ఒకానొకరోజు అదృష్టానికి, విజ్ఞానానికి మధ్య ఒక వాదన వచ్చింది. నేను గొప్ప అంటే నేనే గొప్ప అని రెండూ వాదించుకున్నాయి. అవి తమ వాదనలను ప్రయోగాత్మకంగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాయి. అదృష్టం తన సామర్థ్యాన్ని నిరూపించడానికి ఒక పేద రైతును ఎంచుకున్నది. అతని గోధుమ పంటను ముత్యాలుగా మార్చింది. కానీ ఆ రైతు మాత్రం తన గోధుమ పంటంతా నాశనం అయిందే అని బాధపడ్డాడు. అప్పుడే అటుగా వెళ్తున్న రాజు అతడి దుఃఖానికి కారణమేంటని అడిగాడు. రైతు అంతా వివరించాడు. ముత్యాల పంటను చూసి రాజు ఆశ్చర్యపోయి, పక్కనే ఉన్న మంత్రితో ‘ఇతనెవరో కానీ, చాలా అదృష్టజాతకుడిలా ఉన్నాడు. రాకుమార్తెను ఈ యువరైతుకు ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాను’ అని చెప్పాడు. మంత్రి కూడా రాజు మాటలతో ఏకీభవించాడు. దాంతో రాజు, ‘నీ పంటనంతా రాజ
మహల్కు తీసుకురా. నీకు మోయలేనంత ధనంతో పాటు నా కుమార్తెనిచ్చి పెండ్ల్లి జరిపిస్తాను’ అని రైతుతో అన్నాడు. రాజు మాటకు రైతు ఎగిరి గంతేసి తన అంగీకారం తెలిపాడు. ఊళ్లోకి పోయి రాకుమార్తెతో తన వివాహం గురించి అందరికీ చెప్పాడు. గ్రామస్థులు అతడిని ఆట పట్టించారు. రైతు రాజమహలుకు ఒంటరిగా వెళ్లాడు. రాకుమార్తెతో అతని వివాహం జరిగింది. రాత్రి రాకుమార్తె రైతు గదిలోకి ప్రవేశించింది. ఆమెను చూడగానే అతనికి పెళ్లికూతురు వేషంలో వచ్చి మనుషుల రక్తం తాగే రాక్షసి గుర్తుకు వచ్చింది. రైతు ఆ రాకుమార్తెను పిశాచిగా భావించి భయంతో పారిపోయి నదిలో దూకాడు. రాకుమార్తె అరుపుల వల్ల, కొందరు సైనికులు రైతు వెంట పరుగుతీసి కాపాడి తీసుకువచ్చారు. రైతుపై కోపంతో రాజు అతనికి ఉరిశిక్ష విధించాడు. దీంతో విజ్ఞానం(తెలివితేటలు) అదృష్టంతో ‘చూశావా.. నీవు ఆ పేద రైతుకు ఎంతటి కష్టాన్ని తెచ్చి పెట్టావో? నేను అతడిని కాపాడతాను’ అంది. వెంటనే విజ్ఞానం రైతు మెదడులోకి ప్రవేశించింది. రైతు రాజుతో ‘రాజా.. ఏ నేరానికి నాకు ఈ శిక్ష విధించారు? నిన్న రాత్రి ఒక వ్యక్తి నదిలో మునిగిపోతూ, కాపాడమని చేసిన హాహాకారాలు నేను విన్నాను. పెండ్లి రోజు రాత్రి ఎవరైనా చనిపోతే, అది ఆ పెండ్లి కూతురికి ఆశుభ సూచకం కదా! అందువల్ల నేను అతడిని కాపాడటానికి పరిగెత్తాను. నేను నిన్న రాత్రి చేసినదంతా మీ కూతురి క్షేమం కోసమే’అన్నాడు. ఈ మాటలు విన్న రాజు అతడిని క్షమాపణలు వేడుకొని ఆలింగనం చేసుకున్నాడు.
నీతి: విజ్ఞానం, అదృష్టం నాణానికున్న బొమ్మ, బొరుసు వంటివి. రెండూ కచ్చితంగా ఉండి తీరాల్సినవి.