నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2020’లో ప్రచురణకు ఎంపికైన కథ.
ఈవారం కథ
గోల్కొండ కోట గుమ్మానికి వేలాడుతున్న తల లేని మొండెం.. ఉడుకు నెత్తురు ఉరకలెత్తుతున్న మనిషి లెక్క ఎగిరెగిరి పడుతంది. ఉప్పెనలా విరుచుకుపడి శత్రుమూకను తుదముట్టించి, తన తోటి పేద జనసమూహాన్ని కాపాడుకోవాల్నని.. ఇప్పటికీ తహతహలాడుతంది!
ఎక్కడో దూరాన వనంలా మొలిచిన తాటిచెట్లు.. కవాతు చేస్తున్న సైనిక సమూహంలా నిటారుగా నిలబడి, తమ కొమ్మల చేతులతో ఆ తెలంగాణ ముద్దుబిడ్డకు గౌరవవందనం చేస్తున్నయ్..
అప్పటివరకూ పిల్లల ఆటలు ఆడుకుంటూ తిరుగాడిన గాలి పొరలు ఒక్కసారిగా స్తంభించి..
“వీరుడా వందనం.. ధీరుడా నీకు కన్నీటి వందనం..” అంటూ శోకతప్త వదనంతో ఆర్తి గీతాలు పల్లవిస్తున్నట్టు.. ఆగకుండా వీస్తున్నయ్.
రెక్కలల్లార్చుకుంటూ గగన వీధి వైపు ఎగరబోతున్న పక్షుల గుంపు పయనమాపి, ఆ కరుణ రసాత్మక దృశ్యానికి కన్నీటి బొట్లు రాలుస్తూ అశ్రు
తర్పణం చేస్తున్నయ్.
మొండెం నుంచి వేరవుతూ నేలరాలాల్సిన అరుణారుణ రక్తపు చుక్కలు.. ఇంకా పౌరుషం తగ్గక, భగభగమని మండుతున్న నిప్పు కణికల్లా ఉవ్వెత్తున ఎగిసిపడుకుంట.. చరిత్ర పుటలపై అక్షరాకృతి దాల్చుతూ తమ వీరోచిత చేవ్రాలు లిఖించుకుంటున్నయ్..
అది.. ఓరుగల్లు ప్రాంతంలోని మారుమూల పల్లె.. ఖిలాషాపూర్ శివారు..
“నీయవ్వ! పీకల్దాక తాగి తాగి, తూలి తూలి పైసలియ్యకనే వోతున్నరు. పేదోల్లు గాదుర గా మొగల్ సైనికులు” కసిగా అన్నడు కొమురన్న.
పాపన్న గౌడ్ పోసిన కల్లు తాగి పైసలియ్యకుండనే ఎల్లిపోబోతున్న ఆ సైనికులు.. కొమురన్న మాటలకు ఒక్కసారిగా నల్లతాచుల్లా బుసలు కొట్టిండ్రు.
“గాళ్లెప్పుడు మన ఊరిదిక్కచ్చినా బేవుసయేదాక కల్లుదాగి, పైసలియ్యక పోవుడు పాత ముచ్చటేనాయె!”.. మల్లెవరో అన్నరు.
“ఊరూర్కు దిరిగి శిస్తు అసూలు జేస్కపోయే సైనికుల కాడ పైసల్ తీసుకునుడెందుకని పాపన్న మంచి మనసుతో పెద్దగ పట్టించుకుంటలేడు. గా పైసల్ గూడ ఖజానాకు సేరుడే గదా! ఎట్లయితేందనుకుంటుంటే.. గీల్లేమో బగ్గ దాగుడు, ఉత్తగనే ఎల్లిపోవుడు” రొయ్యల మీసాలు తిప్పుకుంట అన్నడు సోమయ్య.
గదే సమయంల గా పాపన్న కల్లు మండువకు ఓ పక్కన.. కల్లు తాగెతందుకు అచ్చినోళ్లకు యాపసెట్టు కింద కల్లు వోసుకుంట ఉండే మరో గౌండ్లాయన కొమురన్న గౌడ్కు కుతకుతలాడేది.
“తాటి సెట్టెక్కినమంటె పేణాల్ని గాలిల దీపం లెక్క వెట్టినట్టే నాయె! ఉత్తపున్నానికే ఒళ్లు సొలిగేంత కల్లుదాగి పైసలు ఎగ్గొట్టెటోల్లంటె! నీయవ్వ పెయ్యంత కారం బూసినట్టు మండుతది” అంటూ, ఎన్నోమల్కల తెలిసినోల్లకు, కల్లు తాగెతందుకు తనకాడికి అచ్చినోల్లకూ సెప్పెటోడు. గసువంటి బద్మాష్ ఆలోచన్లు ఎవలూ జేయకుంట సుదురాయించుకుంటరని ముందుజాగ్రత్త.
అప్పటికే గుర్రం ఎక్కబోతున్న సైనిక పటాలంలోని ఓ సైనికుడు.. గా మాటలిని, కళ్లెర్ర జేసుకుంట కొమురన్న మీదికి ఉరికచ్చిండు. కోపంతో ఊగిపోత కాలెత్తి తన్నబోయిండు.
గా హఠాత్ పరిణామాన్ని అక్కడున్నోళ్లందరూ బీరిపోయి సూత్తంటే.. ఒక సామాన్యుడిపై అకారణంగా సైనికుల ప్రతాపాన్ని ఊహించని పాపన్న గౌడ్ కోపోద్రిక్తుడవుతూ.. పాదరసంలా కదిలిండు. తన నడుముకు వేలాడుతున్న కల్లు గీసే కత్తిని లాగి, మిత్రుడిపై కాలెత్తిన సైనికుడి మెడపై పిడాత ఒక్క వేటేసి పడగొట్టిండు.
క్షణంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
మిగతా సైనికులు గుర్రాలు దిగచ్చి పాపన్నపై కలియబడ్డరు. కబురందుకొని ఆడికి ఉరికచ్చిండ్రు.. పాపన్న గౌడ్ దగ్గరి దోస్తులు. చెరువు కట్ట కాడ బట్టలుతుకుతున్న చాకలి సర్వన్న, ఊరి రచ్చబండ కాడ ఎవలకో గడ్డం గీస్తున్న మంగలి మాసన్న, పొలంల వరి నాటేస్తున్న జక్కుల పెరుమాండ్లు, ఇంటి ముందర పందిరి కింద కుమ్మరి సారెతో కుండలు ఆనుతున్న కుమ్మరి గోవిందు, పాత సీరెలతో బొంతలు కుడుతున్న దూదేకుల పీరు, ఏదో పనివడి పక్కూరుకు పోడానికి తయారవుతున్న కొత్వాల్ మీరు సాహెబ్..
సమయానికి చేరిన తన ఆరుగురు సోపతోళ్ల సాయంతో, తాటిచెట్లు ఎక్కి ఎక్కి ఆరు పలకలుగా తయారైన దేహదారుఢ్యంతో బలంగా ఉన్న పాపన్న.. అవలీలగ గాళ్లందరినీ మట్టి కరిపించిండు. పరిస్థితి తమకు ప్రతికూలంగ ఉండటంతో.. సైనికులు గుర్రాలను, శిస్తు మూటలను అక్కడే వదిలి ప్రాణభయంతో వెనుదిరిగి పారిపోయిండ్రు. గొడంత సేపటిదాక రణరంగాన్ని తలపించిన గా కల్లు మండవ పరిసర ప్రాంతమంతా.. ప్రశాంతతను సంతరించుకుంది.
ఈ సంఘటన పాపన్న గౌడ్ జీవితంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది.
రాచరికపు అరాచకానికి, అన్యాయానికి అతడు వినిపించిన తొలి ధిక్కార స్వరమిది.
ఆరుగురు దోస్తులు పాపన్న దగ్గర చేరిండ్రు.
“గీ పైసలు ఏం జేద్దాం పాపన్నా?” అడిగిండు దూదేకుల పీరు.
బదులివ్వలేదు పాపన్న. ఏవేవో ఆలోచనలు మదిలో సుడులు తిరుగుతున్నయి. ఓ సరికొత్త పథకం అతనిలో రూపుదిద్దుకుంటుంటే..
“ఏం జేసుడేంది? గియన్నీ ఎవల పైసలు? కాయకట్టం సేసుకునే బడుగు జనాలయ్. మనోల్లయే! మనసువంటి పేదోళ్లను పీడించి వసూలు జేసిన గీ ధనరాసులు ఆల్లకే దక్కాలె! గీ పైసల మూటలు ఎత్తుండ్రి.. ఊర్లెకు పోదాం పాండ్రి” అని పాపన్న సెప్పుడాలస్యం.. దవ దవ మనిషికి ఒకటి, రొండు మూటలు తీసుకొని పట్టుకున్నరు.
“మరి గీ గుర్రాల సంగతి?” సందేహం వెలిబుచ్చిండు కుమ్మరి గోవిందు.
“మీర్ సాహెబ్!” అని పిలిసి, అతని దిక్కు సూసుకుంట.. “జరంత గుర్రాల సంగతి నువ్వే సూస్కో.. కల్లు మండువల కట్టేసి రా! గుర్రాలను ఏం జేసుడో అటెన్క ఆలోసిద్దాం! మేం ఊర్లెకు వోయి పైసల్ పంచుతం” అనుకుంట దోస్తులతో కలిసి, తన ఊరి ప్రజలకు డబ్బులు పంచడానికి ఖిలాషాపూర్ ఊర్లెకు.. చిన్నపాటి సైనికదండులా కదిలిపోయిండు పాపన్న గౌడ్.
పడుకున్నడన్నట్టే గానీ, రాత్రంతా నిద్ర వట్టలేదు పాపన్నకు. సోపతోళ్లతోని గలిసి ప్రజలకు డబ్బులు పంచుతున్నప్పుడు ఆళ్ల కండ్లల్లో కనిపించిన కాంతులు.. ఇప్పటికీ తనను కలవర పెడుతున్నయి. చేసింది చిన్న పనే గాని, జనమంతా రొండు సేతులెత్తి పెట్టిన దండాలు.. అతడిని ఆలోచనలోకి నెట్టేశాయి. గీ బడుగుల కోసం తనేమీ చేయలేడా? పేదల ఆనందాన్ని శాశ్వతపర్చలేడా?
తెలతెలవారుతుండగా భగభగ మండే పిడుగులా.. ఫెళ్లున విరుచుకుపడే ఉప్పెనలా.. అతడి మనోపేటికలోకి దూసుకొచ్చిందొక ఆలోచన..
కప్పిన దుప్పటిని ఎగదన్ని.. మంచం మీది నుంచి కొదమసింగమోలె కిందికి దుమికిండు.
పొద్దు పొద్దుగాల్నె ఆగమాగం ఇంటికురికచ్చిన పాపన్నను జూసిన చాకలి సర్వన్న..
“పాపన్నా! గీ పొద్దున అచ్చినవేంది? ముందు గూకో..” అనుకుంటనే గుంజకాన్చి ఉన్న నులక మంచాన్ని వాల్చిండు.
“కూసొని ముచ్చట వెట్టేటందుకు రాలేదు గని, నువ్వు వోయి మన సోపతోల్లనందర్ని కల్లు మండువ కాడికి రమ్మని సెప్పిరా పో.. నేనాడుంట!” అనుకుంట లేసిండు పాపన్న.
ఎందుకని అడగలేదు చాకలి సర్వన్న.
‘పాపన్న ఏది సేసినా మంచి కోసమే సేత్తడు. మంది కోసమే సేత్తడు. గిది నాకు, నా సోపతోళ్లకే గాదు.. ఊరందరికీ తెలుసు’ అనుకుంట..
‘గట్లనే!’ అన్నట్టు తలూపిండు.
ఎన్కకు దిరిగి ఎళ్లిపోతున్న పాపన్న నడకల.. కొత్తగ ఏదో రాజసం ఉట్టి పడుతున్నట్టు మొదటిసారిగ కనిపించింది చాకలి సర్వన్న కండ్లకు.
“బలహీన వర్గాలకు ఆర్థికంగనే గాక, అన్నిట్ల గూడ సమంగ న్యాయం జరగాలె. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగనే మన పోరాటం సాగాలె. పొట్టకోసం, బట్టకోసం, బతుకుకోసం.. ప్రతి క్షణం పోరాటం సేసుకుంట సచ్చి బతుకుతున్న పేద జనం పక్షాన మనముండాలె. అన్యాయానికి అడ్డు గోడై.. పేదోళ్లకు అండగ నిలవాలె..” అంటూ తన ఆలోచనను, కార్యాచరణను తన ఎదురుంగ గూసున్న మిత్రులకు వెల్లడించిండు పాపన్న గౌడ్. బదులుగా సామూహికంగ తలలూపిండ్రంతా.
గీ ఆరుగురు దోస్తులే గాక ఊర్లోని మరికొంత మంది యువకులను కూడగట్టిండు. వాళ్లందరికీ యుద్ధ మెళుకువలు నేర్పిండు. మెరుపు దాడులు చేయడం, ఎదురు దాడి నుండి తప్పించుకోవడం లాంటి విద్యలపై శిక్షణనిచ్చి, తన అనుచరులతో మెరికల్లాంటి గెరిల్లా సైన్యాన్ని తయారు చేసిండు.
జనాన్ని పీడించి శిస్తులు వసూలు చేసుకొని సైనికులు వెనుదిరిగి పోయే తొవ్వల్నే తన సైన్యంతో మాటు వేసిండు పాపన్న.
“గా సైనికుల్ని ప్రాణభయంతో పారిపోయేటట్టు సేయాలె. వాళ్లు వదిలిపెట్టి వెళ్లిన గుర్రాలు, ధనరాసులు సొంతం చేసుకోవాలె”.. పాపన్న గౌడ్ మాటలింక పూర్తి కానేలేదు..
“ఆగాగు పాపన్న” అన్నడు కుమ్మరి గోవిందు.
దాంతో పాపన్నతోపాటు గెరిల్లా యువదళం గూడా నిశ్శబ్దమైపోయింది.
“ఇంటుండ్రా! గుర్రాల సప్పుడు. దరిదాపుల్లోకి అచ్చేసినట్టున్నరు” సెప్పిండు కుమ్మరి గోవిందు.
పాపన్న గౌడ్ ఎల్లమ్మ తల్లిని స్మరించుకొని..
“ఎవలకు యే జాగలు అనుకున్నమో, గాడనే ఉండుండ్రి. ఊ.. ఉరుకుండ్రి!”.. అంటూ తన సహచరులను మెరుపువేగంతో ఉరికిచ్చిండు.
పాపన్న గూడ ఆకలిగొన్న పులి లెక్క, ఎక్కువెట్టిన మొనదేలిన బాణం లెక్క, దేన్నైనా చీల్చి చెండాడటానికి నాటు తుపాకీలో సిద్ధంగా ఉండే గుండు లెక్క.. ఒక్క అంగలో తనకు కేటాయించిన చెట్టుదిక్కు పరుగెత్తిండు. తమ మెరుపు దాడికి ఎంచుకున్న ప్రాంతానికి సైనికులు చేరుకోంగనే తమ దాడి వాటం చూపెట్టింది పాపన్న దళం.
ఆకాశంలో ఉరుములు, మెరుపులు, మేఘాల పరుగుల లెక్క.. ఒక దిక్కు నుంచి బాణాలు, బడిసెలు. మల్లొక దిక్కు నుంచి విరిగిన చిన్న చిన్న చెట్ల కొమ్మలు, గుల్లేరుతోని రాళ్ల దెబ్బలు.. వశ పడకుండ, ఎర్క లేకుండ ఏడినుంచో మీద వడుతుంటె.. సైనికులు ఉక్కిరిబిక్కిరై పోయిండ్రు.
ఊహించని ఆ దాడికి బెదిరిపోయిన గుర్రాలు సైనికుల్ని కింద వడగొట్టినయ్! అసలు గీ పని ఎవలు సేత్తున్నరో? ఎందుకు సేత్తున్నరో? అర్థంగాక అయోమయానికి గురవుతూ భీతిల్లిన సైనికులు.. చెట్టుకొకల్లు పుట్టకొక్కల్ల లెక్క ‘బతుకు జీవుడా!’ అనుకుంట పారిపోయిండ్రు.
గిది మొదలు దాడులు ఆపలేదు పాపన్న. సైనికులు రకరకాలుగ వసూలు చేసిన శిస్తుల మూటలను, గెరిల్లా దాడుల్లో దొరికిన వారి ఆయుధాలను, గుర్రాలను తన పరం చేసుకున్నడు. ఆ ధనరాసులతో పక్క ఊర్లలోని పేదవారికి కూడా సహాయం చేయడంతో పాపన్న పేరు జనగాం ప్రాంతమంతా మార్మోగింది. చాలా గ్రామాల్లోని యువకులు.. పాపన్న సైన్యంలో చేరిండ్రు. అలా తొందర్లోనే మూడువేల మంది సైనికుల్ని తన బలగంగ తయారు చేసుకున్నడు. మర ఫిరంగుల నుంచి అశ్వబలం వరకూ అన్ని రకాల సైనిక సంపత్తినీ సమకూర్చుకున్నడు.
“బిడ్డా! సిన్నప్పుడే మీ అయ్య సచ్చిపోతే, నా గుండెల మీద పెంచిన. కడుపుల దాసుకుంట సాదిన. నా కండ్లల్ల నీళ్లు దెప్పించకు. కడుపుకోత వెట్టకు” తన కొడుకు గోల్కొండ రాజులపై తిరుగుబాటుకు తయారైతండని తెలిసిన తల్లి సర్వమ్మ, పాపన్న ముందు కన్నీళ్లు వెట్టుకున్నది.
“అమ్మా! దిగులు వడకు. పేద జనం కోసం మొదలువెట్టిన యజ్ఞమిది. గీ పోరాటంల సత్తినా.. నీ గుండెల్లో నీటి ఊటై ఊరుతనేమో గాని.. జనం బతుకులల్ల దీపమై వెలుగుత!”
“నాకు గవన్నీ తెల్వదు బిడ్డా! మీ నాయిన చేసి, ఇడిసి పెట్టి పోయిన కల్లు గీత పని సేసుకోక పరేషానెందుకురా అయ్యా!” అంటూ కొడుక్కు నచ్చజెప్పింది సర్వమ్మ.
“అమ్మా! ఇగ నా కోసమో, నా కుటుంబం కోసమో తాటిచెట్టు ఎక్క. లొట్టి వట్ట. తాబేదార్లు, జమీందారులు, జాగీర్దారులు చేసే దురాగతాలను అడ్డుకొని.. గోల్కొండ కోటపై బహుజనుల జెండా ఎగిరేసుడే నా కల” అంటూ.. తల్లి దగ్గర నుంచి ఎళ్లిపోయిండు పాపన్న.
తల్లితో చెప్పిన మాటల ప్రకారం.. తన సైన్య
బలగంతో మొఘల్ సైన్యంపై దాడి చేసి, ఖిలాషాపూర్ను రాజధానిగా చేసుకొని సర్వాయిపేటలో కొత్త రాజ్యాన్ని స్థాపించుకున్నడు.. సర్వాయి పాపన్న. ప్రజల కష్టనష్టాలు తెలిసిన పాపన్న రాజ్యంలో పన్నులేం లేవు. గందుకే.. ఆయినె ప్రజల మనిషి అయ్యిండు.
“మన యుద్ధవ్యూహం ఫలించింది. తాటికొండ, వేములకొండ మన పరమైనయ్” ఉద్వేగాన్ని అణుచుకుంటూ, ఆనందంతో కబురు చేరవేసిండు మంగలి మాసన్న.
ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ, దాదాపు ఇరవై కోటలను స్వాధీనంలోకి తెచ్చుకున్నడు పాపన్న. తన సైన్యాన్ని పన్నెండు వేలకు విస్తరించుకుని.. చివరకు గోల్కొండ కోటనే స్వాధీన పరుచుకున్నడు. ఏడు నెలలపాటు అధికారం చెలాయించిండు. గట్ల మొగలాయి సామ్రాజ్య విస్తరణను మొదలుకు మొదలు అడ్డుకున్న ఘనత.. తెలంగాణ తేజం, ధీశాలి సర్వాయి పాపన్నదే! తర్వాత భువనగిరి కోటను రాజధానిగ చేసుకుని ముప్పై ఏండ్లపాటు పరిపాలన సాగించిన యోధుడితడు.
“పాపన్నా! ఒక దుర్వార్త వేగుల ద్వారా తెలిసింది!”.. పాపన్నతోపాటు తన ప్రాణమిత్రులందరితో ఏర్పాటు చేసిన రహస్య సమావేశంలో చెప్పిండు చాకలి సర్వన్న.
“ప్రజల కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం పరిపాలిస్తున్న మనకు దుర్వార్తా?” అనుకుంట, బిగ్గరగా నవ్విండు పాపన్న.
ఆ నవ్వు.. యుద్ధానికి సిద్ధమై వచ్చిన శత్రువును బెదరగొట్టే.. సింహ గర్జనలా ఉంది.
“కొండ అద్దమందు కొంచమై కనపడుతదేమో గాని.. నిజంగ సూత్తె కొండకు, అద్దానికి పోలికేమైన ఉంటదా?” అన్నడు సర్వన్న.
“నువ్వు అందుకున్న కబర్ ఏందో సెప్పరాదు!”.. ఇసుక్కున్నడు దూదేకుల పీరు.
“మనం గెరిల్లా సైన్యంతో మొగల్ సైన్యంపై దాడికి దిగబోతున్నమని ఔరంగజేబుకు తెలిసిందట. తన సువిశాల సైన్యాన్ని మనపై ఎదురుదాడికి సిద్ధం చేస్తున్నడట!” చెప్పిండు సర్వన్న.
“గీ పనికి పూనుకోక పోయేదుండేదేమో! అనవసరంగ మనమే కయ్యానికి కాలు దువ్వినట్టయ్యింది”.. కుమ్మరి గోవిందు కలగజేసుకున్నడు.
“ఒక బహుజనుడు రాజ్యపాలన చేయడాన్ని అగ్రవర్ణాలు తట్టుకోలేక పోతున్నయ్ పాపన్నా! ఉన్నవి, లేనివి చెప్పి ఔరంగజేబును మనపై ఉసిగొలిపేలా చేసినట్టున్నరు. మనం యుద్ధానికి సిద్ధం కాకపోయినా.. ఎప్పుడో ఒకప్పుడు వీళ్ల మాటలు చెవినపడ్డ ఔరంగజేబు, మనపైకి సైన్యాన్ని తప్పక పంపించి ఉండేవాడు” తన అభిప్రాయాన్ని వెల్లడించిండు మంగలి మాసన్న.
“మునుపటి మీ అందరి ధైర్యసాహసాలు, పౌరుషాగ్ని ఎటువోయినయ్? గిట్ల పిరికోల్ల లెక్క మాట్లాడుతున్నరేంది? మీసం మెలిదిప్పి శూరుల లెక్క ముందుకు దూకుడే.. మల్లొక ఆలోచన చేయకుండ్రి! మన సైన్యాన్ని ఎప్పటి లెక్కనే సిద్ధం చేయుండ్రి!” ఆజ్ఞాపించిండు సర్వాయి పాపన్న.
మొగలాయి సైన్యంతో మూడు నెలలపాటు పాపన్న సైన్యం ఎదురొడ్డి పోరాడింది. హోరాహోరీగా జరిగిన ఆ యుద్ధంలో.. పాపన్న తన ప్రాణస్నేహితులను కోల్పోవాల్సి వచ్చింది.
మొదటిసారి అతడిలో ప్రవేశించిన నైరాశ్యం.. యుద్ధాన్ని విరమింపజేసి, అలుపెరుగని ఒక ధీరుడిని వెనుతిరిగి అజ్ఞాతంలోకి వెళ్లేలా చేసింది.
దీంతో తన ప్రాంతానికి తిరిగిపోయి, గౌడకులం వారు ఎక్కువగా ఉండే ప్రాంతంలో అజ్ఞాత జీవితం గడిపిండు పాపన్న.
ఒక వీరుడి వీరత్వం అణగారి పోదు.. అదునుకోసం పాపన్న ఎదురు చూస్తున్నడు. పాపన్న కోరుకుంటున్న అవకాశం చిక్కే సమయం రాబోతున్నది. ఔరంగజేబు మరణానంతరం దక్కను పాలకుడు కంబక్ష్ఖాన్ బలహీన పాలన.. పాపన్నలో సరికొత్త ఆశలు చిగురింప చేసింది. అతి తక్కువ సమయంలోనే తిరిగి తన సేనను సమాయత్తం చేసుకొని, వరంగల్ కోటపై దాడికి దిగిండు పాపన్న. కానీ, అతడి స్వప్నం నెరవేరలేదు. గా దాడిలో పాపన్న అనూహ్యంగ పట్టువడ్డడు. కానీ, రవ్వంత కూడా బెదరలేదు.
“గెలుపైనా, ఓటమైనా వీరుడెప్పుడూ వీర మరణమే పొందాలె. శత్రువు సేతిలో సచ్చి, చరిత్ర పుటల్లో ఒక మరకగా మిగిలే కన్నా.. గీ వీర తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డగా నా మరణ శాసనాన్ని నేనే రాసుకుంటున్న..” అంటూ పౌరుషాగ్ని కురిపించాడు. శత్రుసేన కత్తులు దూసి అతనిపై దుమకడానికి వెనుకాడుతున్నా.. ఆయన మాత్రం తన నడుముకున్న ఒరలోంచి మెరుపు వేగంతో బాకు తీసుకొని, తన గుండెల్లో పొడుచుకొని నేల కొరిగిండు. బహుజన కులాల బాగు కోసం తన జీవితాన్ని అర్పించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.. విగత జీవుడై, ఆర్తితో మౌనంగా విలపిస్తున్న నేలమ్మ తల్లి ఒడిని చేరిండు. అతడు మరణించిండని నిర్ధారించుకున్న శత్రువులు, తలను వేరు చేసి మొండాన్ని తీస్కపోయి.. ఏకంగ గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీసిండ్రు.
గోల్కొండ కోట గుమ్మానికి వేలాడుతున్న తల లేని మొండెం.. ఉడుకు నెత్తురు ఉరకలెత్తుతున్న మనిషి లెక్క ఎగిరెగిరి పడుతంది. ఉప్పెనలా విరుచుకుపడి శత్రుమూకను తుదముట్టించి, తన తోటి పేద జనసమూహాన్ని కాపాడుకోవాల్నని.. ఇప్పటికీ తహతహలాడుతంది!
ఒక వీరుడు ప్రాణత్యాగం చేసుకున్నడేమో గని.. జనంకోసం పోరాడే పౌరుషం.. తెలంగాణ గడ్డపై ఊపిరి పోసుకుంటూనే ఉంటుంది.
“వీరుడా వందనం..
ధీరుడా నీకు కన్నీటి వందనం..”
ఉద్వేగభరితమైన పాట పరిమళం.. తాజా శ్వాసలా ప్రతి తెలంగాణీయుడి గుండెలో
లయాత్మకంగ వినిపిస్తుంది.
ఎనుగంటి వేణుగోపాల్
ఎనుగంటి వేణుగోపాల్ స్వస్థలం జగిత్యాల. ఎంఏ (తెలుగు), ఎంఏ(సోషియాలజీ) చేశారు. సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. 1985 నుంచీ రచనలు చేస్తున్నారు. అవని, ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్, ఆముక్త మాల్యద, శాలివాహన… తదితర
నవలలు, 172 కథలు, 30 కవితలు, 300లకు పైగా పద్యాలు రాశారు. ఆధ్యాత్మికతతోపాటు వ్యక్తిత్వ వికాసం, సినిమాలు, సాహిత్యానికి సంబంధించిన 60కిపైగా వ్యాసాలు రచించారు. ‘వేణుగాన శతకం’ పేరుతో శతకాన్ని వెలువరించారు. అమ్మా నాన్న (పేరెంట్స్ కథలు), గోపాలం (హాస్య కథల సంపుటి), నవరసభరితం (నవరసాలపై కథలు), నాలుగు పుటలు (నాలుగు పార్శ్వాల కథలు), బుజ్జిగాడి బెంగ (పిల్లల సాంఘిక కథలు) ప్రజాదరణ పొందాయి. అమ్మ – నాన్న – పిల్లలు (పిల్లలపై వ్యాసాలు), విజయానికి అన్నీ మెట్లే (వ్యక్తిత్వ వికాస వ్యాసాలు) శీర్షికలతో వ్యాస సంపుటులను ప్రచురించారు. ఈయన రచనలతో వివిధ సంస్థలు 13 పుస్తకాలను ప్రచురించాయి. అనేక కథల పోటీల్లో బహుమతులను, పలు సాహితీ సంస్థల నుంచి సన్మానాలను పొందారు.
తన సైన్యాన్ని
పన్నెండు వేలకు విస్తరించుకుని.. చివరకు గోల్కొండ కోటనే స్వాధీన పరుచుకున్నడు.
ఏడు నెలలపాటు అధికారం చెలాయించిండు. గట్ల మొగలాయి సామ్రాజ్య విస్తరణను మొదలుకు మొదలు అడ్డుకున్న ఘనత.. తెలంగాణ తేజం, ధీశాలి సర్వాయి పాపన్నదే!
ఎనుగంటి ,వేణుగోపాల్
94402 36055