‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.
ఎన్నీలలో కూసొని ఎక్కెక్కి ఏడ్సుకుంట ఆ సమాధులను తడుముతున్నడు. ఇలా ఎన్నాళ్లని ఏడుస్తూ బతకడం! నిజానికి ఆ పన్నెండేండ్ల పిలగానికి భూమ్మీద ఉండాలనే లేదు. కానీ, సావుకు చేతులు సాచి ఏడ్వడం శాతగానితనం కిందనే లెక్కకదా!
‘..అయితే ఎదురీదైనా బతకాలి. లేదంటే వరద కొట్టుడుకు మునకలేస్తూనైనా పోవాలి. సస్తూ బతకడం, బతుకుతూ సావడం చేసుకుంట, దానికింకా ‘బతుకు’ అని పేరు పెట్టుడెందుకు?! ఉన్నచోటు నచ్చని చేపపిల్ల కలగన్న చోటును చేరేదాకా ముందుకు కదులుతూనే ఉంటది. బాధల్లో బందీ అయిన మనిషి జిందగీని, సుఖాలను తాకట్టుపెట్టి ఇడిపించుకోవాలి. కష్టాలు నిన్నిష్టపడి కోలాటమాడుతుంటే కూడా, నువ్వు కొసదాకా ఓపిక పట్టాలి. పుట్టినోడల్లా సావాల్సిందే! కానీ, సచ్చేలోపు ఈ భూమ్మీద నీ గెలుపు ముద్రలు పడాలి. అవి చెరిగిపోనివి కావాలి. బతుకంటే కథగా మిగలడం. ఇది గుర్తుంచుకో కొడుకా!’
తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అంత దుఃఖంలోనూ నవ్వుకున్నాడు తను. కొండంత ధైర్యం గుండెల నిండా నిండిపోయింది. మనిషికి నిజమైన ధనమూ, ఈ బండికి ఇంధనమూ.. ధైర్యమే! అది అనుభవించిన వారికే అర్థమవుతుంది.
* * *
“ఎంకటికి బాకీ పడనోళ్లు ఎవరుంటార్రా భాస్కరా? అందరం అతని బాకీలో ఉన్నోళ్లమే! నిజానికి ఊరే ఆయనకు బాకీ పడిపోయింది”..
కొడుకుతో ఎన్నడూ లేనంత విచారంగా మాట్లాడుతున్నాడు రాములు.
‘చిన్నప్పటి నుంచీ చూస్తూనే పెరిగిన కదా! ఎంకటి మామను. మీ ఇద్దరీ స్నేహమూ, అంతకుమించిన అనుబంధమూ నాకు తెలియందా నాన్నా!’.. మనసులో అనుకున్నాడు భాస్కర్.
“భాస్కరా! నువ్వు ఎలాగైనా కోడలును తీసుకురావాల్సిందే! నువ్వేం చెప్తవో ఏమో గానీ.. కోడలు మాత్రం వచ్చి తీరాలి!”..
ఈ మాటలు వింటూనే అదిరిపడ్డాడు భాస్కర్.
“నాన్నా.. సుమతి సంగతి నీకు తెల్సిందే కదా! ఆమెను ఒప్పించడం నావల్ల కాదు. అంతగా కావాలంటే నీతో రెండ్రోజులు ఉండి వెళ్తాలే!” అనునయిస్తూ అన్నాడు భాస్కర్.
“..అయితే నువ్వు కూడా రానక్కర్లేదు!”.
“అదికాదు నాన్నా!”..
“..ఇది నా చివరి కోరికనుకో!” అంటూ ఫోన్ పెట్టేశాడు రాములు.
‘ఎంకటి మామ చనిపోతే నన్ను రమ్మనడంలో ఒక అర్థముంది. కానీ, సుమతిని తప్పనిసరి రమ్మనడం ఏంటి? ఎంకటి మామ చనిపోయాడట. నాన్న ఫోన్ చేసి మనిద్దర్నీ రమ్మన్నాడని చెప్పగానే, ఉన్నపళంగా వెంట బయల్దేరడానికి ఆమె మామూలు ఇల్లాలు కాదు.. సుమతి. ఈ భూమ్మీద ఉన్నంత వైవిధ్యమూ, వైరుధ్యమూ, వైశిష్ట్యమూ.. అన్నీ ఆమెలోనే నిబిడీకృతమై ఉన్నట్లు అనిపిస్తుంది. సుమతి ప్రాక్టికాలిటీని భరించడం చాలా కష్టం. కొన్ని విషయాల్లో కఠినంగా ఉంటుంది. ఎదుటివారి అభిప్రాయాలను చాదస్తంగానో, తెలివి తక్కువతనంగానో తీసిపారేయడంలో ఆమెకు
ఆమే సాటి. మేనమామ కూతురే అయినా.. మా కుటుంబంలో తనింకా కలిసిపోయినట్లు అనిపించదు. అదేంటో గానీ మా నాన్న మాత్రం ఆమెను చిన్నమాట కూడా అనడు. ఆమె తల బిరుసుతనం పొగరనిపిస్తుంది. ఆ వెంటనే తెలియనితనమని తేలిపోతుంది. పల్లెలన్నా, మట్టిమనుషులన్నా.. ఆమెకు మొదట్నుంచీ చులకన భావనే! అంత గొప్ప డాక్టర్గా పేరు సంపాదించుకుంది గానీ, మట్టి మనుషులను దగ్గరికి రానీయదు. అందులో ఎంకటి మామకు మినహాయింపు అస్సలు లేదు. ఆమెకు నచ్చని వ్యక్తుల్లో ఎంకటి మామ ముందు వరుసలో ఉంటాడు. ముతక బట్టలు వేసుకుని, చేతుల నిండా కాయలతో, ఎడమ కాలికి బేడీ వేసుకొని ఎంకటి మామ ఎదురుపడితే చాలు.. సుమతికి కోపం అదుపు తప్పుతుంది. వయసులో పెద్దాయన అనికూడా చూడకుండా ఎలా పడితే అలా మాటలు అనేస్తుంది. అలాంటి వ్యక్తి చివరి చూపునకు ఆమె వస్తుందని ఆశించడం ఆత్మవంచనే అవుతుంది!’..
భాస్కర్ అంతర్మథనంలో మునిగిపోయాడు.
* * *
“మీరెళ్లిరండి!” అన్నది. ఆ విషయం అసలు తనకు అనవసరం అయినట్లు.
“సుమతీ!”.. భాస్కర్ ఏదో చెప్పబోయాడు.
చురుక్కున తలెత్తి చూసింది.. ‘చెబితే అర్థం కాదా!?’ అనే తీక్షణతా భావానికి జోడీగా తిరస్కరణ బాణం కూడా విసిరింది. చేసేదేమీ లేక తండ్రికి ఫోన్ చేశాడు భాస్కర్.
రెండు నిమిషాలయ్యాక సుమతి ఫోన్ మోగింది.
“..అమ్మా! ఇప్పటిదాకా నోరు తెరిచి నిన్నేమీ అడగలేదు నేను. ఈ ఒక్కసారి ఈ ముసలోడి మాట కాదనకు. దీనికి బదులు నా చావుకు నువ్వు రాకున్నా ఫరవాలేదు”..
తండ్రి మాటలు భాస్కర్కు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎక్కడో గుండె కలుక్కుమంది. తట్టుకోలేక బాల్కనీలో నిల్చుండిపోయాడు.
కొంతసేపయ్యాక..
“వెళ్దాం పదండి!” అంటూ భాస్కర్ వెనకాల సుమతి గొంతు.
* * *
“..నేనెలా తలకొరివి పెడతాను మామయ్యా!? ఎంకటికి నాకు.. ఐమీన్ మనకు ఏ రిలేషన్ ఉందని? నా కన్న తల్లిదండ్రులు ఉండగా ఆ అనాథ శవానికి నాతో అంత్యక్రియలు చేయించడంలో మీ ఉద్దేశం ఏమిటి? మీ మధ్య స్నేహం ఉంటే మాత్రం.. నన్ను ఇన్వాల్వ్ చేయడం, దానికో రిలేషన్ క్రియేట్ చేయడం మాత్రం కరెక్టు కాదు” అంటూ సుమతి అసహనంగా రాములు వైపు చూసింది.
సుమతి మాటలు మౌనంగానే వింటున్నాడు రాములు.
తన ఆలోచనల్లోంచి బయటపడి దీర్ఘంగా నిట్టూర్చి.. సుమతి వైపు నింపాదిగా చూశాడు.
“నీకెట్లా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా! చెప్పినా నువ్వది జీర్ణించుకోలేవు. నీ పరిస్థితి నేనర్థం చేసుకోగలను”.. నెమ్మదిగా అన్నాడు రాములు.
“మీరంతగా బాధ పడేసరికి రావాల్సి వచ్చింది. ఇలా మీ పెద్దరికాన్ని అడ్డుపెట్టుకొని పిచ్చి పనులు చేయిస్తారనుకుంటే.. మీ మీదున్న గౌరవం తగ్గుతుంది”..
సుమతి మాటలు వాడిగా, వేడిగా గుచ్చుకునేలా!
“మిత్రద్రోహం చేస్తూ ఇచ్చిన మాట తప్పుతున్నా.. అమ్మా! ఇక చెప్పక తప్పదు. నువ్వు.. నువ్వు..” అంటూ ఆగాడు రాములు.
సుమతి, భాస్కర్.. రాములు వైపే చూస్తున్నారు.
“నువ్వు.. ఎంకటి కన్న కూతురువు!” గద్గద స్వరంతో.. రాములు ఇన్నాళ్లూ దాచిన రహస్యం చెప్పాడు.
ఆ మాటలు వింటూనే.. కళ్లు బైర్లు కమ్మి తూలిపడబోయారు ఆ భార్యాభర్తలు.
* * *
డబ్బు అయిదేండ్ల కిందటి ముచ్చట.
రజాకార్ల జమానాలో సంగంలో కల్సిండు మోహన్ దొర. నాలుగూర్లకు పెద్దొరగా హడల్ సాగించుకునే నరోత్తం దొరకు ఇది మింగుడు పడలేదు. పెద్ద కొడుకు జనంకోసం నిలబడుతుండు అంటే.. ఇగ దొరతనానికి డొల్లవడ్డట్టే! పెద్ద కొడుకు మీద ఆశలొదిలేసుకుని మిగిలిన ఇద్దరు కొడుకులను ముందట నిలవెట్టిండు.
నాలుగేండ్లు గిర్రున తిరిగిపోయినయ్. భూమ్మీద ఉన్నడో లేడో అనుకుంటున్న సమయానికి ఊళ్లోకి అడుగువెట్టిండు మోహన్ దొర. వెంట ఓ అమ్మాయి. ఆమె చంకలో ఓ పిలగాడు. మొదట్నుంచీ ఆదర్శభావాలు గల మోహన్ దొర, సంగంలో సభ్యురాలైన చంద్రకళను ఆదర్శ వివాహం చేసుకున్నడు. నరోత్తం దొర వారిని ఇంట్లోకే రానీయలేదు. తండ్రికి దూరమైన మోహన్ దొరకు ఊరి జనాలు దగ్గరయ్యారు.
ఇలాగైతే కొడుకు దారికి రాడని ఆస్తిలో వాటా ఇవ్వనన్నాడు నరోత్తం దొర. వాటా కావాలంటే దొరోళ్ల పిల్లను మళ్లా పెళ్లి చేసుకోవాలని ఎర వేశాడు. పెళ్లి వెనుక మతలబు అర్థం చేసుకున్న మోహన్ దొర.. తండ్రి మాటను ఎడమ చేత పక్కకు జరిపి, ఆస్తి వాటాకోసం కోర్టులో దావా వేశాడు. ఊరి జనంతో కలిసిమెలిసి తిరుగుతున్నడనీ, ఆస్తి కోసం కోర్టుకు పోయిండనీ నరోత్తం దొర, కొడుకును కంట్ల పెట్టుకొనేటోడు. కాలం కూడా పగబట్టింది.
భూమిలేని పేదోళ్లతో కలిసి పరంపోగును సాగులోకి తెచ్చారు మోహన్ దొర దంపతులు. ఎండనకా, వాననకా చెమట చిందించేటోళ్లు.. ఆ భార్యాభర్తలు. రాత్రిళ్లు పేదోళ్లకు చదువు చెప్పేవారు. ఇవన్నీ చూడలేని కాలం.. పొలం దగ్గర పని చేసుకుంటుంటే, పిడుగు రూపంలో వారిని మింగేసింది. అప్పటికి పన్నెండేండ్లకొచ్చిన వెంకటాద్రి.. ఏకాకి అయ్యిండు.
* * *
“ఎంకటి బతుకుల జరిగినవన్నీ నాకొక్కనికే తెలుసు. అందుకే, ఎవరికీ చెప్పొద్దని ఒట్టు పెట్టుకున్నడు. తన బతుకును అవమానంగా, జన్మను ఒక అపరాధంగా బాధ పడేటోడు. నెత్తురు కారుతున్న నిలువెత్తు గాయం లెక్క కనిపించేటోడు”..
రాములు కన్నీళ్లు తుడుచుకుంటూ చెబుతున్నాడు.
“ఇన్ని రోజుల్నుంచీ ఈ నిజాన్ని మింగలేక, కక్కలేక.. గరళాన్ని కంఠాన దాచిన శంకరుని బతుకైంది నాది. చెబితే మాట తప్పినవాడిగా, చెప్పకపోతే ధర్మం తప్పినవాడిగా.. ఇలా అంతరాత్మ ముందు ముద్దాయిగా నిలబడని రోజులేదు. ఇన్ని బాధలు పడేకంటే.. ముందు నేనే చచ్చిపోతే బాగుండని ఎన్నిసార్లు ఆ దేవునికి మొక్కుకున్ననో!” అంటూ ఆగిపోయాడు రాములు.
సగం దూరం నడిచాక.. మనదారి అది కాదని, మన గమ్యానికది చేర్చదని తెలిసినప్పుడు ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు సుమతికీ అలాగే ఉంది.
భాస్కర్.. అయోమయం, అనుమానం ఈ రెండిటి మధ్య ఇరుక్కుపోయాడు.
“అసలు నేనెవర్ని?”.. రాములు చేతులు పట్టుకొని అడిగింది సుమతి.
* * *
ముందుముందు ఆస్తి వాటాల్లో గొడవలెక్కడ వస్తాయోనని నరోత్తం దొర వెంకటాద్రిని వెంట తీసుకెళ్లిండు. కొడుకు కొడుకన్న కనికరం లేకుండా ఇంటి వారసుణ్ని ఇంటికి చిన్న పాలేరుగా మార్చేశిండు. పొట్టకు, కట్టుబట్టకు లోటు రాకుండా కట్టు బానిసత్వంలో వెట్టి చేసుకుంట.. కండలు కలికలి చేసుకొని మంచి పనిమంతుడు అయ్యిండు వెంకటాద్రి.
కాలం వెనుకముందు జరిగిందంతా వెళ్లగక్కింది. కోర్టు దావాలో మోహన్ దొర గెలిచిండు. వారసునిగా వెంకటాద్రి నిలిచిండు. వందల ఎకరాల భూమి.. చేను, చెలక, తోటలు..! అదంతా కాదని వాళ్ల నాయిన ఎవుసం చేసిన పరంపోగు, దాని పక్కనున్న పదెకరాలు తీసుకున్నడు. నరోత్తం దొర మొకం శిన్నగైపోయింది.
పెళ్లీడుకొచ్చిన వెంకటాద్రికి పిల్లను చూసేవాళ్లు లేరు. పిల్లను ఇచ్చేవాళ్లూ లేరు. ఆ ఇంటికి కోడలు వరుసైన నీరజ.. వెంకటాద్రిని ఇష్టపడ్డది. ఆడపిల్ల అయ్యుండి ఆశగా మనసును గొంతులోకి ఒలికించి అడిగింది.
తరతరాలుగా అంతరాలను లెక్కలోకి తీసుకొనే ఈ లోకం.. మనసు ఊసులను పట్టించుకుంటదా? అందుకే నా అనేవాళ్లు లేని వెంకటాద్రి పెళ్లి ముచ్చట దూరం పెట్టిండు. పట్టుపట్టిన నీరజ.. వెంకటాద్రి చెయ్యి పట్టేదాకా వదిలిపెట్టలేదు. దానికోసం కన్నోళ్లనే కాదనుకున్నది. అదృష్టం అమాంతం పూలవాన కురిపించినట్టు సంబురపడ్డడు వెంకటాద్రి.
సంవత్సరం తిరిగేసరికల్లా కలల పంటగా ఓ పాప ఒడిలోకి చేరింది. బతుకును మొలకెత్తించిన ఆ పసిబిడ్డకు సుమతి.. అని పేరు పెట్టుకున్నరు. అంతలోనే అంతా తలకిందులైంది. దురదృష్టం ముందు అదృష్టం చిన్నదైపోయింది. నెలల పాపనొదిలి, కోరి కట్టుకున్న భర్తనొదిలి హఠాత్తుగా తనువు చాలించింది నీరజ.
* * *
“జీవితం విసిరిన ఆ సవాళ్లకు మీ నాన్న దగ్గరే కాదు.. మరెవ్వరి దగ్గరా జవాబులు ఉండయ్! మా ఇద్దరి మధ్యనున్న స్నేహంతోనే పసిపిల్లగా ఉన్న నిన్ను మా పెద్ద బామ్మర్దికి సాదుకోనిచ్చిండు. నువ్వే ఎంకటి బిడ్డవు. ఎంకటే నీ కన్నతండ్రని నాకొక్కనికే తెలుసు. నిన్ను సాదుకున్న తండ్రికి కూడా నువ్వెవరి బిడ్డవో ఇప్పటికీ తెల్వది. ఈ ఊళ్లో ఎంకటిని సాయం అడగనోళ్లు లేరు. అతని సాయం పొందనోళ్లూ లేరు. అంతెందుకు భాస్కర్ పెద్ద సదువులకు పైసలు సాయం చేసింది మీ నాన్నే! పేరుకే మా బామ్మర్ది నీకు తండ్రి.. నీకైన ఖర్చులన్నీ నేనే పెట్టెటోణ్ని. అవన్నీ ఎంకటి పైసలే!”..
సముద్ర కెరటమొకటి ముఖాన్ని తాకినంతగా తల్లడిల్లిపోయింది సుమతి. ఇదంతా నిజమేనా అన్నట్లు, నమ్మలేనట్లు చూస్తున్నాడు భాస్కర్.
“మనిషి చూస్తే మోటుగా కనిపించేటోడు గానీ, ఎంకటి మనసెంత తేటదో నాకు తెలుసు. రంది నుంచి తప్పించుకోవడానికి పనికి మించిన మందులేదు. అది మీ నాన్నకు బాగా తెలుసు. ‘ఎంకటి బావా! నీ కష్టాలకు లెక్క లేకపాయె!’ అంటే ఏమనేవాడో తెలుసా!?.. ‘బళ్లె బడి పంతులు గట్టోనికి గొట్టు లెక్కలేస్తడు. మోస్తడనుకున్న మొండోనికి దేవుడు బరువులు ఎక్కువ ఇస్తడు. అదంతే రాములు బావా!’ అంటూ ముద్దుగా నవ్వేటోడు. గట్టువాగు చుట్టూ మొలకలు నాటి.. నాటి.. గుట్టనంతా పెద్ద జంగల్ లెక్క చేసిండు. ఊళ్లె బడి ఉండాలని పట్టుబట్టి కట్టించిండు. ఎనుకటెప్పుడో కూలిపోయిన శివాలయాన్ని బాగు చేయించిండు. గొడ్డు కట్టం చేసుకుంట సంపాదించెటోడు. వచ్చిన పైసలన్నీ మంచి పనులకు కర్సు పెట్టేటోడు. అష్టకష్టాలు వెట్టిన నరోత్తం దొర తొంటిరిగి మంచాన వడితే, మనసులో కల్మషం లేని మనిషాయె ఎంకటి.. ఎత్తిపోసి ఒంటి పుండ్లన్నీ కడిగిండు. ఈ లోకం పాడుగాను. ముంగట ముచ్చట వెట్టి ఎనుకాల ఎక్కిరించేది ఎంకటిని. నేనెప్పుడన్నా రేషానికి వోతె.. ‘రాములు బావా! నున్నగున్న రాయిమీద దుమ్ము నిలువది. నల్లగున్న వరుని మీది మరక ఆనది! ఎవలెట్ల అనుకుంటె.. గట్లనే అనుకోనియ్యి. కుడి ఎడమలను అటీటు చేసి అద్దం జూపంగనే.. మన అంతరాత్మ నమ్ముతదా ఏంది?!’ అనేటోడు”.. ఏండ్ల నుంచి జమైన బాయిల పూడిక తీసినట్లు రాములు మనసు అల్కగయ్యింది.
సుమతినే చూస్తున్నాడు భాస్కర్.
‘ఎన్నిసార్లు చీదరించుకుందో ఆమె. ముఖమ్మీదే సూటిపోటి మాటలన్నా.. ఏమాత్రం చిన్నబుచ్చుకునేటోడు కాదు ఎంకటి మామ! పండుగకో, ఫంక్షన్కో ఊళ్లోకి మేమొస్తే చాలు.. మా ఇంటి చుట్టే తిరిగెటోడు పాపం! కళ్ల ముందర కన్నబిడ్డ పరాయిదానిలా పట్టించుకోకున్నా.. బయటపడకుండా ఎట్లా తట్టుకున్నడో!? పిల్లల్ని ముట్టుకోవద్దని గద్దరించి పెట్టినప్పుడు చిన్నబోయినట్లు ముఖం పెట్టిన ఎంకటి మామ ఏమనుకున్నడో?!’ భాస్కర్ అపరాధ భావంతో తల పట్టుకున్నాడు.
ఎవల నుంచి ఏదీ ఆశించని ఎంకటి ఈ లోకానికి మాత్రం ఇచ్చుకుంటనే బతికిండు. మార్చుడు, ఏమార్చుడు ఈ మనుషులకు కొత్తకాదు కదా! తండ్రి కులం కొడుక్కు చెందనీయకుండా చేసి.. వెంకటాద్రిని ఎంకటిగా మార్చారు. తల్లి కులం ఏంటిదో తెల్వనందుకు ఇదే మనుషులు ఎంకటిని ‘బోగం ఎంకటి’ని చేశారు.
‘నాలాంటి వాడి బిడ్డనని నలుగురికి తెలిస్తే.. నా బిడ్డ నారాజ్ అయితది రాములు బావా! ఈ ఒక్క ముచ్చట మాత్రం మనతోనే మట్టిల కల్వనీ..’ అంటూ కాళ్లు మొక్కబోతున్న ఎంకటి గుర్తొచ్చి అప్రయత్నంగా కాళ్లు వెనక్కి జరుపుకొన్నాడు రాములు.
కానీ, ఇప్పుడు సుమతి..
“మామయ్యా! ఆ దేవునికి ఒక్కపూట తిండి పెట్టలేని దౌర్భాగ్యురాలిని..” అంటూ రాములు కాళ్లు చుట్టేసి గుండెలవిసేలా ఏడుస్తున్నది.
* * *
ఎంకటి మరణాన్ని తట్టుకోలేక నింగి మనసుక్కూడా మబ్బు పట్టిందేమోనన్నట్లు ఒక్కసారిగా వాతావరణం మారింది. కదిలిస్తే కన్నీరుగా కురుస్తాయేమోనన్నంత బరువెక్కాయి మేఘాలు. అక్కడి దృశ్యం చూస్తే ఎవరో రాజకీయ నాయకుడో, గొప్ప పేరుమోసిన వ్యక్తో చనిపోయినట్లు అనిపిస్తున్నది. అనాథలా పెరిగి, అనాథలా బతికిన వ్యక్తంటే ఎవ్వరూ నమ్మరు.
“డెడ్బాడీ మెడికల్ కాలేజీకి డొనేట్ అయ్యింది. ఫార్మాలిటీస్ పూర్తయి చాలా సేపైంది. ఇప్పుడు ముట్టుకోవడం కుదరదు. ప్లీజ్ అర్థం చేసుకోండి!”..
శవం దగ్గరికి వెళ్లబోతున్న ముగ్గుర్నీ ఆపారు వైద్యులు. ‘అంటే!?’.. కొన్ని క్షణాలకు అర్థమైంది సుమతికి. నేత్ర దానమో, అవయవ దానమో కాకుండా.. ఎంకటి ఏకంగా తన పార్థివదేహాన్ని దానం చేస్తానని బతికున్నప్పుడే బాండ్ రాసిచ్చాడన్న మాట. సుమతి ముఖం మీద మబ్బులు ముసురుకున్నాయి. ‘పుట్టుడు పుట్టుడే ఏడ్సుకుంట పుడుతం! పోయేటప్పుడు కూడా ఏడ్సుకుంట పోతరా బావా!? మనం నవ్వుకుంట బోతుంటే.. లోకం ఏడ్సుకుంట ఎనుక రావాలె! ఔ.. బావా! నేను వోతె నువ్వు తప్ప నాకు ఏడ్చెటోళ్లు ఎవలున్నరు ఇంక!’.. అని వారం రోజుల కింద పరాచికాలాడిన ఎంకటి మాటలు గుర్తుకొచ్చి రాములు దీనంగా ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న తండ్రిని పొదివి పట్టుకున్న భాస్కర్ కళ్లనిండా నీళ్లు.
“ఎవ్వరికీ ఏ ఇబ్బందీ కలిగించుడు ఇష్టపడని ఎంకటి, మారాజు లెక్క తనదారి తాను చూసుకున్నడు”..
వెనక నుంచి ఎవరో అన్న మాటలు అవి. సుమతి గుండెను ఈటెల్లా పొడిచాయి. అప్పుడే ఎవరో కొన్ని పేపర్లను ఆమె చేతిలో పెట్టారు. అవి ఆస్తి వీలునామా పత్రాలు.
“ఎందుకు నాన్నా! ఇంత పెద్ద శిక్ష వేశావ్! ఒక్కసారి మాట్లాడు నాన్నా!” అంటూ ఆకాశం వైపు చేతులు చాచి, గట్టిగా అరిచింది సుమతి. చెంపలపై జారుతున్న కన్నీళ్లను వర్షం తుడిచేస్తుంటే.. అభిషిక్తమవుతున్నది సుమతి.
చిప్పబత్తుల శ్రీనివాస్ స్వస్థలం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్. ‘సుగంధ శ్రీనివాస్’ పేరుతో రచనలు చేస్తున్నారు. డబుల్ పీజీ (బాటనీ, హిస్టరీ)తోపాటు టీచర్ ట్రైనింగ్ డిప్లొమా చేశారు. 2002 నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు 23 కథలు, డజనుకు పైగా కవితలు, వ్యక్తిత్వ వికాస వ్యాసాలు రాశారు. 2000 సంవత్సరంలో మొదటి కవిత, 2003లో మొదటి కథ (మళ్లీ మళ్లీ పూసే పూలు) ఆంధ్రభూమి వీక్లీలో ప్రచురితమయ్యాయి. 2004లో ప్రియదత్త వీక్లీ నిర్వహించిన పోటీలో ‘సప్త వర్ణాల ఆశ’.. రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకున్నది. 2006లో ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన ఉగాది కథల పోటీలో ‘మా మంచి నాన్న’.. ప్రోత్సాహక బహుమతి అందుకున్నది. 14 ఏళ్ల విరామం తర్వాత రాసిన ‘గంగిరెద్దు – గానుగెద్దు’ కథ.. గొప్ప గొప్ప రచయితల ప్రశంసలు అందుకున్నది.
-సుగంధ శ్రీనివాస్
77300 65637