చేపలు తింటే ఆరోగ్యం
చేపల్లో కొర్రమీను రుచి స్పెషల్
ఆలేరు టౌన్, జూన్ 7: సంపూర్ణ ఆరోగ్యానికి చేపలు ఎంతో మేలు చేస్తాయి. మాంసాహారం లో చేపలు అంటే స్పెషల్. చేపలు తీసుకుంటే ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. నేటి నుం చి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. రోహిణి, కృత్తిక కార్తెల్లో ఎండల్లో అల్లాడిపోయిన వారికి మృగశిరకార్తె పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. విపరీతమైన ఎండల నుంచి చల్లని వాతావరణంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శరీరంలో వేడి తగ్గకుండా ఉండేందుకు చాలామంది వేడి చేసే పదార్థాలు చేపలు, కోడి మాంసాన్ని మృగశిర కార్తె ఆరంభం రోజున తింటారు. శాకాహారులు మాత్రం కార్తె మొదటి రోజున ఇంగువ తీసుకుంటారు. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయని అంటారు పెద్దలు. అందుకు తగ్గట్టుగానే ఎండలు మండిపోయాయి. మృగశిర కార్తె రాక తో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. మృగశిర కార్తెతో చేపలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ రోజున చేపలు తినాలనే సెంటిమెంట్ కూడా ఉంది. చేపల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటిలో ఉండే అనేక ప్రొటీన్లు, విటమిన్లు ఆరోగ్యా న్ని పెంపొందిస్తాయి. చేపల్లో ప్రొటీన్లు, ఒమే గా-3, విటమిన్-డి పుష్కలంగా ఉంటాయి. కంటిచూపు పెంచడంతోపాటు గుండె జబ్బులను నివారిస్తుంది. కలుషిత నీటిలో పెరిగిన చేపలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. నదులు, మంచినీటి చెరువుల్లో పెరిగే చేపలను మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
రాష్ట్ర చేపగా కొర్రమీను..
తెలంగాణ రాష్ట్ర చేపగా కొర్రమీను గుర్తింపు పొందింది. 2016లో కొర్రమీనులో ఔషధ గుణాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించి పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖలు రాష్ట్ర చేప హోదాను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. కొర్రమీనును బొమ్మెలు, కొర్రమట్ట అని కూడా పిలుస్తారు. చేపల్లో వీటికే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రుచికరంగా ఉండటంతో ధర కూడా అధికంగా ఉంటుంది. ఈ చేపలు ప్రస్తుతం కేజీకి రూ. 400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. చేప ల్లో రవ్వలు, బంగారుతీగ, జెల్లలు, చందమామలు, పరకలు తదితర రకాలు ఉంటాయి. మృగశిర కార్తె రోజు చేపల ధరలు పెరిగినా కొనేందుకు వెనుకాడరు. కొర్రమీను చేప రుచికరంగా ఉండటంతోపాటు ముండ్లు తక్కువగా ఉంటా యి. చేపల్లో లభ్యమయ్యే ఒమేగా-3తో పిల్లల పెరుగుదల బాగుంటుందని వైద్యు లు చెబుతున్నారు. చేపల కాలేయంలో ఉండే విటమిన్-డీతో ఎముకలు దృఢంగా అవుతాయి. చేపల కూ ర తేలికగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా చేపలను తినడం వల్ల పెద్ద పేగుకు ముప్పు తప్పుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఉప్పు నీటిలో కడగాలి..
మంచినీటిలో పెరిగిన చేపలనే కొనాలి. బతికి ఉన్న చేపలను ఎంపిక చేసుకోవాలి. బతికి ఉన్న చేపలను ఒక పాత్రలో వేసి కొద్దిగా ఉప్పు వేయా లి. సరిగ్గా 15 నిమిషాల తర్వాత వాటిని ఆ నీటి నుంచి తొలగించి శుభ్రం చేయాలి. ఇలా చేయ డం వల్ల చేపలో జీవించి ఉన్న క్రీములు, వాటికి పట్టుకున్న వ్యర్థ పదార్థాలను ఉప్పు నిర్మూలిస్తుంది. చేపలు దుర్వాసన వస్తే కొనవద్దు. చేపలను కొనేటప్పుడు చిన్నగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. అలాగే చేపలపై ఉండే పొలుసులను పూర్తిగా తొలగించాలి. ఒకటికి రెండుసార్లు కడగాలి. నదులతోపాటు మంచినీటి చెరువుల్లో పెరిగే చేపలనే తినాలి. చేపలతో మత్స్యకారులకు పెద్దఎత్తున ఉపాధి కలుగుతుంది. ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను అందించడంతోపాటు, వారికి సబ్సిడీపై వాహనాలను కూడా అందజేస్తున్నది.