యాంక్టన్ (అమెరికా): ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ దుమ్మురేపింది. అమెరికాలో జరుగుతున్న మెగాటోర్నీలో మూడు రజత పతకాలు కైవసం చేసుకొని అదుర్స్ అనిపించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్గా రికార్డుల్లోకెక్కింది. ‘ప్రపంచ చాంపియన్షిప్లో మూడు రజతాలు చేజిక్కించుకోవడం సంతోషంగా ఉంది. ఒలింపిక్స్లో కాంపౌండ్ విభాగం లేకపోవడం కాస్త ఆసంతృప్తికరమైన విషయమే అయినా.. ప్రపంచ వేదికలపై నిలకడగా రాణిస్తుండటంతో ఆనందంగా ఉన్నా. ప్రతిభకు తగ్గ గుర్తింపు దక్కనపుడు చాలా బాధగా ఉంటుంది’ అని పోటీల అనంతరం సురేఖ చెప్పింది. శనివారం జరిగిన కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సురేఖ 144-146 పాయింట్ల తేడాతో సారా లోపెజ్ (కొలంబియా) చేతిలో ఓడింది.
అంతకుముందు మహిళల టీమ్ విభాగం ఫైనల్లో సురేఖ, ముస్కాన్, ప్రియతో కూడిన భారత జట్టు 224-229 పాయింట్ల తేడాతో కొలంబియా జట్టు చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచింది. మిక్స్డ్ ఫైనల్లో జ్యోతి సురేఖ-అభిషేక్ వర్మ జంట 150-154తో సారా లోపెజ్-డానియల్ (కొలంబియా) చేతిలో ఓడి రజతం కైవసం చేసుకుంది. 2017లో టీమ్ విభాగంలో రజతం నెగ్గిన సురేఖ.. 2019లో టీమ్ ఈవెంట్తో పాటు వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించింది. తాజాగా మూడు రజతాలు నెగ్గడంతో ప్రపంచ చాంపియన్షిప్లో ఆమె పతకాల సంఖ్య ఆరుకు చేరింది.