బన్సీలాల్పేట/సుల్తాన్బజార్, జూన్ 6: వృద్ధ్దాశ్రమాల్లో ఉంటున్న వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. ఆదివారం బన్సీలాల్ పేట్లోని వృద్ధాప్య గృ హాన్ని సందర్శించిన సీఎస్ సోమేశ్కుమార్ మొబైల్ వ్యాన్లకు పచ్చ జండా ఊపి వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వృద్ధులు, వికలాంగులకు టీకాలు వేసేందుకు ఆదివారం నుంచి 24 మొబైల్ వ్యాన్లను వినియోగిస్తున్నామని అన్నారు. ఈ మొబైల్ వ్యాన్లో డాక్టర్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం ఉంటారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 19 ఉచిత డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. థర్డ్వేవ్ను సమర్ధవంతంగా ఎదురోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వైద్యశాలల్లో మౌలిక వసతులు, మానవ వనరుల బలోపేతం, సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేయడం ద్వారా కరోనాను అరికడుతున్నామని అన్నారు.
కోఠిలోని యూనియన్ (ఆంధ్ర )బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని ఆదివారం సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు. బ్యాంక్ కార్యాలయంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినందుకు జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య, ఇతర బ్యాంకు అధికారులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్ రోస్, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ వెంకటి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ప్రేరణ, డాక్టర్ రాజేశ్, డాక్టర్ సాయికిరణ్, ఎఫ్ఎంజీవో మేనేజర్ ప్రమోద్రెడ్డి, రీజినల్ హెడ్లు ఎస్.శ్రీనివాస్, భాస్కర్రావు, శ్రీధర్, ఏజీఎం రజినీకాంత్, వీఎస్ఆర్ మూర్తి, శ్రీలత, సతీశ్ పాల్గొన్నారు.