న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్ ప్రభావాన్ని ప్రపంచం చవిచూస్తోందని కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘిస్తే వైరస్పై పోరాటం నీరుకారుతుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం దేశ ప్రజలను అప్రమత్తం చేసింది. థర్డ్ వేవ్ ప్రపంచాన్ని తాకిందని, భారత్లో దాని ప్రభావం లేకుండా మనం జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. వైరస్ను కట్టడి చేసేందుకు కొవిడ్-19 ప్రొటోకాల్స్ను విధిగా అనుసరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
దేశమంతటా మార్కెట్లలో రద్దీ, సిమ్లా, మనాలి, ముస్సోరి వంటి హిల్ స్టేషన్లలో పర్యాటకుల సందడిని ప్రస్తావిస్తూ కరోనా నిబంధనలకు తిలోదకాలు ఇస్తే వైరస్పై ఇప్పటివరకూ మనం చేసిన పోరాటం వృధా అవుతుందని హెచ్చరించారు. థర్డ్ వేవ్ గురించి తాము మాట్లాడుతుంటే ప్రజలు దాన్ని వాతావరణ అప్డేట్గా తేలికగా తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జులైలో వెలుగుచూస్తున్న మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 73.4 శాతం కేసులు కేరళ, మహారాష్ట్ర , తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక నుంచే నమోదవుతున్నాయని చెప్పారు.
దేశంలో 55 జిల్లాల్లో ఇప్పటికీ పాజిటివిటీ రేటు పది శాతం పైగా ఉందని వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొవిడ్-19 పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని తెలిపారు. అసోం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ సహా పది రాష్ట్రాలకు కేంద్ర బృందాలు వెళ్లాయని అక్కడ కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై స్ధానిక అధికారులతో వారు సంప్రదింపులు జరుపుతారని ప్రభుత్వం పేర్కొంది.