చారిత్రక కాల్పనిక నవల
జరిగిన కథ :
బందీలుగా అనుమకొండకు పయనమయ్యారు ద్వీపరాజ్య రాకుమార్తెలు నారాంబ, పేరాంబ. వారికి తెలియకుండానే తమ్ముడు జాయప కూడా ఆ పల్లకిలో ఎక్కాడు. చౌండ సేనాని వెంట అనుమకొండలోకి ప్రవేశించాడు. అయితే, ‘చక్రవర్తుల వారికి నారమ, పేరమ సంగతి ఎలా చెప్పాలి? జాయపను ఏమి చెయ్యాలి?’.. అనే ఆలోచనలతో ఆ రాత్రి చౌండకు నిద్ర పట్టలేదు. ఉదయాన్నే కాకతీయ సామ్రాజ్య సకల సేనాధిపతి రుద్ర సేనాని ప్రాసాదానికి పయనమయ్యాడు. ద్వీపరాజ్య రాకుమార్తెలు నారమ, పేరమను బందీలుగా తీసుకువచ్చాననీ, ఈ విషయాన్ని చక్రవర్తికి ఎలా చెప్పాలో తెలియడం లేదంటూ రుద్ర సేనానిని సలహా అడిగాడు చౌండ. ఆ తర్వాత ఇద్దరు మహావీరులు ఒకే రథంలో రాచనగరు చేరుకున్నారు.
సఅక్కడున్న జనవాహినిని చూసి ఆశ్చర్యపోయాడు చౌండ. రాజధానిలో ఉన్న సమస్త అధికారగణం, మహా ప్రధాని, ప్రధానులు, ప్రెగ్గడలు, అమాత్యులు, మంత్రులు, సైన్యాధ్యక్షులు, లెంకలు, సేనానులు, దండనాయకులు, అధ్యక్షులు, బాహత్తర నియోగాధిపతితో మొత్తం డబ్భు రెండు నియోగాల భట్టారకులు, శ్రీవాకిలి అంగరక్షకుడు, శూన్య పాలకుడు, గజసాహిణి, అశ్వసాహిణి, రాజ్యభండారి, రాజపత్ర రక్షకుడు, సంధివిగ్రహి, తంత్రిపాలుడు, రాజగురువులు, కవులు, పండితులు.. ఒకరేమిటి.. చక్రవర్తి గణపతిదేవుడు, పట్టపురాణి సోమలదేవి తప్ప సమస్త అత్యున్నత ప్రముఖులంతా రాచనగరు ప్రవేశద్వారం వద్దే నిలబడి ఉన్నారు. ఇంతటి గొప్పవిజయం తెచ్చి, కాకతీయ సామ్రాజ్య సమున్నత స్థానాన్ని దేశానికి చాటిన ఆ మహాసేనానికి ఆత్మీయస్వాగతం పలికారు. వందిమాగధులను మించి అందరూ జయజయ ధ్వానాలతో అతణ్ని సగౌరవంగా లోపలికి తోడ్కొని వెళ్లారు.
కాకతీయ సామ్రాజ్యలక్ష్మీ పుత్రుడు, మహాచక్రవరి, మహామండలేశ్వరుడు, రాయగజకేసరి శ్రీశ్రీశ్రీ గణపతిదేవుడు ఎదురొచ్చి, చేతులుచాచి చౌండ సేనానిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఆయన ఉత్తేజంతో పొంగిపోతున్నాడు. విజయోత్సాహంతో పులకించి పోతున్నాడు.
గణపతిదేవుడు ఇరవై సంవత్సరాల నవ యవ్వనుడు. ఆజానుబాహువు, అందమైనవాడు.. ముఖంపై చిరునవ్వుతో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవాడు. తేజరిల్లే చురుకు కదలికలతో సభామండపంలో పరివేష్టితులై ఉన్న మహా మంత్రాంగవేత్తలను కూడా మరింత సరస సల్లాపాలలో ముంచి, నవ్వుల కేరింతలమధ్య పనిచేయించగల చతురుడు. సింహాసనానికి వచ్చిన రెండేళ్లకే కార్యఖడ్గ నిపుణుడిగా పేరు స్థిరపరచుకున్నవాడు.
అంతటి సార్వభౌముడు తన తొలి విజయానికి ఎంతగా మురిసిపోతున్నాడో ఆ సభా సన్నివేశం సూచిస్తున్నది. వందిమాగధులు నిశ్శబ్దులయ్యారు. పరిచారికలు కళ్లప్పగించి చూస్తున్నారు. అంతా తానై తన సంతోషాన్ని ఏమాత్రం ఆపుకోకుండా, చక్రవర్తిత్వం కింద తన కుర్రతనాన్ని దాచుకోకుండా చెంగుచెంగున దూకుతూ.. ఎవ్వరూ ఊహించనంత ఉత్సాహ సంభ్రమాల మధ్య విజయ సైన్యాధ్యక్షుడైన మల్యాల చౌండను తోడ్కొని.. తన సింహాసనం పక్కన ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. పుష్పమాలను అలంకరించి, అతని తలపై స్వయంగా పూలవర్షం కురిపించి తన ఆనందాన్ని ప్రకటించాడు గణపతిదేవుడు. అనంతరం పురోహితుల వేదోచ్చరణల మధ్య మల్యాల చౌండకు ‘ద్వీపలుంటకుడు, దివి చూరకారుడు’ అనే బిరుదులు ప్రకటించాడు.
అనంతరం శూన్యపాలకుడు, సేనానులు, సేనాపతులు, గజసాహిణి, అశ్వసాహిణి, అధ్యక్షులు, సమాహర్తలు.. యుద్ధ విజయంలో భాగమైన అందరినీ పేరుపేరునా సత్కరించాడు. సభ అనంతరం రాచనగరులోనే చక్రవర్తి స్వయంగా విందు ఏర్పాటుచేశాడు. ఇంత జరుగుతున్నా.. చౌండ మాత్రం పూర్తిగా లీనమై సంతోషించడం లేదు.
పేరమ, నారమ.. తర్వాత జాయప, అతని మనోఫలకంపై కదులుతూనే ఉన్నారు.
‘చక్రవర్తికి ఎలా తెలపాలి?’..
ఆ అవకాశం రానే వచ్చింది. ఆ సాయంకాలం మంత్రాంగ నిపుణుల ఆత్మీయ మధువు కార్యక్రమం జరిగింది. కాదంబ మధువు, మాధవం, ఐక్షువం, క్షీరంబు మధువు, ఆసవం, వార్షవం, రతిఫలం మొదలైన భిన్నభిన్న మధువులు ఉన్నా.. వాటికన్నా యుద్ధ విజయమే వారికి ఎక్కువగా మత్తు రేపుతున్నది. అందుకే.. యుద్ధ వీరులంతా ఆ యుద్ధ సన్నివేశాలను ముచ్చటించుకుంటున్నారు. అప్పుడు చెప్పాడు చౌండ..
“చక్రవర్తికి విన్నవించకుండా నేనొక దుస్సాహస నిర్ణయం తీసుకున్నాను ప్రభూ!”..
చక్రవర్తి ఆనంద మాధుర్యంలో ఉన్నాడు. క్షణకాలం ఆలోచించకుండా జవాబులు ఇస్తున్నాడు..
“యుద్ధ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ సముచితమే. ఎందుకంటే మీరు విజయలక్ష్మిని తెచ్చారు. సామ్రాజ్య వైశాల్యాన్ని పెంచారు. మన కాకతీయ పౌరుషానికే ప్రశ్నగా.. సాధించలేని వ్యథగా మిగిలిన వెలనాడును సాధించారు. మీరు దుస్సాహసం చేయడం ఏమిటి? మేము అంగీకరించం..” అన్నాడు కాస్త మధు మత్త చిత్తంతో.
కొనసాగించమంటూ కన్నుగీటాడు రుద్రసేనాని.
“అదే.. ఓడిపోయిన దివిరాజు పినచోడుని..”
చెబుతున్న చౌండను ఆపి..
“వారు ఓడిపోయిన రాజు కాదు. మన సామంతులు. వెలనాడు నేడు కాకతీయ సామ్రాజ్యంలో భాగం. దానికి మన పాలకుడు శ్రీశ్రీశ్రీ పినచోడుడు. అది మర్చిపోకండి!” అన్నాడు చక్రవర్తి.. అరమోడ్పు కన్నులతో.
“క్షమించండి ప్రభూ! వారి అమ్మాయిలు నారమ, పేరమను నేను మా వెంట తీసుకువచ్చాను”.
మాట ముగించకముందే ఆయన పెద్దగా నవ్వి..
“భేష్.. నిజంగా ఇప్పుడు మిమ్మల్ని మళ్లీ సన్మానించాలి. మీ సన్మాన కార్యక్రమవేళ వారిని కూడా ఆహ్వానించడం మాకు మరీమరీ సంతోషం!” అంటూ చప్పట్లు కొట్టి.. అంతఃపుర కంచుకి శాక్తకాటయను పిలవమని ఆజ్ఞాపించాడు.
ఆయన పరుగు పరుగున వచ్చాడు.
“దివి రాజకుమార్తెలు మన రాజధానికి విచ్చేశారు. అంతఃపురంలో ప్రత్యేక భవంతి ఏర్పాటుచేసి, వారికి పూర్తి సామంత లాంఛనాలు జరిపించాలి. మహారాణివారికి కూడా మా నిర్ణయంగా తెలియజేయండి” అని చెప్పాడు.
చౌండ నిరుత్తరుడయ్యాడు. చక్రవర్తి తన ఆనంద సంతోషాలమధ్య తీసుకున్న నిర్ణయం.. మంచి వైపే పయనించినట్లు విజయసంకేతంగా బొటనవేలు చూపి అభినందించాడు రుద్రసేనాని.
అయినా చౌండలో ఆనందం లేదు.
‘జాయప సంగతి కూడా చెప్పేసి ఉంటే బాగుండేది కదా!?’ అని గింజుకులాడి పోయాడు లోలోపల.
మర్నాడు ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేచాడు జాయప. చాలారోజుల తర్వాత తలగడదీవిలో తమ సొంత రాజమందిరంలా ఉన్న భవంతిలో, అలాంటి శయన మందిరంలో నిద్రించిన ఆ చిన్నారికి.. ఇప్పుడు అలసట తీరినట్లు అనిపించింది. లేచి బయటికి వచ్చాడు.
విశాలమైన మందిరం. ఓ మూలగా ఏదో విద్యాభ్యాసం జరుగుతున్నట్లుగా కనిపించింది. అటు వెళ్లాడు.
మల్యాల చౌండ కుమార్తె పద్మాక్షి ఏదో పాఠ్యాంశం వల్లె వేస్తున్నది. గురువు చెబుతున్నాడు. అతనికి తాను అక్కలతో కలిసి చదువుకునే దృశ్యం గుర్తొచ్చింది. అక్కలు గుర్తొచ్చారు.
ఇక్కడంతా తనను బాగా అభిమానంగా చూస్తున్నారు.
సరే.. మరి అక్కలు ఎక్కడ ఉన్నట్లు? అక్కలను వీళ్లు ఎక్కడ దాచారు?
అక్కలను చంపేస్తారేమో!?
ఏమో.. కానీ చూస్తే అలా అనిపించడం లేదు. అంతా మంచిగానే చూస్తున్నారు.
అక్కలను కూడా మంచిగానే చూస్తున్నారేమో!?
‘ఎక్కడున్నట్లు?’.. కళ్లు చెరువులయ్యాయి. మెల్లగా తుడుచుకుని, అది మర్చిపోవడానికి అన్నట్లుగా.. అటూయిటూ చూశాడు.
‘చౌండ కొడుకు ఎక్కడ?’.. అక్కడ కనిపించలేదు. కదిలి మరోవైపు వెళ్లాడు. సాహిణంలో మల్లయుద్ధ శిక్షణ ప్రదేశంలా ఉంది. అక్కడున్నాడు చౌండ కుమారుడు కాటయ. బలిష్ఠులైన ఇద్దరు మల్లయోధులు వివరిస్తుండగా సాధన చేస్తున్నట్లున్నాడు.
జాయపను చూసి పలకరింపుగా నవ్వాడు కాటయ. బదులు నవ్వాడు జాయప.
అతనికి తన తండ్రి, పెదతండ్రి, పినతండ్రులు గుర్తొచ్చారు. ఇలాగే యుద్ధ ప్రవీణులతో తన తండ్రులు అభ్యాసం చేస్తుండేవారు.
తనకెంతో ఉత్సాహంగా ఉత్తేజంగా ఉండేదా అభ్యాస సమయం. మెల్లగా ఆలోచనల్లోకి వెళ్లాడు జాయప.
ఇప్పుడు వాళ్లంతా ఎలా ఉన్నారో!? తనను తలచుకుంటున్నారో.. లేదో!
ప్చ్.. తనే తప్పు చేశాడు. చెప్పాచెయ్యకుండా అక్కలు ఉన్న పల్లకి ఎక్కేశాడు. ఇప్పుడు అక్కలూ కనిపించడం లేదు. అమ్మానాన్నలూ దగ్గరలేరు. ఇది తమను ఓడించిన రాజ్యపు రాజధాని నగరమట. దీని పేరు.. ‘అనుమకొండ’ అట.
ఇక్కడంతా తనను బాగా అభిమానంగా చూస్తున్నారు. సరే.. మరి అక్కలు ఎక్కడ ఉన్నట్లు? అక్కలను వీళ్లు ఎక్కడ దాచారు? అక్కలను చంపేస్తారేమో!? ఏమో.. కానీ చూస్తే అలా అనిపించడం లేదు. అంతా మంచిగానే చూస్తున్నారు. అక్కలను కూడా మంచిగానే చూస్తున్నారేమో!? ఏమో.. అలా ఎందుకు అనుకోవాలి? చెరసాలలో పెట్టారేమో!? ఆ చెరసాలలను తానెప్పుడూ చూడలేదు కానీ, అవి ఏమీ బాగోవని తనకు తెలుసు. వీళ్లు బాగా చూస్తే.. ఆ రోజు అక్కలు పల్లకి ఎక్కే సమయంలో అమ్మ, పిన్నిగార్లు ఎందుకు అంతలా ఏడ్చారు? ఆ ఏడుపు చూసే తను అక్కలను రక్షించాలనే కదా పల్లకి ఎక్కేశాడు?! ఏమైనా సరే.. అక్కల ఆచూకీ తెలుసుకోవాలి. ఎలా?..
వెనుక ఏదో నీడ కదిలినట్లు అనిపించడంతో చటుక్కున వెనక్కి తిరిగాడు.
మైలమ.. మైలాంబిక!!
నిండైన విగ్రహం మైలమ. ముదురు బొమ్మంచుతో తెల్లని నురుగు రంగున్న పన్నెండు మూరల పట్టుచీర.. ఆమె అందాన్ని ఇనుమడింప జేస్తున్నది. బూడిదరంగు రవికె, నుదుట కస్తూరిబొట్టు, ముంజేతులకు రంగురంగుల గాజులు, వంకీలు, దండ కడియాలు, మెడలో మణిమయ హారాలు.. కొన్ని మెడకు బిగుతుగా, కొన్ని వక్షస్థలం వరకు, కొన్ని బొడ్డువరకూ వేలాడుతున్నాయి. నడుముకు రత్నఖచిత గజవడ్డాణం మెరుస్తుండగా.. పవిట అంచు అందులో దోపింది. మాట్లాడుతున్నప్పుడు చేతులకున్న గోరింటాకు రంగు.. ముక్కెరపై ప్రతిఫలిస్తున్నది.
దీర్ఘంగా ఆలోచిస్తూ జాయప వద్దకు మెల్లగా వచ్చిందామె. నడుస్తుంటే ఓ అందమైన దర్పం.. విరియాల వంశ ఆడబిడ్డ మైలమ. కాకతీయ తొలి మహారాజు మొదటి బేతరాజును సింహాసనాధిపతిని చేసి, కాకతీయ రాజ్యాన్ని నిలబెట్టిన విరియాలవారి వంశస్తురాలామె. మరో పేరెన్నికగన్న మల్యాలవారి ఇంటికోడలు. వీరవనిత. విదూషీమణి. చిత్రకారిణి. మంత్రాంగ నిపుణురాలు.
మొదటిసారి చూడగానే.. జాయప బాగా నచ్చాడు.
“జాయా! అలసట తీరిందా కుమారా?” అన్నదామె లాలనగా.
మాట్లాడలేనంత దిగులులో.. జాయప తల ఊపాడు.
ఆమె దగ్గరికి తీసుకుని..
“ఏమిటీ.. దిగులుగా ఉన్నావు?” అన్నది.
అతను గద్గదస్వరంతో..
“అక్కలు.. మా అక్కలు!”.. మరి చెప్పలేకపోయాడు.
ఆమె మరింత దగ్గరికి తీసుకుని..
“వారికి వచ్చిన కష్టం మరేమీ లేదు. మహాసేనానులు ఉదయాన్నే మీ అక్కల కోసం వెళ్లారు” అని చెప్పింది.
“ఇక్కడికి తీసుకొస్తారా పిన్నిగారూ!” అన్నాడు ఆశగా.
ఆమె ఆశ్చర్యపోయింది. అక్కల రక్షణ కోసం తమ్ముడు ఎంత ఆరాట పడుతున్నాడో ఆమెకు స్పష్టమైంది.
“చూద్దాం! వారు వచ్చాక తెలుస్తుంది కదా!? ఈలోగా నువ్వు ముఖ ప్రక్షాళన కానిచ్చి, కాస్త ఎంగిలి పడాలి. వెళ్లి కాలకృత్యాలు కానివ్వు నాయనా!” అందామె.
పరిచారికలు వచ్చి, చిన్నారి జాయపను బహిర్భూమి వైపు తీసుకెళ్లారు.
(సశేషం)
మత్తి భానుమూర్తి