్యాగులకు ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాని ఆధారంగా ఆ సంచి ఎవరి ఇంటినుంచి వచ్చింది, ఎన్ని కేజీల బరువుంది, ఎంత మొత్తం చెల్లించాలనేది తెలుస్తుంది. ఈ బ్యాగ్లు బిన్టిక్స్ ఫ్యాక్టరీకి చేరగానే వాటి బరువు ఆధారంగా చందాదారుడి ఈ-వాలెట్లో డబ్బు జమ అవుతుంది. మిగతా వ్యాపారాలతో పోలిస్తే, వ్యర్థాల నిర్వహణ లాభదాయకం కాకపోయినా పర్యావరణానికి ఎంతోకొంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ సేవలను కొనసాగిస్తున్నామని చెబుతారు నిర్వాహకులు. కిలో చెత్తకు, దాని నాణ్యతను బట్టి రెండు నుంచి ఎనిమిది రూపాయల వరకూ చెల్లిస్తారు.
250 మెట్రిక్ టన్నుల చెత్త!
బిన్టిక్స్కు బెంగళూరు, హైదరాబాద్లలో వేలాది మంది ‘చెత్త’ చందాదారులున్నారు. వీరినుంచి సేకరించిన వ్యర్థాలను రీసైకిల్ చేసి, వేరే అవసరాలకు ఉపయోగిస్తుంటారు. బిన్టిక్స్ ఇప్పటివరకు 80వేల గడపలకు వెళ్లి చెత్తను సేకరిస్తుంది. హైదరాబాద్లోనే దాదాపు 7వేల మంది పేరు నమోదు చేసుకొన్నారు. నెలకు 16 టన్నుల చెత్తను రీసైకిల్ చేస్తున్నారు. వ్యర్థ పదార్థాలను వృథాగా మురగబెట్టడం కంటే మళ్లీ ఉపయోగించాలనేది వీరి ఆలోచన. చెన్నై, ముంబై, కోల్
కతాలలోనూ బిన్టెక్స్ సేవలు ప్రారంభమయ్యాయి. 2022 చివరి నాటికి 40 నగరాలకు విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
పెద్దఉద్యోగాలు వదిలి..
బిన్టిక్స్ వ్యవస్థాపకులు ముగ్గురివీ రీసెర్చ్ మూలాలే. ఉదిత్పై చదువులకోసమే యూఎస్ వెళ్లాడు.
హ్యూస్టన్ వర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ చేసి, ఇంటెల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశాడు. మొహాలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి డిగ్రీ చేశాడు రోషన్. మూడో వ్యవస్థాపకుడు జయనారాయణ్ మొహాలి క్యాంపస్లో ఇంకా పీహెచ్డీ చేస్తున్నాడు. ఓ సామాజిక వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ముగ్గురూ బిన్టిక్స్ను స్థాపించారు. ఇండ్లలో ఉత్పత్తయ్యే చెత్త/వ్యర్థాలకు రీసైక్లింగ్ సామర్థ్యం ఎక్కువని గ్రహించి చెత్త సేకరణలో బిజీ అయ్యారు.