‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
ఇంటి ముంగట ఆకిట్ల కూసొని ఎల్త బొంగులు నరుకుతున్నడు మేదరి దుర్గయ్య. లావుపాటి బద్దల్లెక్క నరికి, కట్టెల మోపోలె కడుతున్నడు. అర్వై ఏండ్లకు దగ్గర ఉంటడు గనీ, పనిల శాన శెల్తిగ ఉంటడు. ఆకిట్ల రాలిన యాప పండ్లను ఏరుకుంట ఎండకు ఏస్తున్నది దుర్గయ్య భార్య నర్సవ్వ. ఇంటి గోడకు ఆనుకొని కట్టె నాగలి, రొప్పు నాగలి నిలవెట్టి ఉన్నయి. ఇటు దిక్కు ఎడ్లబండి నిలవడి ఉన్నది. ఆ బండి కానికి రెండు ఎడ్లు కట్టేశి ఉన్నయి. కటకట బొంగులను నరుకుతున్న దుర్గయ్య..
“లచ్చిమీ.. ఇంత చాబొట్టు తీస్కరా!”
అని కేకేసిండు.
ఆ మాట ఇనంగనే యాపకాయలు
ఏరుతున్న నర్సవ్వ మనసు చివుక్కుమన్నది.
“తెస్తా ఉండు! సైసు జర” అన్నది.
భార్య నుంచి వచ్చిన సమాధానం ఇనంగనే.. కొడుకు చిత్తారి, కోడలు లచ్చిమి, మన్మడు, మన్మరాలు ఇల్లు ఇడ్శిపెట్టి, పట్నం బత్కవోయిర్రు అనే ముచ్చట యాదికచ్చింది దుర్గయ్యకు. మనసు మార్మానం వోయినట్టయ్యింది. కటకట కొడుతున్న కత్తిని ఆపేసి, నెత్తికి సుట్టుకున్న రుమాల్ల కెంచి సుట్ట దీసి అంటిచ్చుకున్నడు. గప్పగప్ప పొగ వీలుస్కుంట ఇడుస్తున్నడు. పట్నం వోయిన కొడుకు గురించి ఆలోచనల వడ్డడు.
దుర్గయ్యకు ఒక కొడుకు నలుగురు బిడ్డెలు. ఐదెకరాల ఎవుసం, బర్లు, గొర్లు మంచిగనే ఉండె. బిడ్డెలందరు డిగ్రీ దాంక సదువుకున్నరు గనీ, కొడుకు అడ్వ సోపతులు వట్టి.. పదిలనే ఫెయిలైండు. పిల్లలు ఉన్నరని.. ఇద్దరాలు మొగలు అటు ఎవుసం, ఇటు బర్లు, గొర్లను సూస్కునుడే గాదు.. కులవృత్తి అయిన మేదరి పని గూడ చేస్కుంట అచ్చిర్రు. నలుగురు బిడ్డెల లగ్గాలు జెయ్య.. కట్నం కింద ఒక్కొక్క బిడ్డెకు ఎక్ర ఎక్ర పొలం రాశిచ్చిండు. కొడుక్కు ఒక ఎక్ర, ఇంత ఇల్లు ఉంచిండు. అందర్కి పిల్లలు అయిర్రు. పండుగలకు, పబ్బాలకు బిడ్డెలు, అల్లుండ్లు, మన్మలు, మన్మరాండ్లు ఇంటికస్తే ఇల్లంత నిండిపొయ్యేది. కొడుకు చిత్తారి.. పెండ్లి అయిందాంక గూడ ఏ పనీ వట్టిచ్చుకోకుంట మీదమీద రివుట లెక్క తిరిగిండు. ఎవుసం వచ్చు గనీ, పెయ్యి అంచి పనిజెయ్య శాతగాదు. పెండ్లి అయినంక పెండ్లాం మాట ఇని.. మూడేండ్ల కింద పట్నం తొవ్వ వట్టిండు. ఇంతట్లనే కరోనా అచ్చి, వాళ్లు పనిజేశే కంపిని మూతవడ్డది. శేతుల పనులు లేక అప్పులు జేశిండు.
“ఇట్ల ఇంతగనం అప్పులు జేసుకుంట వోతే పర్షాన్ అయితవురా పోడా” అని నర్సవ్వ ఎంత జెప్పినా ఇనలేదు చిత్తారి. తన రివాయి తనదే. మీదికెల్లి తాగుడుకు గూడ బగ్గ మర్గిండు.
‘ఇగ వాడు ఎన్నడన్న బాగుపడని. చెప్పి చెప్పి యాష్టకు వస్తున్నది. వచ్చి ఇక్కన్నే ఎవుసం జేస్కోరా అంటే ఇనడు’ అనుకొని దుర్గయ్య గూడ కొడుక్కు ఊకె జెప్పుడు బందు జేస్కున్నడు. ఇట్ల కొడుకు గురించి ఇంకా ఏమేమో ఆలోశిస్తున్నది దుర్గయ్య మైండు.
ఇంతట్లనే దోసపల్లి సాయిలు అచ్చిండు. ఆయినె సైకిల్ గంట సప్పుడు ఇనంగనే.. చిన్నగ మురిశిపోయిండు దుర్గయ్య.
సాయిలు, దుర్గయ్య చిన్నప్పటిసంది మంచి దోస్తులు. అదే ఊర్లె వుట్టి, అదే ఊర్ల అయ్యవ్వల నుంచి వారసత్వంగ వచ్చిన ఎవుసం జేస్కుంట.. అదే ఊరి మట్టిల కలవాల్నని గట్టిగ నిర్ణయించుకున్నోళ్లు. పొద్దుందాంక ఎండకు కష్టవడుడు, పొద్దిమీకంగనే ఇంత కల్లు బొట్టు తాగి ముదురుకునుడు, పిల్లలతోని కుషీగ ఉండుడు.. ఇదే వాళ్లకు తెల్శిన బంగారు బతుకు. సాయిలుకు నలుగురు కొడుకులు. ఆడి బిడ్డెలు లేరని శాన కుదెం వెట్టుకున్నడు సాయిలు. కోడండ్లు అస్తే.. వాళ్లల్లనే బిడ్డెను జూస్కుందాం అనుకున్నరు గనీ, కోడండ్లు పరాయోళ్ల లెక్కట దూరం ఎల్లిపోయిర్రు.
సైకిల్ను స్టాండేసి వచ్చి.. దుర్గయ్య పక్కపొంటి కూసున్నడు సాయిలు.
దోస్తులిద్దరూ సుట్టలు ముట్టిచ్చుకొని..
గప్పగప్ప తాగుకుంట ముచ్చట్లు మొదలువెట్టిర్రు.
“జగితి శిద్దయ్య కొడుకు గూడ పట్నం గడ్డ
ఎక్కిండంట బావా” అన్నడు దుర్గయ్య.
“ఏమో పో! ఊరంతా పిల్లలున్న గొడ్డుది అయిపోతున్నది కదా? ఒక్కొక్కళ్లు ఇట్ల పట్నం తొవ్వ వట్టినంక మనసొంటి తండ్రులు అనాథల లెక్క మిగుల్తున్నరు” మనసు చిక్కవట్టుకొని అన్నడు సాయిలు.
“ఏమో బావా.. ఈ ఊళ్లె మన తర్వాత ఎవుసం జేశేటోళ్లే ఉండరు గావచ్చు. ఇగ భూతల్లితోని కాదు రైతు బిడ్డలను కనుడు” బాధవడ్డడు దుర్గయ్య.
“మంచిగ సదువుకుంటరు అనుకుంటే వాళ్లు మనకు అందనంత దూరం వోతున్నరు. ఇప్పటికే నాకున్న పదెకరాల పొలం ఆయింత పంచుకొని ఎవన్ది వాడు అమ్ముకొని పట్నం వోయిర్రు. మిగిలిన గా నాలుగిసాల పొలం జేస్కుంట బతుకుతున్న” అంటున్న సాయిలు.. ఈసారి సుట్ట పొగ ఛాతి నిండ వీల్శి వదిలిండు.
“నీకు తెల్సా బామ్మర్దీ గీ ముచ్చట.. మన సంటర్ సర్కార్ రైతులను ముంచే సట్టాలు తెస్తున్నదంట. డిల్లీల రైతులంత కల్శి పది నెల్ల సంది ఎండనక, వాననక, సలనక నిర్సన జేస్తున్నరట”.. సాయిలు నోటి నుంచి ఆ మాటలు విని, గావరైతున్నడు దుర్గయ్య.
“రైతులు ఇప్పటికే పండిచ్చిన పంటకు పెట్టిన లాగోడు రాక మునుగుతున్నరు. అసుంటి మనల్ను సర్కార్ ఆదుకోవాలె గనీ, ముంచుడేందే?”.. దుర్గయ్య కనుబొమ్మలు
ముడివడ్డయి.
“మన భూముల మీద ఎన్కట దొరలు, భూ సాములు ఎట్ల పెత్తనం జేశిర్రో.. ఇప్పుడు అదే పని జేస్తున్నది సర్కార్. మన భూముల మీద వాళ్ల పెత్తనం అన్నమాట. మన భూమిల మనం కైకిలోళ్లం అయితం” అంటున్న సాయిలు మాట పూర్తి గానేలేదు.. దుర్గయ్య అందుకున్నడు.
“అట్లెట్ల అయితది. మన భూమిల ఎవలిదో పెత్తనం ఏంది? నేను ఒప్పుకోను. నాకు గింత జరుగుతున్నదని తెల్వది. పా బావా, మనం గూడ డిల్లికి వోయి మన రైతన్నలకు సాద్దారి ఇద్దాం”.. అంటున్నడు మెడ నరాలు పొంగంగ.
“పోదాం పోదాం.. పోకపోతే మనల్ను మన భూమిలనే బొంద వెడ్తది ఈ సర్కార్” అన్నడు సాయిలు. అట్ల శాన శేపటిదాంక సాగినయి వాళ్ల ముచ్చట్లు.
ఓ దినం పొద్దుగాల్లనే ఇంటి ముంగట్కి ఒగ కారు అచ్చి ఆగింది. ఇంటి బైట పొయ్యిల గొట్టంతోని మంట ఊదుతున్న నర్సవ్వ, నుల్క మంచంల కూసున్న దుర్గయ్య..
‘కార్ల ఎవలు అచ్చిర్రు మా ఇంటికి?” అన్నట్టు అటు దిక్కే జూస్తున్నరు.
అన్లకెల్లి తెల్ల బట్టలు ఏసుకున్న ఒగాయినె దిగిండు. ఆయిన ఎన్కనె.. శింతకాయల రాజయ్య గూడ కారు దిగిండు. దిగుడుతోటే..
“దుర్గన్నా.. ఈనె భుజంగరావు. ఎల్లారెడ్డిప్యాటల ఉంటడు. హైదరవాదుల శాన యాపారాలు ఉన్నయి సారుకు. ఇగో దుర్గన్నా.. ఈ సారు నీ పొలం కొన్నడు” అన్నడు రాజయ్య.
ఆ మాటకు ఒక్కపారి కరెంటు షాక్ గొట్టినట్టు అయిర్రు దుర్గయ్య, నర్సవ్వ. ఒకరి మొకాలు జూస్కుంట బీరిపోతున్నరు.
“మీ కొడుకు చిత్తారి నాకు మీ ఎకరం పొలం అమ్మిండు. ఇరవై ఐదు లక్షలకు కొన్న. రేపటినుంచి మీరు ఆ పొలంలోకి రావొద్దని చెప్పడానికి వచ్చిన. నేను ఆ పొలంలో పూలతోట పెట్టాలనుకుంటున్న. అలాగే మా ఫ్యామిలీ కోసం ఓ గెస్ట్హౌజ్ కట్టాలని అనుకుంటున్న”.. అని చెప్తున్న ఆ పెద్దమనిషి మాటలకు ఇద్దరి గుండెలల్ల ఆటంబాంబు పేలినట్టు అయింది.
“ఏందీ? నా పొలం అమ్మిండా వాడు?” అడిగిండు దుర్గయ్య.
“నీకు తెల్వదానె? గిసుంటి కతలు ఉంటయనే నీ సంతుకం గూడ తీస్క రమ్మనుంటిమి”.. రాజయ్య క్లారిటీ ఇచ్చిండు.
ఆ మాట ఇనంగనే నెల ముందట చిత్తారి హైదరాబాద్ నుంచి వచ్చి ఏవో కాయిదాల మీద ఇద్దరి సంతకాలు తీస్కున్నది యాదికచ్చింది. ‘ఏంటియి ఆ కాయిదాలు?’ అంటే, ఏదో లోన్ తీస్కుంటున్న అన్న చిత్తారి మాటలు గుర్తచ్చి.. గుండెల అడివట్టినట్టు అయింది దుర్గయ్యకు.
‘సదువురానోళ్లం.. అవి పొలం కాయిదాలని తెల్సుకోలేకపోయినం!’ అనుకొని ఇద్దరూ ఒకరి మొకాలు ఒకరు జూస్కుంట నోర్లు ఎల్లవెట్టిర్రు. కొడుకు జేశిన మోసం గురించి తల్సుకుంటుంటే.. నర్సవ్వకు దుఃఖం ఆగలేదు.
“ఎంత పనిజేస్తివిరా చిత్తారీ!” అని శోకాలు వెట్టింది.
“నర్సవ్వా ఏడ్వకు.. మీ కొడుకు మీకంత జెప్పే చేస్తున్నడని అనుకున్నం మేం. అయినా ఇంతకుముందుగాల్ల నాలుగు ఎక్రాల భూమి అమ్ముకున్నరు గదా మీ బిడ్డెలు. ఇది గూడ కొడుకు అమ్ముకున్నడని అనుకోర్రి” అంటున్న రాజయ్య మాటలకు ఇంకింత కుమిలి
పోయింది. భుజంగరావు.. రాజయ్యను జూస్కుంట ‘పా ఇక్కణ్నుంచి’ అన్నట్టు కండ్లతోని సైగ జేశిండు.
“సరే పా దొరా పోదాం మల్ల. దుర్గన్నా.. ఇగ ఆ పొలం ఈ కాన్నుంచి మీది గాదు, ఈ సారుది. పైసలన్నీ ముట్టినయి. రిజిస్ట్రేషన్ గూడ అయిపోయింది” అనుకుంట అక్కడినుంచి
కదిలిండు రాజయ్య.
భుజంగరావు ఈళ్లకు నమస్కారం వెట్టుకుంట పొయి కార్ల కూసున్నడు. సూత్తుండంగనే.. కారు స్టార్ట్ చేసుకొని రయ్యిన వోయిండు.
చిత్తారి పొలం అమ్మిన ముచ్చట దెల్సి దుర్గయ్య ఇంటికి అచ్చిండు సాయిలు.
“కాముని పున్నమి పీడ దినంగోలె మంచి పనే జేశిండు మీ కొడుకు”.. అంటున్న సాయిలును పట్టుకొని బోరున ఏడ్శిండు దుర్గయ్య.
నర్సవ్వ గూడ పల్లపల్ల మల్ల ఏడుపు అందుకున్నది.
“ఏడ్వకుర్రి ఏడ్వకుర్రి.. ఇప్పుడు ఏడుస్తే పోయిన పొలం అస్తదా? బాధవడి ఇంకా నాలుగొద్దులు ఎక్వ బత్కాల్శినోళ్లం బరాన వోతం బోడిగడ్డకు” అనుకుంట.. ఆళ్లను అరుగుమీద కూసుండవెట్టిండు.
“ప్రజలను కాసుకునే సర్కార్ అడ్డమైన సట్టాలతోని రైతులను బలి పశువులను జేస్తున్నది. కడుపుల వుట్టినోళ్లేమో కడుపు మీద తంతున్నరు. ఒగ పక్క రైతులం, ఇంకో పక్క కన్నోళ్లం”.. అనుకుంట ఇంట్లకు ఉర్కి ముంతల నీల్లు తెచ్చి ఇచ్చిండు సాయిలు.
ముచ్చట తెల్శి ఊర్ల శానమంది వచ్చుకుంట పికర్ జెయ్యద్దని చెప్పుకుంట వోతున్నరు. బిడ్డెలు, అల్లుండ్లు గూడ ఫోన్ల ఎన్క ఫోన్లు జేశి మాట్లాడి మనసు తిరం జేస్తున్నరు. కనీ, కొడుకు చిత్తారి మాత్రం ఒక్కపారి గూడ ఫోన్ జెయ్యలేదు.
ఎవ్వలు ఎంత సముదాయించినా.. దుర్గయ్యకు మన్సున వడ్తలేదు.
తన తాతలు, తండ్రుల నుంచి వచ్చిన ఎవుసాన్ని తరతరాలకు ముంగట్కి తీస్కపోవాల్నని దుర్గయ్య ఎన్నో కలలు కన్నడు. గీ ప్రపంచంల ఎవుసాన్ని మించిన నిస్వార్థమైన, నిజాయితీగల్ల పని ఏదీ లేదని శానా బలంగ నమ్మినోడు దుర్గయ్య. కనీ, తనతోనే ఎవుసం ఆగిపోతుందనే మాట దుర్గయ్యను అస్సలు సైసు వట్టనిస్తలేదు. కొడుక్కు ఎవుసం గురించి ఎంత గొప్పగ జెప్పినా నెత్తికెక్కలేదు. రేపో మాపో పట్నం మీద మొకం మొత్తి ఊరి బాట వడ్తడు, ఎవుసం జేస్తడని ఎన్నో నమ్మకాలు వెట్టుకున్నడు. గనీ అవన్నీ అవద్దం జేశిండు చిత్తారి. ఐదు ఎక్రాల్ల నాలుగు ఎక్రాలు బిడ్డెలకు ఇచ్చినా.. ఉన్న ఎక్ర పొలం కొడుక్కు మస్తు అయితదని, రేపు వాడే కష్టం జేశి ఇంకిన్ని ఎక్రాల భూమిని సంపాయించడా? అని అనుకున్నదంతా ఉత్త కతనే జేశిండు చిత్తారి.
రాత్రి నులుక మంచంల పండుకున్న దుర్గయ్యకు నిద్ర వడుతలేదు. అటూఇటూ బొర్రుతున్నడు. పొలమే కండ్లల్ల మెదుల్తున్నది.
‘కొడుక్కు ఎట్ల జెయ్యబుద్ధి అయింది ఈ పని?’ అనుకొని కండ్లు నల్సుకుంటున్నడు.
గంతట్నే బైట కీకెలు, పెద్దపెద్దగ లొల్లి వెట్టుకున్నట్టు సప్పుళ్లు ఇనవడ్తున్నయి. హోలీ పండుగ గదా.. కాముడు కాల్వ ఊరి పోరగాండ్లంత ఒక్కటై తయ్యున ఆడుతున్నరు. వాళ్లిండ్ల వీళ్లిండ్ల ముంగటున్న సామాన్లను తీసుకొచ్చి మంటల్ల ఏస్తున్నరు. వాళ్ల కీకెలు ఇంటున్న దుర్గయ్య మన్సుల ఏదో మెరమెర అన్నది. ఎంటనే మంచంలకెంచి లేశిండు. రుమాలు నెత్తికి సుట్టుకొని, గోశి మంచిగ శెక్కుకున్నడు. దర్వాజ తీస్కొని బైటకచ్చిండు. అక్కడున్న నాగలి, బండి, పార, కొడవలి, కొంకులను జూస్తున్నడు. అన్నిటి మీద చేయితోని ప్రేమగ నిమురుతున్నడు. వాటితోని తను పొలంల చేసిన కష్టాన్ని తల్సుకొని.. ఆ సామాన్లన్నిటిని ఆఖరిసారి అన్నట్టు కండ్లార చూస్తున్నడు. వాటిని సూత్తాంటే.. కండ్లల్ల నీళ్లు దుంకుతున్నయి. ‘ఇగ మీకూ నాకూ బాకీ తీరిపోయింది’ అనుకున్నడు.
ఇంక వేరే ఆలోచించలేదు. చెక్కిలి నరాలు బిగవట్టిండు. నాగలిని లేపి భుజం మీద వెట్టుకున్నడు. కొడవలి, కొంకులున్న సంచిని చేతుల వట్టుకొని కామునికంతలకు నడుస్తున్నడు. కరంటు లేక చీకట్ల ఆయిన తెల్లబట్టలు మాత్రమే కానస్తున్నయి. అప్పటిదాంక కాముని కంతకాడ ఒర్రిన పోరగాండ్లు.. ఎవరిండ్లకు వాళ్లు వోయిర్రు. ఒక్క పురుగులేదాడ. కాముని కంతల మంట వెట్టిన కాముని మంటను జూస్కుంట.. గుడ్లల్ల నీళ్లు తింపుకొన్నడు దుర్గయ్య. దుఃఖం పొంగుకస్తున్నది. పండ్లు నూరుకుంట దుఃఖం ఆపుకొంట.. ఆ నాగలిని ఆ మంటల్ల వేసిండు. సంచిలున్న సామాన్లను గూడ అన్ల గుమ్మరిచ్చిండు. అప్పుడే మనసు రౌతు అయినట్టే అయితున్నది దుర్గయ్యల. మల్ల ఆగలేదక్కడ. ఎన్కకు మల్లి ఇంటితొవ్వ వట్టిండు. ఇంటికాడున్న రొప్పు నాగలిని బండ్లె ఏసిండు. ఎడ్లను బండికి కట్టిండు. ఆకిట్ల కెంచి గెదిమిండు. ఎడ్లకు ఏం అర్థం గాలే.
‘అద్దుమరాత్రి యాడికి తీస్కపోతున్నడు?’ అన్నట్టు అవి కల్లివిల్లి చేస్తుంటే.. వాటి ఈపు మీద మెత్తగ నిమిరిండు. దుర్గయ్య శెయ్యి వడంగనే అవి తాదనకు అచ్చినయి. అట్లనే మెల్లెగ గెదుముకుంట కాముని కంతలకు వోయిండు.
నాలుగు తొవ్వలు కల్శే జాగ అది. కాముని పున్నమి నాడు అక్కణ్నే కామ దహనం చేస్తరు గావట్టి.. అక్కడి జాగకు ‘కాముని కంత’ అని పేరు వడ్డది. గోపాల్పేటల కాముని కంత అంటే.. సుట్టుపక్కల ఊర్లల్ల శానా ఫేమస్. ఆలుమొగల పంచాదులు, అన్నదమ్ముల గెట్టు లొల్లులు, పాలోల్ల తాకులాటలు ఇట్ల ఒకటా రెండా.. శానా పంచాదులు కాముని కంతలనే తెగుతయి.
అక్కడికి రాంగనే ఎడ్లను ఇడ్శిండు. బండి మీద చెయ్యేశి నిమిరిండు. ఇంకింత బాధ కలిగింది. కండ్లల్ల నీల్లు ఆగకుంట దుంకి బండి మీద వడ్తున్నయి.
గుండె బిగవట్టుకొని బండిని గూడ ఆ మంటల్ల నూకిండు. జర్ర శేపట్లనే బండికంత మంట అంటుకున్నది. దుర్గయ్య నెత్తి కొట్టుకుంట ఏడుపు సప్పుడు బైటికి రాకుంట లోపట లోపట కుమిలి కుమిలి ఏడుస్తున్నడు. కండ్లల్ల నీళ్లు మాత్రం ఏరు ధారలు అయినయి. ఎంతో పాయిరంగ జేపిచ్చుకున్న బండి, నాగలి ఇట్ల అన్నీ కాలి బూడిద అయితుంటే.. దుర్గయ్య మన్సు గూడ కాలిపోతున్నది. ఎడ్లను దమాంచుకుంట ఇంటి తొవ్వ వట్టిండు.
ఆయినె ఎనుక.. కాముని మంటలు ఎగిసెగిసి పడుతున్నయి.. అచ్చం దుర్గయ్య గుండెలు మండుతున్నట్టే!
మనం, మన తాతలు, తండ్రులు చేసిన ఎవుసం వారసత్వాన్ని ముంగటికి తీస్కపోవాలె. మనం ఎవుసం దిక్కు రాక.. మన రైతులు డీల వడిపోతున్నరు. డీలవడ్డ రైతుల మీద సర్కార్ అడ్డమైన సట్టాలతోని నడ్మల కార్పొరేట్ శక్తులను తీస్కచ్చి మన రైతన్నలను ఇంకింత తొక్కి పెట్టాలనుకుంటున్నది. గందుకే మనం ఉషార్ గావాలె. ఒకళ్లకు ఒకళ్లం ఆదెరువు గావాలె.
ఇంటికచ్చి మల్ల మంచం మీద ఒరిగిండు. కాముని కంతలనే కాదు.. దుర్గయ్య గుండెల మంట గూడా తగ్గుతలేదు. కొడుకు మోసానికి ఇది తన నిరసన అనుకుంటున్నడు. ఇటు కొడుకు జేశిన మోసం గురించి అటు ఢిల్లీల రైతు ఉద్యమం గురించి సాయిలు జెప్పిన మాటలను యాజ్జేసుకుంట మస్తుగ బాధవడ్డడు.
‘అయ్యకు కొడుకు ఆదెరువు గాకపోవచ్చు గనీ, రైతుకు రైతే ఆదెరువు గావాలె. గీ సర్కార్ మెడలు వంచాల్శిందే. లేకపోతే భవిష్యత్తుల రైతు జాగల కూలోడే మిగుల్తడు’ అని ఆలోచించుకుంట.. కండ్లు మూసుకున్నడు.
ఢిల్లీల రైతు ఉద్యమంల శెరీకైర్రు దుర్గయ్య, సాయిలు. ఆరుగాలం కష్టవడుతున్న రైతులను రోడ్డెక్కిచ్చి అరార గోస వెడుతున్నరని ఆళ్ల మనసుల్ల కలుక్కుమన్నది. ఇప్పటికి ఆరు వందల మంది రైతులు జీవిడ్శిర్రని తెల్శి మస్తు బాధవడ్డరు. ఆయాల్ల రైతులు రోడ్డు మీద కూసుండి నిరసన జేస్తున్నరు. గప్పుడే అక్కడికచ్చిన కేంద్రమంత్రి కొడుకు.. రౌడీ లెక్కట వాళ్ల మీదికి కారెక్కిచ్చి తొమ్మిది మంది రైతుల పానాలు తిన్నడు. ఆ తొమ్మిది మందిల దుర్గయ్య గూడ ఉన్నడు. మంత్రి కొడుకు కావురం పని మీద దేశం మొత్తం అట్టుడికిపోయింది. దేశంలున్న రైతులంత సర్కార్ మీద సైరన్ మోగిచ్చిర్రు. దీంతోని కేంద్రం దిగచ్చింది. ఆ రైతు వ్యతిరేక సట్టాలను ఎన్కకు తీసుకున్నది.
దుర్గయ్య మరణం గోపాల్పేట్ల ఎంతో మందిని కదిలిచ్చింది. రెండు తెలుగు రాష్ర్టాల్ల దుర్గయ్యకు శానమంది నివాళులు అర్పిస్తున్నరు. రైతుగ వుట్టిన దుర్గయ్య రైతుల కోసమే పానం అర్పిచ్చి చరిత్రల నిలిశిండు. ఆ ఊరోళ్లంత కల్శి సర్పంచుతోని మాట్లాడి దుర్గయ్య విగ్రహం జేపిచ్చి.. కాముని కంతల ఉన్న అంబేద్కర్ బొమ్మ పక్కపొంటి నిలవెట్టిర్రు.
ఇంట్ల దీపం ముంగట కూసొని.. గోడకున్న దుర్గయ్య ఫొటో సూస్కుంట బాధ వడుతున్నది నర్సవ్వ. పక్కపొంటి కూసున్న చిత్తారి గూడ లోపల్లోపల కుములుతున్నడు. కోడలు లచ్చిమి, మన్మడు, మన్మరాలు చిత్తారి ఎన్క నిలవడి ఉన్నరు.
“అమ్మా.. నాయిన రైతు ఉత్యమంల అమరుడైండు. బతుకుతే అట్ల నాయిన లెక్క బత్కాలె. పొలం అమ్మి శాన పెద్ద తప్పు జేశిన్నని నాయిన సచ్చినంక అర్థమైంది. గందుకే, వాళ్ల పైసలు వాళ్లకు ముట్టజెప్పి అమ్మిన పొలాన్ని మల్ల ఎన్కకు తీసుకున్న. ఇగ ఈ కాన్నుంచి నేను నాయిన లెక్క ఎవుసమే జేస్త. నిన్ను మంచిగ జూస్కుంట.. నాయిన వారసత్వాన్ని ముంగటికి తీస్కపోత. నాయిన సచ్చినంకనే నాకు బుద్ధి అచ్చిందమ్మా బుద్ధి అచ్చింది..” అని తల్కాయ కొట్టుకుంట చిన్న పిలగానోలె ఏడ్వబట్టిండు చిత్తారి.
“ఈ ఊర్లకెంచి నా అసుంటోళ్లు ఎవలెవలు పోయిర్రో.. వాళ్లందర్ని ఎన్కకు తీస్కచ్చి ఎవుసం గొప్పతనం గురించి చెప్త. ఊరి శివారును మల్ల పచ్చగ మెర్శిపోయేటట్టు జేస్తా” అని ఒట్టు ఏసుకున్నట్టు మాట్లాడుతున్నడు చిత్తారి. ఆ మాటలు ఇంటుంటే.. కొడుకు మొకంల దుర్గయ్యనే కానస్తున్నడు నర్సవ్వకు.
తెల్లారి లేవంగనే కాముని కంతలకు వోయిండు చిత్తారి. అంబేద్కర్ విగ్రహం పక్కపొంటి నిలవడ్డ నాయిన విగ్రహం జూశి చిత్తారి కండ్లల్ల నీల్లు తిరిగినయి. ఊరు ఇడ్సవెట్టి హైదరాబాదుకు ఎవరెవరు బత్కవోయిర్రో వాళ్లందరికి ఫోన్ జేస్కుంట ఊరికి రమ్మన్నడు చిత్తారి. అచ్చినోళ్లందర్ని కాముని కంతల కూసుండవెట్టి ఎవుసం గొప్పతనం గురించి వాళ్లకు జెప్తున్నడు.
“మనం, మన తాతలు, తండ్రులు చేసిన ఎవుసం వారసత్వాన్ని ముంగటికి తీస్కపోవాలె. మనం ఎవుసం దిక్కు రాక.. మన రైతులు డీల వడిపోతున్నరు. డీలవడ్డ రైతుల మీద సర్కార్ అడ్డమైన సట్టాలతోని నడ్మల కార్పొరేట్ శక్తులను తీస్కచ్చి మన రైతన్నలను ఇంకింత తొక్కి పెట్టాలనుకుంటున్నది. గందుకే మనం ఉషార్ గావాలె. ఒకళ్లకు ఒకళ్లం ఆదెరువు గావాలె. మనమంతా కల్శి ఈ సుట్టుపక్కల ఊర్లల్ల అందర్ని ఎవుసం దిక్కు మలుపుదాం. అట్ల ఊర్లే గాదు దేశం మొత్తం మనం యువతను మొత్తం ఎవుసం దిక్కు రండ్రి అని ఘన స్వాగతం జెప్పుదాం. రైతు బల్గం వెర్గుతే బలవంతులం అయితం. అప్పుడు రైతుల తర్వాయి ఎవలు రారు” అనుకుంట చిత్తారి అందట్ల ఎవుసం మీద పాయిరం నింపుతున్నడు.
అక్కడికచ్చిన అందరు..
“నిజమే గదా!” అని వాళ్లుగూడ ఎవుసం జెయ్యనీకి సిద్ధం అయితున్నరు.
వాళ్ల పక్కపొంటే కూసున్న సాయిలు దుర్గయ్య విగ్రహం మొకన్నే సూత్తండు. దుర్గయ్య మీదికెల్లి సూపు దించుతలేడు. అట్లనే జూస్తున్నడు. ఆయాల్ల మంత్రి కొడుకు దుర్గయ్య మీద కారు ఎక్కిచ్చి సంపిన దృశ్యం ఆయిన కండ్లల్ల మెదలవట్టింది.
‘ఆ దినం కారు పయ్యకింద నేను వడేటోన్ని. అది జూశి నా పక్కకున్న దుర్గయ్య నన్ను ఈడ్శి గుంజిండు. నన్ను గడ్డకేశి వాడు పయ్య కింద వడ్డడ్డు. కారు గొరగొర శాన దూరం దుర్గయ్యను గుంజుకపోయింది. ఆ రైతు ఉద్యమానికి దుర్గడు రక్తం చిందిచ్చి జీవిడ్శిండు. ఎంత పని జేస్తివి బామ్మర్దీ..’ అని మనసుల అనుకుంట.. దుర్గయ్య విగ్రహానికి రెండు చేతులెత్తి మొక్కిండు.
హుమాయున్ సంఘీర్
హుమాయున్ సంఘీర్ స్వస్థలం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా చిత్రసీమలో రాణిస్తున్నారు. కొన్ని సినిమాలకు రచనా సహకారం అందించారు. దర్శకత్వ విభాగంలోనూ పలు సినిమాలు, సీరియళ్లు, లఘు చిత్రాలు, వెబ్ సిరీస్లకు పనిచేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘కోలాటం’ డాక్యుమెంటరీ చేశారు. 2006లో ఆంధ్రభూమి పత్రికలో ‘ఎటుపాయె’ కవిత మొదటిసారిగా అచ్చయింది. అప్పటినుంచి అక్షరం వేలు పట్టుకొని నడుస్తున్నారు. తను చూసిన జీవితాలను కథలుగా మలుస్తున్నారు. ఈ క్రమంలో 35 కథలు, అనేక కవితలు, వ్యాసాలు రాశారు. 2008లో ఈయన రాసిన మొదటి కథ ‘శ్రేయోభిలాషి’.. చెన్నై నుంచి వచ్చే ‘స్వప్న’ మాస పత్రికలో ప్రచురితమైంది. త్వరలోనే ‘కామునికంత’ పేరుతో కథా సంపుటిని తీసుకువస్తున్నారు. ‘చిత్రసీమలో పూర్తిస్థాయి దర్శకుడిగా రాణించడమే నా కల. ఇందుకోసం కథలు సిద్ధం చేసుకున్నా’ అని చెబుతున్నారు.
హుమాయున్ సంఘీర్
94411 17051