మనిషికి రెండు జీవితాలు. ఒకటి పూర్తిగా భౌతికమైంది. మరొకటి భౌతికేతరమూ, అభౌతికమూ అయింది. నిరంతరం వర్తమాన సంక్లిష్ట భౌతిక జీవితంలోనే నలిగిపోతున్న ఈ తరాన్ని, ఒక భౌతికాతీత జీవితంలోకి నడిపించుకుపోవాలనే ఈ కథ.
కాలం నది. అది ఎప్పుడూ గర్జిస్తూ, ఉద్ధృతమవుతూ, శాంతిస్తూ, అంతఃఝరులతో ఘర్షిస్తూ కూడా నిలకడగా ముందుకే, మున్ముందుకే ప్రవహిస్తూ వెళ్తుంది. నది వెనుదిరగడమూ, ఆగి వెనక్కి చూసుకోవడమూ ఉండదు. వ్యతిరిక్త ప్రవాహమూ ఉండదు.కాలం కూడా అంతే. ముందుకు దూసుకుపోవడమే! ఈరోజు పుట్టిన మనిషికి రేపు రెండ్రోజుల వయసు. తర్వాత మూడు రోజులు, ఒక నెల, ఆరు నెలలు, ఆరేండ్లు. వయసు పెరగడమే, తరగడముండదు. మనిషి పాతబడటం, వస్తువులు పాతబడటం, ప్రపంచం పాతబడటం, సకల చరాచర సృష్టంతా పాతబడుతూ ఉండటం. ఇదంతా ఒక అర్థం కాని అభౌతిక క్రీడ.
మనిషి ఈ కాలమనే మహాప్రవాహంలో ఎదురీదుతూ గతంలోకి, గతాంతర జీవితంలోకి, వార్థక్యం లోనుండి మళ్లీ యవ్వనంలోకి, బాల్యంలోకి, అక్కడినుండి గత జన్మల్లోకి, అంతకు ముందటి ప్రాచీనతల్లోకి, మూలాల్లోకి, ‘ఆది’లోకి పునర్యానించగలడా? వ్చ్.. ఏమో! అంటే అట్లా రెగ్రెస్ అవుతూ గతంలోకి అభిక్రమించడమంటే మనిషి గతజన్మల స్పృహలోకి వెళ్తూ తనను తాను తరచి తరచి తెలుసుకుంటున్నట్టేనా?
76 ఏండ్ల విశ్రాంత శాస్త్రవేత్త విశ్వనాథం. కండ్లు మూసుకున్నాడు నిశ్శబ్దంగా, మౌనంగా, నిర్వికారంగా. అతను అప్పుడు ప్రశాంత సముద్రంలా ఉన్నాడు, గంభీరమై. విశ్వనాథం హైదరాబాద్ గచ్చిబౌలీలో ఎల్అండ్టీ వాళ్లు నిర్మించిన బహుబ్లాక్ల పోష్ అపార్ట్మెంట్లలో, జే బ్లాక్ 12వ అంతస్తులోని 1204వ నంబర్ 4బీహెచ్కేలోని విశాలమైన నైరుతి బెడ్రూంలో. వెన్నెల పరుపులతో చేసినట్టున్న కింగ్సైజ్ బెడ్పై అచేతనంగా పడుకొని ఉన్నాడు. అతని మనసు కల్లోల కడలిలా ఉంది. శరీరం రాలిపోయిన బొండు మల్లెపువ్వులా వాడిపోయి ఉంది.
‘జీవితం ఏమిటి?’ అని అతని హృదయం చాలా రోజులుగా తనలో తానే తర్కిస్తున్నది.
బ్రతుకంతా ఎన్నో, ఎన్నెన్నో పరిశోధనలు చేసి, కొత్తకొత్త జీవశాస్త్ర రహస్యాలను కనుక్కొని, మనుషుల దీర్ఘవ్యాధులకు ఔషధాలను రూపకల్పన చేసి, పేటెంట్స్ను సంపాదించి..
కండ్లు మూసుకుంటే. జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తల సదస్సుల్లో హర్షాతిరేకంతో తాను జీవశాస్త్ర మూలాలను ఆవిష్కరిస్తూ కీలక రహస్యాలను విప్పి చెబుతూండగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేధావులు కరతాళ ధ్వనులు చేస్తున్నపుడు పొందిన మహోద్వేగ ఘడియలు.
‘అవన్నీ ఇప్పుడేవి? ఆ అమృత క్షణాలేవి?’
విశ్వనాథం ఒంటరి. భార్య వెళ్లిపోయింది, యేడాది క్రితం. ఒక్కగానొక్క కొడుకు గూగుల్ దక్షిణాసియా అధిపతి. ఊపిరి తీసుకోవడానికి
కూడా సమయం ఉండని ఉద్యోగం. ఇక ఎవ్వరూ లేరు అతనికి.
‘అసలు మనిషికి ఏమి కావాలి?’ అని ప్రశ్న.
ఎన్నో ఆధ్యాత్మిక, తాత్త్విక మానసిక శాస్త్ర గ్రంథాలన్నిటినీ ఆపోసన పట్టి..
‘అంతిమం ఏమిటి?’ అని తర్కం.
‘చివరి తీరం, ఆఖరి అవధి, అవతలి ఒడ్డుపై.. ఏమున్నది?’
విశ్వనాథానికి తాను ఎంతో ఆరాధించే భారతదేశ మహోన్నత గ్రంథం ‘భగవద్గీత’ జ్ఞాపకమొచ్చింది.
‘నేను ఈ ప్రపంచానికి అత్యంత ప్రాచీనకాలం నుండి జ్ఞానాన్ని దానం చేస్తున్న పవిత్ర పుణ్యభూమి భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను’ అని ఎన్నెన్నో వేదికలపై ఉద్వేగంతో చెప్పిన విషయం విశ్వనాథం మనసులో కదలాడి, చప్పున అతని కండ్లనిండా నీళ్లు పొంగుకొచ్చాయి.
‘భగవద్గీత’ శ్లోకాలు మొత్తం అతనికి కంఠతా వచ్చు. మానవులను సన్మార్గంలో నడిపే మంత్రాలవి, విశ్వనాథం దృష్టిలో.
నాల్గవ అధ్యాయం జ్ఞానయోగంలో..
బహూనిమే వ్యతీతాని
జన్మాని తవ అర్జున,
తాన్యహం వేద సర్వాణి
న త్వం వేత్థ పరంతప
.. అర్జునా! నాకును, నీకును పెక్కుజన్మలు గడిచినవి. నేను వాటినన్నిటినీ ఎరుగుదును. కానీ, నీవు ఎరుగవు. మరిచితివి. ధర్మాధర్మాది సంస్కారములచేత నీ జ్ఞానశక్తి ఆవృతమైనది. నీవు మాయాధీనుడవు. కానీ, నేను నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావుడను. అలుప్త, విద్యాశక్తినీ, మాయాధీశుడనూ అగుటచే నా జ్ఞానశక్తి సర్వదా అనావృతము.
‘అంటే, తనకు గతజన్మల వృత్తాంతం ఏదీ స్ఫురించదా?’
అటు బౌద్ధంలో ‘ఆలారకాలాముడూ’,
‘ఉద్దక రామపుత్రుడూ’ అనే ఇద్దరు యోగిపుంగవుల దగ్గర సంజ్ఞానా సజ్జాయతన, నిర్వికల్ప సమాధి విద్యలను నేర్చుకొని, అంతిమంగా.. మగధరాజ్యంలోని ఉరువేల అంటే ఇప్పటి బుద్ధగయకు చేరుకున్న సిద్ధార్థుడు. తన 35 ఏండ్ల వయసులో సంబోధి అంటే సంపూర్ణ జ్ఞానోదయం కలిగి బుద్ధుడయ్యాడు. బుద్ధుడు ప్రవచించిన సత్యం ఏమిటంటే ధ్యానం, ఏకాగ్రతే సమాధి స్థితి కాదు. ఆ రెంటికీ మించిన స్థితి, ధ్యానంలోకి వెళ్లగలిగిన బౌద్ధభిక్షువు హృదయంలో ఆనందం ఉద్భవిస్తుంది. అతడు నాలుగు ధ్యాన దశలను అధిగమిస్తాడు. శరీరాన్ని, మనసునూ పవిత్రత, స్వచ్ఛత ఆవరిస్తాయి. ఆ దశలో చతురార్య సత్యాలైన ‘లోకంలో దుఃఖం ఉంది’, ‘దుఃఖానికి కారణం ఉంది’, ‘దుఃఖాన్ని నిరోధించవచ్చు’, ‘దుఃఖ నిరోధానికి మార్గం ఉంది’ అన్న గ్రహింపుతో అర్థం చేసుకొని..
సుఖాపేక్ష, అస్తిత్వాపేక్ష, అవిద్య అనే మూడు మహాదోషాలు ఎలా మొదలవుతాయో? ఎలా అంతమవుతాయో? గ్రహిస్తాడు. అప్పుడు ఆ బౌద్ధభిక్షువు తన పూర్వజన్మ పరంపరనే కాకుండా ఇతరుల గతజన్మలనుకూడా మనోనేత్రంతో దర్శించి అర్థం
చేసుకుంటాడు.
ఈ చతురార్య సత్యాలేకాక అష్టాంగమార్గం అంటే సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ కృషి, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి.. ఇదంతా ఒక అనంత ప్రయాణమై, బౌద్ధ ధర్మసార సంగ్రహణంగా ‘నిర్వాణం’ ప్రాప్తమవుతుందని సారాంశం.
‘అసలు ఈ ‘నిర్వాణం’ అంటే ఏమిటి?’
..‘నిర్వాణం’ అనేది బుద్ధుడి ప్రవచనం ప్రకారం చావు, పుట్టుకలు, వ్యాధులు, దుఃఖాలు లేని అనిర్వచనీయ, నిరుపమాన స్థితి. మనం ఊహిస్తున్నట్టుగా మరణానంతరం కూడా ఈ జన్మలోనే, బతికి ఉండగానే పొందగలిగిన స్థితి. ఆనందమయమైన ప్రశాంత స్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే, ధార్మిక జీవనానికున్న అత్యున్నత లక్ష్యం నిర్వాణం. నిర్వాణ పథాన్ని పొందిన సాధకుడు మరణ
భయాతీతుడు.
‘పునఃపునః జన్మలు, పునఃపునః మరణాలు.. ఈ ప్రత్యయ అప్రత్యయాలు ఏమిటి?’
కుండలినీ చక్రాలు మూలాధార చక్రం నుండి మొదలై స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రార సప్తచక్రాలుగా విస్తృతమవుతాయి. ఈ సహస్రార చక్రమే పినైల్ గ్లాండ్. మూడో కన్నుగా పరివర్తించి, దివ్యదృైష్టిగా మారి..
విశ్వనాథానికి తను ఎటో కాలంలోకి అంతరిక్షం నుండి రాలిపోతున్న నక్షత్రంలా పతనమైపోతూ, రివ్వున దూసుకుపోతూ..
ఇప్పుడు తాను ఆనందుడు. బుద్ధుడి అనుంగ సహచరుల్లో ముఖ్య అనుచరుడు. కపిల వస్తుపురం, మగధ రాజ్య ‘వేణువనం’, మృగదావనం, త్రిశరణాలు.. ‘బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి’, ఏవేవో ద్వారాలు తెరుచుకుంటూ, ఆకాశాలు విచ్చుకుంటూ అడవులు బాహువులను చాస్తూ ఆహ్వానిస్తూ సముద్రాలు, వనాలు, వసంతాలు, జలపాతాలు, నదీ సంగమాలు.. అంతా ఒక వినూత్న మాయామేయ సంచలితోగ్న సంభరితం.
ఒకదాని వెంట మరొక జన్మ, మరొక మరణం. ఇంకొక పుట్టుక, ఇంకొక చావు. చక్రమేదో నిరంతరంగా పరిభ్రమిస్తూ నీడలు వెలుగులు, చీకట్లు వేకువలు, మెళకువలు
నిర్నిద్రలు..
తెగిపోతున్నాడు తను. గగనోద్ధతినుండి ఇటు ఈ పాతాళాంతరాల్లోకి.
బెల్ మోగుతున్నది. ‘ణ్ ణ్ ణ్ ణ్ ణ్’ అని నిరంతరంగా. సమాంతరంగా ఇటు పక్కనున్న మొబైల్ ఫోన్కూడా.
విశ్వనాథం ఉలిక్కి పడ్డాడు. రాలిపడ్డాడు, చటుక్కున స్పృహలోకి. కండ్లు తెరిస్తే ఎదుట గోడపై గడియారంలో తొమ్మిదీ నలభై నిమిషాలు.. రాత్రి.
బుద్ధుడి అనుచరుడైన తాను ఆనందుడు. బుద్ధుడి బోధనలన్నిటినీ క్రోడీకరించి కూర్చిన ‘త్రిపిటకాలు’, స్పృహ. త్రి అంటే మూడు. పిటకాలు అంటే గంపలు. మూడు గంపలు వినయ పిటక, సుత్త పిటక, అభిదమ్మ పిటక. మూడు గంపలనిండా అనంత జ్ఞానం.
జ్ఞానమయ, కాంతిమయ, శాంతిమయ, మహితాత్మమయ మనోజ్ఞ భూమి ఈ తన
భరతభూమి.
బెల్ ఇంకా మోగుతూనే ఉంది. విశ్వనాథం కదలలేడు, అచేతనుడు. రెండు కాళ్లూ పడిపోయి, ప్యారలైజ్ అయి కింది లోయర్ బాడీ మొత్తం అచేతనం. అప్పర్ పార్షియల్లీ ఫంక్షనల్. కాళ్లు కదలవు, చేతులు కదులుతాయి. కానీ, పనిచేయవు.
తను బతికుంటాడు. కానీ, చచ్చిపోయి శ్వాసిస్తూ..
‘జీవన్మృతుడా తను?’
విశ్వనాథం ఒంటిపైన ఒక అందమైన పట్టు జలతారు వంటి దుప్పటి ఉంది. పాదాలపైనుండి ఛాతీవరకు. దుప్పటి కింద అంతా నగ్నం. పిరుదులకింద ఒక లాట్రిన్ బొవెల్ అటాచ్డ్. మోటరైజ్డ్. సెల్ఫ్ క్లీనింగ్ అండ్ స్కావెంజింగ్. ప్రెషరైజ్డ్ ఎయిర్ ఆపరేటెడ్.
దొడ్డికి వచ్చినప్పుడు కుడిచేతికి దగ్గర్లో ఉన్న టచ్ బటన్ను స్పర్శిస్తే మోటార్ ఆన్ అయి బొవెల్లో పడ్డ మలాన్ని బయటకు తన్నుకుపోయి, సానిటైజర్ ద్రవాన్ని చిమ్మి శుభ్రపర్చి.. క్షణాల్లో అంతా మామూలు. ఆ అద్భుతమైన మెషీన్ను కొడుకు ఆరు నెలల క్రితం స్విట్జర్ల్యాండ్ నుండి తెప్పించి, ఇన్స్టాల్ చేయించాడు.
లేకుంటే నరకమే. చచ్చుబడి పోయిన శరీర కిందిభాగం మలమూత్రాల విసర్జన తాలూకు సంకేతాలను మాత్రం ఇస్తుంది. కానీ, చర్యలు తెలియవు విశ్వనాథానికి.
జీవిత చరమం ఇంత భయంకరంగా ఉంటుందా? ‘చచ్చిపోతే బాగుండును’ అని ఆయన రోజుకు కనీసం వంద సార్లయినా అనుకునుంటాడు కండ్లనిండా నీళ్లతో.
కానీ, చావు రాదు, పిలువగానే. మృత్యుదేవత తల్లి లాంటిది. ఏడుస్తూ పిలువగానే రాదు. ‘మదర్ నోస్ వెన్ టు ఫీడ్ ద చైల్డ్’. తను రావలసినప్పుడే వచ్చి పరిష్వంగిస్తుంది.
హాల్, అపార్ట్మెంట్ అంతా అతినిశ్శబ్దంగా, బంగారు పాముల పుట్టలా ఉంది. ఆయన దగ్గర నర్సింగ్ డ్యూటీలో ఉండే మిసెస్ బెంజమిన్ ఈరోజు రాదు. ఆమె బిడ్డ పెండ్లి. ఇంకా రెండు దినాలూ రాదు. ఔటాఫ్ స్టేషన్. ఇంకెవరినో ఏర్పాటు చేసింది ప్రతిగా. కానీ అతనో, ఆమెనో రాలేదు.
డబ్బు ఉంటే అన్ని సౌకర్యాలూ. అయినా, అన్ని సేవలూ అందవనీ, ముఖ్యంగా ప్రేమ దొరకదనీ విశ్వనాథానికి ఎప్పుడో అర్థమైంది.
కుడిచేతి దగ్గరున్న ‘లేజర్ కంట్రోలర్’ను సుతిమెత్తగా నొక్కాడు. 30 ఫీట్ల దూరంలో ఉన్న సింహద్వారం తెరుచుకుంది నాజూగ్గా. అప్పుడర్థమైంది విశ్వనాథానికి, బయట అతిభయంకరంగా వర్షం కురుస్తున్నదని. వాన చప్పుడు భీకరంగా. దర్వాజా దగ్గర నిలబడి ఒక యువతి, వర్షంలో తడిసి ముద్దయి. ఒంటినుండి నీళ్లు ధారలు ధారలుగా కారుతూ.
ఒంటిపైన అతినల్లగా తడిచిన టీషర్ట్. చేతిలో నల్లటి సంచి. ముఖంపై కాంతివంతంగా మెరుస్తూ నవ్వు. గడప దగ్గరే ఉండిపోయి, “సర్.. స్విగ్గీ ” అన్నది.
స్విగ్గీ, జొమాటో.. హంగ్రీ సేవర్స్కు ఒక కండిషన్ ఉంటుంది. డెలివరీ ఇచ్చేటప్పుడు కస్టమర్ ఇంటిగడప బయటే నిలబడి ఫుడ్ను డెలివరీ చేయాలని. సేఫ్టీ మెజర్ అది.
విశ్వనాథం క్షణకాలంలో ఒక గంటక్రితం నుండి తన సిక్త్ సెన్స్ అంటే మనసులో నిద్రావస్థలో ఉన్న ఇంట్యూషన్, జరగబోయే సంగతిని ముందే సూచించే భగవత్ నిర్మిత ‘ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్’ న్యూరాన్స్ యాక్టివేట్ అయి.. భారతీయ ప్రాచీన సాహిత్యంలో ఉటంకించిన ‘ఆకాశవాణి’ ఆదేశాల వంటిది..
‘ఒక గంటలో ఎవరో వస్తారు.. ఎవరో వస్తారు.. ఎవరో వచ్చి..’ అని.
వచ్చింది ఆ ఆకాశవాణి దూతేనా.. ఈమేనా?
“ప్లీజ్ కమిన్” అని సకల శక్తులనూ కూడగట్టుకొని పలికాడు విశ్వనాథం.
అప్పుడు చూసిందామె, బయటి తలుపు రెక్కపై.
‘వేమూరి విశ్వనాథం.. సైంటిస్ట్’ అన్న అక్షరాలను. ఒక్కసారిగా ఇంట్రావీనస్ కాల్షియం ఇంజెక్షన్ను తీసుకున్నంత విభ్రమానికి లోనై, ఆ హాల్లోకి భయం భయంగా నడిచింది. ఒంటినిండా వర్షపు నీల్లోడుతూనే.
విశ్వనాథం దగ్గరగా వచ్చి పక్కనే నిలబడి, ఆయన కండ్లలోకి చూసింది దయగా, తల్లివలె.
విశ్వనాథం ఎందుకో తీవ్రంగా చలించిపోతూ, ఆమెవైపు అతి నిస్సహాయంగా, దీనంగా సముద్రమంత ప్రేమతో, వాత్సల్యంగా చూశాడు.
అప్పటిదాకా తనకు ఆకలి వేస్తున్నదన్న విషయాన్ని మరిచిపోయిన అతనికి, ‘తల్లి దగ్గరికి రాగానే పాలు తాగాలన్న స్పృహ కలిగిన పసి బాలుని’వలె చకితుడై..
‘ఇప్పుడీమె నాకు ఆహారాన్ని తెచ్చిందా? ఒక కప్పు పెరుగన్నం.. ఇంత రాత్రి. ఇంత భీకర వర్షంలో తడుస్తూ, అమ్మవలె, కన్న తల్లివలె’ అనుకున్నాడు కన్నీళ్లతో సుడి తిరిగిపోతూ.
“సర్.. కర్డ్ రైస్” అన్నదామె.
ప్రతిగా అతనేమీ మాట్లాడలేకపోయాడు. ఎందుకో అతని గొంతు గద్గదమై, ఒట్టి కన్నీళ్లు లావాలా పొంగి చిమ్ముకొచ్చాయి. తలూపాడు, చిన్న పిల్లాడిలా. ఆమె ఒంటి పైనుండి కారుతున్న వాననీటిని కొద్దిగా తుడుచుకుంటూ, వీపుకున్న బ్యాగ్లోనుండి ఒక అందమైన, మెరుస్తున్న సిల్వర్ పేపర్ ప్యాకెట్ను బయటకు తీసి, అతి వినయంగా, అతిప్రేమతో దాన్ని పక్కనున్న టీపాయ్పై పెట్టింది. పెట్టి విశ్వనాథాన్ని జాగ్రత్తగా, సానుభూతితో, దయతో పరిశీలనగా పరికించింది. అంతా అర్థమైందామెకు.
“సర్.. తినిపించాలా?” అన్నది మళ్లీ.
అతనికిక దుఃఖం ఆగలేదు. ఎక్కెక్కిపడి..
“నేను.. యామిని సర్” తనను తాను పరిచయం చేసుకుంటూ.. వెండి రంగులో ఉన్న పెట్టెమీది వెండిరంగు కాగితాన్ని ఒలిచి..
అప్పటిదాకా ‘నాలో ఇంత ఆకలి దాగి ఉందా?’ అనిపించిందేమో విశ్వనాథానికి, ఉద్యుక్తుడయ్యాడు మానసికంగా తినడానికి.
అప్పుడు గమనించిందామె, అతని తలగడ దగ్గర ఉన్న అద్భుతమైన పుస్తకం ‘డై ఎమ్టీ’ బై టోడ్ హెన్రీ.
‘ఖాళీగా మరణించు’ అని ఆ పుస్తకం. నిత్య సంఘర్షణలతో, కోటి కోరికలతో, ఆపేక్షలతో, స్వార్థపర ఆకాంక్షలతో నిరంతరం శిథిలమైపోయే మనిషి అసలు ఖాళీగా ఉంటాడా ఎప్పుడైనా? మనిషి తనను తాను ఖాళీ చేసుకోవడం ఎంత కష్టమో! అది ఒక ఆత్మపరిత్యాగ దశ. భావాతీత ధ్యానయోగ (Transcendental meditation ) సాధనతో మాత్రమే సాధ్యమయ్యే తురీయ క్రియ. ‘ఈయన ఈ పుస్తకాన్ని చదువుతున్నాడా? ఈ అచేతన స్థితిలో’ అనుకున్నది యామిని. అతనివైపు అనునయింపుగా చూస్తూ, చేతిలోకి ఒక చెంచా పెరుగన్నాన్ని తీసుకొని, విశ్వనాథం నోటి కందిస్తూ..
విశ్వనాథం నోటిని ఆతృతగా తెరిచాడు.. పక్షి కూనకు తల్లిపక్షి ఆహారాన్ని ముక్కుతో అందిస్తున్నప్పటి పారవశ్య క్షణంలోవలె.
‘డై ఎమ్టీ’ రాసిన టోడ్ హెన్రీ గురించి ఆలోచించిందామె ఆ కొద్ది క్షణాల్లో, అతనికి అన్నం తినిపిస్తూ.
హెన్రీ ఒక కీలమైన వ్యాపార సదస్సులో పాల్గొన్నప్పుడు ఒక పెద్దాయన ప్రసంగిస్తూ సభికులను అడిగాడట “ఈ ప్రపంచంలో ‘రిచ్ ల్యాండ్’ ఎక్కడున్నది?” అని. దానికి ఆ పెద్దల్లో ఒకరు, ‘ఆయిల్ గల్ఫ్ దేశాలనీ’, ఇంకొకరు, ‘ఆఫ్రికాలోని వజ్రాల భూములనీ’.. ఇట్లా అనేకానేక జవాబులు చెప్పారు. కానీ, అంతిమంగా ఆ ప్రశ్నించిన పెద్దాయన చెప్పిందేమిటంటే.. “అన్నిటికన్నా అతి ధనిక భూమి.. శ్మశానం” అని.
అందరూ ఆశ్చర్యపోతూండగా మళ్లీ ఆయనే చెప్పాడు, “అంతిమంగా ఎవరైనా తన వెంట దేన్నీ తీసుకుపోలేని నిస్సహాయతలో, తనలో, తనతో ఉన్న సకల ఐశ్వర్యాలనూ, అద్భుతమైన ఆలోచనలనూ, జ్ఞానాన్నీ, గమ్యాలను చేరగల నేర్పునూ, అన్నిటినీ మించి ఈ మానవలోకాన్ని పవిత్రంగా ప్రేమించగల దైవత్వాన్ని.. అన్నిటినీ నీ సహ మానవులకు దానం చేసి, నిర్వాణ స్థితిలో ఎవ్వరైనా చేరగలిగేది ఒక్క శ్మశానానికే గదా!” అని.
అప్పుడు అవాక్కయిన నిశ్శబ్దమే టోడ్ హెన్రీచేత ఈ అద్భుతమైన ‘డై ఎమ్టీ’ గ్రంథాన్ని రాయించింది.
కానీ, మనిషి తనను తాను ఖాళీ చేసుకోవడం అంత సులువైన విషయం కాదని ఎవరికైనా తెలుస్తుంది, ఆ పుస్తకాన్ని చదువుతున్నపుడు.
యామిని ఊహకు భిన్నంగా విశ్వనాథం ఆమె తినిపిస్తున్న కొద్దీ బాక్స్లోని పెరుగన్నాన్ని మొత్తం తిన్నాడు ఆబగా. ఆశ్చర్యపోయిందామె.
తర్వాత ప్రశాంత వదనంతో..
“ఎదురుగా ఆ గోడకు ఎనిమిది ర్యాక్స్ ఉన్నాయమ్మా. దె ఆర్ నంబర్డ్. గో టూ జీరో. ఓపెన్ విత్ దిస్ కీ” అని ఒక తాళం చెవిని తలగడ కిందినుండి తీసిచ్చాడు. అది ధగధగా
మెరుస్తున్నది.
“ఆ జీరో ర్యాక్లో ఇంకో కీ ఉంటుంది. దాంతో ఓపెన్ ర్యాక్ నంబర్ ఫైవ్, సిక్స్ అండ్ త్రీ” అని ఆయాస పడటం మొదలెట్టాడు.
యామిని ఆ తాళం చెవిని తీసుకొని మౌనంగా వెళ్లి, జీరో అరను తెరిచి, దాని లోపలినుండి మరో నల్లని క్రోమియం కీని తీసుకొని, మొదట ఆయన చెప్పినట్టే.. ఐదో నెంబర్ అరను తెరిచింది. దాన్నిండా దిమ్మదిరిగేట్టు గుట్టలు గుట్టలుగా అన్నీ రెండువేల రూపాయల నోట్ల కట్టలున్నాయి. కొన్ని కోట్లవుతాయవి. ఆ అరను మూసి ఆరో నంబర్ అరను తెరిచింది. దాన్నిండా వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు. అవీ అనేక కోట్ల విలువైనవే. దాన్ని మూసి అతను చెప్పిన మూడో నంబర్ అరను తెరిచింది. దాంట్లో.. అతని చెక్ బుక్లు ఐదారు. అన్నీ అంతర్జాతీయ బ్యాంకులవి. పక్కనే ఐదారు ఫైల్స్.. తెరిచి చూసింది. అన్నీ విశ్వనాథం కనిపెట్టి, ఈ ప్రపంచానికి ప్రసాదించిన.. మనిషిని వ్యాధులనుండి రక్షించగలిగే పరిశోధనల బాపతు పేటెంట్స్. కోట్ల విలువ గలవి. అయితే, చిత్రంగా ఆమెకు అదే అరలో.. బంగారు రంగు అట్టతో ధగధగా మెరిసిపోతూ లావైన గ్రంథం ‘శ్రీమద్భగవద్గీత’ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకొని, మిగతా అరలన్నిటికీ జాగ్రత్తగా మళ్లీ తాళం వేసి, తిరిగి ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి ఎదురుగా నిలబడి, ఆమె చేతిలో అంతకు ముందే ఆయనిచ్చిన ప్రధాన తాళంచెవి ఉంది. అప్రయత్నంగానే యామిని అతన్నీ, అతని తలగడ పక్కనే ఉన్న ‘డై ఎమ్టీ’ పుస్తకాన్ని చూసింది.. ఒక లిప్తకాలం చిత్రంగా!
సరిగ్గా ఆ క్షణమే విశ్వనాథానికి తనలోని సిక్త్స్ సెన్స్ అనబడే ఎక్స్ ట్రా సెన్సరీ పర్సెప్టివ్ వ్యవస్థ యాక్టివేట్ అవుతూ.. అర్థం కానిది ఏదో తనను ఆవహిస్తున్నదన్న సత్యం తెలుస్తుండగా..
యామిని.. ‘ఈయన తనకు ఈ తన నిధుల రహస్యాలను చెప్పి.. ‘కావాలంటే వీటన్నిటినీ తీసుకుపో’ అన్న సజెషన్ ఇస్తూ, తనను తాను ఖాళీ చేసుకుంటున్నాడా?’ అనుకున్నది.
విశ్వనాథం అతికష్టంగా అటు పక్కనే ఉన్న మంచం అరలోనుండి ఒక చెక్బుక్ను తీసి అందించాడామెకు, ఆయాస పడ్తూనే. మొత్తం ఇరవై ఐదు లీవ్స్ ఉన్నాయి. అన్నీ సంతకాలు చేసి ఉన్న బ్యాంక్ చెక్స్. దాన్ని యామిని చేతిలో పెట్టి భారంగా కండ్లు నిలకడగా ఉంచి
చూస్తూండగా..
ఇక ఆలస్యమవుతున్నట్టుగా గ్రహించి, యామిని ఒంటి పైనుండి వర్షపు నీరు కారుతుండగానే తన స్విగ్గీ బ్యాగ్ లోనుండి ఒక గ్రంథాన్ని బయటికి తీసి విశ్వనాథానికి చూపించింది.. అది ‘డై ఎమ్టీ’ పుస్తకమే టోడ్ హెన్రీది.
విశ్వనాథం ముఖంపై చిన్మయమైన ఒక నవ్వు మొలిచింది తృప్తిగా.
యామిని కండ్లనిండా కన్నీళ్లు.
విశ్వనాథం మరణించాడని గ్రహించిందామె.
‘మరి, తనుకూడా.. ఖాళీ కావాలి కదా!’
ప్రొఫెసర్ రామా చంద్రమౌళి
కవి, కథకుడు, నవలాకారుడు, విమర్శకుడిగా రామా చంద్రమౌళి సుపరిచితులు. స్వస్థలం వరంగల్. మెకానికల్ ఇంజినీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రస్తుతం వరంగల్లోని ‘గణపతి ఇంజినీరింగ్ కాలేజ్’లో వైస్ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు. సాహిత్యాభిలాషతో ఇప్పటి వరకూ 32 నవలలు, 385 కథలు, 12 కవితా సంపుటాలు, మూడు నాటకాలు, నాలుగు
విమర్శనా గ్రంథాలను వెలువరించారు. మొత్తం 76 గ్రంథాలను ప్రచురించారు. గ్రీస్, తైవాన్ దేశాల్లో జరిగిన ‘ప్రపంచ కవుల సదస్సు’లలో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 2019లో భువనేశ్వర్లో నిర్వహించిన 39వ ‘ప్రపంచ కవుల కాంగ్రెస్-2019’లో భారత ప్రతినిధిగా పాల్గొని ప్రపంచవేదికపై తన ఇంగ్లిష్ కథల సంపుటిని ఆవిష్కరించారు. ఇటీవలే ‘కాళోజీ పురస్కారం’ అందుకున్నారు. వీరు రాసిన ‘భూమిదుఃఖం’ కథను దూరదర్శన్ వారు ‘టెలీఫిల్మ్’గా నిర్మించారు. ఇది ‘2011వ సంవత్సరపు ఉత్తమ టెలీఫిల్మ్’గా ఎంపికై, ‘స్వర్ణనంది’ పురస్కారాన్ని పొందింది. 2007లో తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం, 2008లో సినారె కవిత్వ పురస్కారం అందుకొన్నారు. వీరి కథలు, కవితలు, నవలలు పంజాబీ, తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషలలోకి విరివిగా అనువాదం అయ్యాయి.
-ప్రొఫెసర్ రామా చంద్రమౌళి ,9390109993