ఢిల్లీ : అక్రమాస్తుల కేసులో సంస్థకు చెందిన ఇప్పటికే సస్పెండ్కు గురైన ఉద్యోగితో పాటు అతని భార్యను సీబీఐ బుక్ చేసింది. సమీర్ కుమార్ సింగ్ సీబీఐలో స్టేనోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య షమా సింగ్ ఓ ప్రైవేటు సంస్థలో అసిస్టెంట్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తుంది. ఆగస్టు 2018 నుంచి జనవరి 2021 మధ్య కాలంలో వీరి ఆస్తిలో నమ్మశక్యకాని విధంగా 85 శాతం పెరుగుదల నమోదైందని సీబీఐ వెల్లడించింది.
మూడు కంపెనీలు బ్యాంక్ మోసాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్న కేసులో సమీర్ సింగ్తో పాటు డీఎస్పీలు ఆర్.కె.రిషి, ఆర్.కె. సంగ్వాన్, ఇన్స్పెక్టర్ కపిల్ ధన్కాడ్ లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై గడిచిన జనవరిలో సీబీఐ వీరిని బుక్ చేసింది.
వీరితో పాటు న్యాయవాదులు అరవింద్ కుమార్ గుప్తా, మనోహర్ మాలిక్, మన్దీప్ కౌర్ ధిల్లాన్, శ్రీ శ్యామ్ పుల్మ్ & బోర్డ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అదనపు డైరెక్టర్, ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు సుజయ్, ఉదయ్ దేశాయ్ కూడా ఈ కేసులో ఉన్నారు. సమీర్ సింగ్ అనేక కేసుల్లో దర్యాప్తు వివరాలను, రహస్య సమాచారాన్ని లంచం కోసం ఇద్దరు నిందితులైన డీఎస్పీలతో పంచుకున్నాడు. ఇందుకు లక్షల్లో చేతులు మారినట్లుగా ఆరోపణలు.