దుబాయ్: షెడ్యూల్ ప్రకారమే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే రోజురోజుకు కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత్ను బ్రిటన్ ‘రెడ్ లిస్ట్’లో చేర్చింది. దీని ప్రకారం భారత్ నుంచి విమాన రాకపోకలపై నిషేధం ఉంటుంది. ఒకవేళ తమ దేశ పౌరులు బ్రిటన్కు తిరిగి వస్తే 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండేలా నిబంధనలను కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీ మంగళవారం స్పందిస్తూ ‘షెడ్యూల్ ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తామన్న నమ్మకముంది. కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ను సురక్షితంగా ఎలా నిర్వహించాలనే దానిపై ఆలోచిస్తున్నాం. దీనిపై బ్రిటన్ ప్రభుత్వంతో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నాం. రెడ్ లిస్ట్లో ఉన్న దేశాల జాబితాపై చర్చిస్తాం’ అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ‘జూన్ వర కు పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే ఏం చెప్పలేం. బ్రిటన్కు బయల్దేరే సమయానికి భారత్ రెడ్ లిస్టులో ఉండే అవకాశం లేదు. ఒకవేళ అప్పటికీ పరిస్థితులు ఇలాగే ఉంటే పది రోజుల క్వారంటైన్లో ఉండాల్సి వస్తుం ది’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.