భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్కు బయల్దేరి వెళ్లనుంది. శ్రీలంక పర్యటనకు కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటం లేదు. లంక పర్యటనకు పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతోనే మరో టీమ్ను ఎంపిక చేసి లంకకు పంపనున్నారు.
ఈ టూర్లో టీమ్ఇండియాకు నాయకత్వం వహించే ఆటగాడు ఎవరనేదానిపై సోషల్మీడియాలో చర్చ జరుగుతోంది. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ లేదా శ్రేయస్ అయ్యర్ పేర్లు వినిపిస్తున్నాయి.
ధావన్ ఫామ్లో ఉండటంతో అతనికే జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. గతంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును నడిపించిన అనుభవం ధావన్కు ఉంది. గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకొని కోలుకుంటున్న అయ్యర్ అప్పటిలోగా ఫిట్నెస్ సాధిస్తాడో లేదో తెలియదు.
లంకతో పరిమిత ఓవర్ల సిరీస్కు ధావన్, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, దేవదత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, చాహల్, రాహుల్ తెవాటియా, మనీశ్ పాండే, పృథ్వీ షా వంటి ఆటగాళ్లతో పాటు ఐపీఎల్లో రాణించిన కుర్రాళ్లకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.