యాంక్టన్(అమెరికా): ఆర్చరీ ప్రపంచ చాంపియన్షిప్లో తెలుగు యువ ఆర్చర్ వెన్నెం జ్యోతిసురేఖ వెండి వెలుగులు విరజిమ్మింది. శనివారం జరిగిన కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంటులో జ్యోతిసురేఖ, అభిషేక్ వర్మ ద్వయం 150-154 తేడాతో కొలంబియాకు చెందిన సారా లోపెజ్, డానియల్ మునోజ్ చేతిలో ఓటమిపాలైంది. మహిళల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో జ్యోతి సురేఖ, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జార్తో కూడిన భారత త్రయం 224-229 తేడాతో సారా లోపెజ్, అలెగ్జాండ్రా ఉస్కానియో, నోరా వాల్దెజ్(కొలంబియా) చేతిలో ఓడి రజత పతకం దక్కించుకుంది. గత పది ప్రపంచ చాంపియన్షిప్ టోర్నీల్లో భారత ఆర్చర్లు వేర్వేరు విభాగాల్లో ఫైనల్కు చేరినా.. పసిడి పతకం కైవసం చేసుకోలేకపోయారు.