హైదరాబాద్ : రాష్ర్టంలో నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. విత్తనాల లభ్యత, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డీజీపీ మహేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శితో పాటు వీడియో కాన్ఫరెన్సులో ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, ఎస్పీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. 450 గ్రాముల పత్తి ప్యాకెట్ గరిష్ట ధర రూ. 767 దాటొద్దు అని చెప్పారు. తెలంగాణ పత్తికి దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. కేంద్రం ఖరారు చేసిన ధరకు మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కంపెనీలు నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి. తిరస్కరించిన విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.
వానాకాలంలో గ్లైఫోసైట్ విక్రయాలపై నిషేధం విధించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. నిషేధితే గ్లైఫోసైట్ అమ్మితే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ వానాకాలం సాగు లక్ష్యం 70 లక్షలు ఎకరాలు అని మంత్రి తెలిపారు.