ముంబై: ఇండియన్ టీమ్ ( Team India ) టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు అనూహ్యంగా ప్రకటించిన విరాట్ కోహ్లి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. నిజానికి అంతకు మూడు రోజుల ముందే టీ20 వరల్డ్కప్ తర్వాత విరాట్ వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని వార్తలు వచ్చినా బీసీసీఐ ఖండించింది. కానీ రెండు రోజులు తిరిగే సరికి సోషల్ మీడియా వేదికగా తాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లియే చెప్పాడు. ఇక ఇప్పుడు చర్చ తర్వాతి కెప్టెన్ ఎవరు అన్నదానిపై నడుస్తోంది. ఈ రేసులో ముందు వరుసలో ఉన్నది 34 ఏళ్ల రోహిత్ శర్మనే. కోహ్లి తప్పుకుంటాడని వార్తలు వచ్చిన సమయంలోనూ రోహిత్ పేరే వినిపించింది.
అయితే లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం మరో ప్లేయర్ పేరు చెబుతున్నాడు. 34 ఏళ్ల రోహిత్కు ఇన్స్టాంట్ క్రికెట్ బాధ్యతలు అప్పగించే బదులు.. అతని కంటే యువకుడైన కేఎల్ రాహుల్ బెటరని సన్నీ స్పష్టం చేశాడు. స్పోర్ట్స్ తక్ చానెల్తో గవాస్కర్ మాట్లాడుతూ.. మీరు కొత్త కెప్టెన్ గురించి చూస్తుంటే కేఎల్ రాహుల్ వైపే చూడాలన్నది నా ఆలోచన. అతని ప్రదర్శన చాలా బాగుంది. ఇంగ్లండ్లోనూ చాలా బాగా ఆడాడు. ఐపీఎల్, 50 ఓవర్ల క్రికెట్లోనూ అద్భుతంగా ఆడుతున్నాడు. ఐపీఎల్లోనూ కెప్టెన్సీ భారం తనపై లేకుండా స్వేచ్ఛగా ఆడుతున్నాడు అని అన్నాడు.
29 ఏళ్ల కేఎల్ రాహుల్ ఈ మధ్య కాలంలో అన్ని ఫార్మాట్లలోనూ గొప్పగా రాణిస్తున్నాడు. 2014లో ఆస్ట్రేలియాపై బాక్సింగ్ డే టెస్ట్లో అరంగేట్రం చేసిన రాహుల్.. ఇప్పటి వరకూ టీమిండియా తరఫున 40 టెస్టులు, 38 వన్డేలు, 48 టీ20లు ఆడాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా కూడా నిలకడగా రాణిస్తున్నాడు.