భారీ అంచనాల మధ్య సెమీఫైనల్ బరిలో దిగిన భారత మహిళల హాకీ జట్టుకు పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన సెమీస్లో రాణి రాంపాల్ బృందం 1-2తో ప్రపంచ రెండో ర్యాంకర్ అర్జెంటీనా చేతిలో ఓడింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ (2వ నిమిషంలో) ఓ గోల్ కొట్టగా.. అర్జెంటీనా తరఫున మారియా (18వ, 36వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచిన గుర్జీత్ కౌర్ భారత్కు ఆధిక్యాన్ని కట్టబెట్టగా.. తొలి క్వార్టర్లో మరో గోల్ నమోదు కాలేదు. రెండో క్వార్టర్లో అర్జెంటీనా తరఫున మారియా గోల్తో స్కోర్లు సమం కాగా.. అక్కడి నుంచి ఇరు జట్లు మరో గోల్ చేసేందుకు ప్రయత్నాలు తీవ్రం చేశాయి. మూడో క్వార్టర్లో తీవ్ర ఉత్కంఠ మధ్య పెనాల్టీ కార్నర్ అవకాశం దక్కించుకున్న మారియా దాన్ని గోల్గా మలచడంతో భారత్ వెనుకంజలో పడింది. ఇదే ఆధిక్యాన్ని కొనసాగించిన అర్జెంటీనా మ్యాచ్ను ముగించింది. క్వార్టర్స్లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించిన మన అమ్మాయిలు అర్జెంటీనాతో పోరులోనూ చక్కటి ప్రదర్శన కనబర్చారు. అర్జెంటీనా, నెదర్లాండ్స్ మధ్య ఫైనల్ జరుగనుండగా.. కాంస్య పతకం కోసం శుక్రవారం గ్రేట్ బ్రిటన్తో రాణి రాంపాల్ బృందం అమీతుమీ తేల్చుకోనుంది.