వింబుల్డన్లో మహిళా స్టార్ల నిష్క్రమణ కొనసాగింది. తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ కొట్టాలని కసితో ఉన్న మూడో సీడ్ ఎలీనా స్వితోలినా రెండో మెట్టుపైనే తడబడింది. 44వ ర్యాంకర్ లినెట్కు కనీస పోటీనివ్వలేక ఇంటిబాట పట్టింది. తల్లి అయ్యాక తొలిసారి వింబుల్డన్లో అడుగుపెట్టిన హైదరాబాదీ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్లో అద్భుత విజయం సాధించింది. ఆరో సీడ్ ద్వయాన్ని మట్టికరిపించి మీర్జా జోడీ రెండో రౌండ్లో అడుగుపెట్టింది.
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఉక్రెయిన్ స్టార్ ఎలీనా స్వితోలినాకు షాక్ ఎదురైంది. 44వ ర్యాంకర్ మాగ్డా లినెట్ (పోలాండ్)పై కనీసం రెండంకెల విన్నర్లు కూడా సాధించలేక మూడో సీడ్ ఎలీనా చతికిలపడింది. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో స్వితోలినా 3-6, 4-6 తో లినెట్ చేతిలో ఓడింది. గంటా 5 నిమిషాలు సాగిన మ్యాచ్లో 2019 సెమీఫైనలిస్టు ఎలీనా 8 విన్నర్లకే పరిమితమైతే.. లినెట్ 28 బాది, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. మరో మ్యాచ్లో ప్రపంచ టాప్ ర్యాంకర్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6-4, 6-3 తేడాతో అన్నా బన్కోవా (రష్యా)పై గంటన్నరలోనే గెలిచింది. బార్బోరా క్రెజికోవా 7-5, 6-4 తేడాతో ఆండ్రియా పెట్కోవిచ్పై గెలిచింది. అమెరికా 17 ఏండ్ల సంచలనం కోకో గాఫ్ 6-4, 6-3 తేడాతో ఎలీనా వెస్నినా (రష్యా)పై ఆడుతూపాడుతూ గెలిచి.. మూడో రౌండ్కు చేరింది. 15వ సీడ్ మారియా సకారికి షాక్ ఎదురవగా.. కరోలినా ముచోవా ముందడుగేసింది.
ఫెదరర్ సునాయాసంగా
పురుషుల సింగిల్స్లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ అలవోక విజయంతో ముందడుగేశాడు. రెండో రౌండ్లో ఆరో సీడ్ ఫెడ్ 7-6 (7/1), 6-1, 6-4 తేడాతో రిచర్డ్ గాస్కెట్ (ఫ్రాన్స్)ను చిత్తుచేశాడు. గంటా 51 నిమిషాల సాగిన మ్యాచ్లో మొత్తం 10 ఏస్లు బాదిన రోజర్ 50 విన్నర్లను కొట్టగా.. రిచర్డ్ 20 విన్నర్లే సాధించగలిగాడు. మరో మ్యాచ్లో డానిల్ మెద్వెదెవ్ (రష్యా) 6-4, 6-1, 6-2 తో అల్కరజ్ గార్ఫియా (స్పెయిన్)పై గెలిచాడు.
సూపర్ సానియా
నాలుగేండ్ల తర్వాత వింబుల్డన్ బరిలోకి దిగిన భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా అదరగొట్టింది. అమెరికా పార్ట్నర్ బెతనీ మాటెక్ సాండ్స్తో కలిసి ఆడిన సానియా మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ ద్వయానికి షాకిచ్చింది. సానియా జోడీ 7-5, 6-3తో డిసారే క్రాజెక్ – అలెక్సా
గురాచీ ద్వయంపై వరుస సెట్లలో గెలిచి, రెండో రౌండ్లో అడుగుపెట్టింది. గంటన్నర పాటు సాగిన మ్యాచ్లో సానియా జోడీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండు బ్రేక్ పాయింట్లు సాధించి.. ప్రత్యర్థికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. తొలి సెట్ ఆరంభంలో కాస్త హోరాహోరీగా సాగినా 34 ఏండ్ల సానియా విజృంభించింది. ఇక రెండో సెట్లో తిరుగులేని ఆధిపత్యం చూపిన మీర్జా ద్వయం ఓ దశలో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 3-1కి చేరడంతో పాటు ఆ తర్వాత కూడా దూసుకెళ్లింది. 2015 వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన సానియా.. తల్లి అయ్యాక ఈ టోర్నీలో ఆడడం ఇదే
తొలిసారి.
బోపన్న జోడీ ఓటమి
పురుషుల డబుల్స్లో భారత ద్వయం రోహన్ బోపన్న, దివిజ్ శరణ్కు ఆదిలోనే ఓటమి ఎదురైంది. తొలి రౌండ్లో బోపన్న జోడీ 6-7 (6/8), 4-6తో రోజర్ వాసెలిన్ – హెన్రీ కొంటినెన్ చేతిలో పరాజయం పాలైంది. కాగా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడంలో బోపన్న – దివిజ్ జోడీ విఫలమైంది.