హోరాహోరీగా సాగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ జయభేరి మోగించింది. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ‘ఒంటికాలి’తో పార్టీకి ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందించారు. నందిగ్రామ్లో తాను స్వల్ప తేడాతో ఓటమిపాలైనా.. తన పార్టీ మాత్రం గత అసెంబ్లీ ఫలితాలను పునరావృతం చేసింది. ఎన్నికల్లో అటు బీజేపీ, ఇటు తృణమూల్ విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. కాలికి గాయం కావడంతో మమత వీల్చెయిర్లో కూర్చొనే ప్రచారం చేపట్టారు. అటు బీజేపీ తరఫున ప్రధాని మోదీ సహా ఆ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులంతా
కదిలివచ్చారు.
తృణమూల్ కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన సమయంలో సువేందు అధికారి విసిరిన సవాల్ను స్వీకరించి.. నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగాలని మమత తీసుకున్న నిర్ణయం ఆమెకు కలసివచ్చింది. తన పోరాట పటిమను ఇది జనానికి తెలియజేసింది. స్థానికంగా సువేందుకు బలమైన పట్టు ఉన్నదని తెలిసినా ఆమె రిస్క్ తీసుకోవడానికి వెనుకాడలేదు. మరోవైపు, బెంగాల్లో మమతకు ఎదురు నిలిచే బలమైన సీఎం అభ్యర్థి ఎవరూ ప్రతిపక్షంలో లేరు. ఇది కూడా తృణమూల్కు అనుకూలాంశం. అలాగే ప్రచారంలో గాయపడినా వీల్చెయిర్లో కూర్చొనే ఆమె ప్రచారం నిర్వహించారు. ఎన్నికల స్టంట్ అంటూ ప్రత్యర్థి పార్టీలు చేసిన విమర్శలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు.
హిందువుల ఓట్లను ఏకీకరణ (పోలరైజ్) చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలకు మమత సమర్థంగా చెక్ పెట్టారు. తాను కూడా హిందువునేనని ప్రకటించారు. బీజేపీలో ఉన్నవారెవరూ తనకంటే బాగా శ్లోకాలు చదువలేరని పలుమార్లు చెప్పారు. ప్రచారం సందర్భంగా దేవాలయాలను సందర్శించారు. అదే సమయంలో హిందువులు, ముస్లింల మధ్య ఆమె సమన్వయం సాధించారు. 2012 నుంచి ఇమామ్లకు నెలకు 2500, మ్యూజిన్స్కు నెలకు 1000 ప్రభుత్వం అందిస్తున్నది. బీజేపీ దూకుడు నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ నుంచి బ్రాహ్మణ పూజారులకు కూడా నెలకు రూ.1000 ఇస్తున్నది. అలాగే వారికి 8000 ఇండ్లు ఉచితంగా నిర్మిస్తామని ప్రకటించింది. జై బంగ్లా పేరిట తెచ్చిన కొత్త పథకంలో భాగంగా క్రైస్తవ, జైన, బౌద్ధ తదితర మతాలకు చెందిన మతాధికారులకు కూడా ఆర్థిక సాయం అందించనున్నట్టు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది.
మమత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా తృణమూల్కు కలిసివచ్చాయి. 2013 నుంచి పేద బాలికలకు కన్యశ్రీ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నారు. రూపాశ్రీ పథకం కింద పేదల వివాహానికి రూ.25వేలు అందిస్తున్నారు. రూ.5లకే భోజనం అందిస్తామని మమత ప్రకటించారు.
తాను బెంగాల్ పుత్రికనని, మోదీ-అమిత్షా బయటి వ్యక్తులని మమత చేసిన ప్రచారం తృణమూల్కు లాభించింది. బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలు ‘బయటివారికి’ తెలియవని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తృణమూల్ విజయం సాధించింది.
దేశాన్ని బెంగాల్ కాపాడింది
రాష్ట్ర ప్రజలు బీజేపీ అహంకారాన్ని దెబ్బతీశారు: మమత
కోల్కతా, మే 2: ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు (టీఎంసీ) భారీ విజయాన్ని అందించటం ద్వారా ఈ రోజున భారతదేశాన్ని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కాపాడిందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. బెంగాల్ ప్రజలు బీజేపీ అహంకారంపై దెబ్బకొట్టారని అన్నారు. ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. కరోనా వ్యాపిస్తున్న కారణంగా విజయోత్సవాలు నిర్వహించవద్దని టీఎంసీ కార్యకర్తలను కోరారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా సాదాసీదాగా నిర్వహిస్తామని తెలిపారు. మత కాలి గాయం నుంచి పూర్తిగా కోలుకొన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో నిలబడే మాట్లాడారు. వాగ్దానం చేసినట్టుగానే బెంగాల్ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాలు వేస్తామని చెప్పారు. కేంద్రం ప్రతీ భారతీయుడికి ఉచితంగా టీకా అందించాలని డిమాండ్ చేశారు.
మమత, విజయన్, స్టాలిన్కు మోదీ అభినందనలు
న్యూఢిల్లీ, మే 2: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినందుకు ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, కరోనాపై యుద్ధంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కేరళ సీఎం పినరాయి విజయన్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్కు కూడా మోదీ అభినందనలు తెలిపారు. అస్సాం ప్రజలు ఎన్డీఏ అభివృద్ధి ఎజెండాకు తిరిగి పట్టం కట్టారన్నారు.
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన పలు పార్టీల నేతలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమబెంగాల్లో హ్యాట్రిక్ సాధించిన టీఎంసీ అధినేత్రి మమతకు, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్కు, కేరళలో రాష్ట్ర సీఎం పినరాయి విజయన్, అస్సాం బీజేపీ నేత శర్భానంద సోనోవాల్కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
మమత నందిగ్రామ్లో సువేందు చేతిలో ఓడిపోయారు. అంతకుముందు ఫలితాల ప్రకటనలో గందరగోళం ఏర్పడింది. నందిగ్రామ్ ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు జరిగినట్టు తన వద్ద సమాచారం ఉందని, దీనిపై అవసరమైతే కోర్టుకు వెళ్తానని మమత విలేకరులతో చెప్పారు. అనంతరం ప్రజల తీర్పును తాను గౌరవిస్తానని అన్నారు. ‘నందిగ్రామ్లో ఏ ఫలితం వచ్చినా సరే స్వీకరిస్తాను. ఇదొక ఆట’ అని అన్నారు.
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): పశ్చిమబెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం ఒక ఆనవాయితీగా వస్తున్నది. 1950 నుంచి 1967 వరుకు వరుసగా 17 ఏండ్లపాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీసీ రాయ్, ప్రఫుల్ల చంద్ర సేన్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. తర్వాత 1977 నుంచి 2011 వరకు 34 ఏండ్లపాటు సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ఫ్రంట్ అధికారంలో కొనసాగింది. జ్యోతిబసు, బుద్ధదేవ్ భట్టాచార్య సీఎంలుగా పనిచేశారు. అనంతరం 2011 నుంచి రెండుసార్లు మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కు పట్టం కట్టిన బెంగాలీలు.. మళ్లీ ఇప్పుడు మూడోసారి కూడా దీదీకే అధికారం అప్పగించారు. అంటే, మమత వరుసగా 15 ఏండ్లపాటు సీఎంగా ఉండనున్నారు. గతంలో జ్యోతిబసును కూడా బెంగాల్ ప్రజలు ఇలాగే ఆదరించారు. మమత మరో జ్యోతిబసులా ఎదిగే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు.
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): బెంగాల్లో తన విజయం దేశానికి ఎంతో అవసరమని, బీజేపీని ఎదుర్కోవడానికి, దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకతాటిపైకి తేవడానికి టీఎంసీ గెలువాల్సిందేనని ఎన్నికల ప్రచారం సందర్భంగా మమతాబెనర్జీ చెప్పారు. ఆమె కోరుకున్నట్టే తృణమూల్ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మమత వైపు మళ్లింది. మోదీ-అమిత్షాకు వ్యతిరేకంగా గతంలో ప్రాంతీయ పార్టీలను కూడగట్టటానికి ప్రయత్నించిన మమత.. మళ్లీ అలాంటి ప్రయత్నాలను ప్రారంభించే అవకాశముందని, థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ఊపందుకోవచ్చని రాజకీయ నిపుణులు చెప్తున్నారు.