Olympics | నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఆటల పండుగ ఒలింపిక్స్. ఈ క్రీడా పండుగలో ఆడి గెలవాలని ప్రతి అథ్లెట్ కలలుకంటుంటాడు. ఈ విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు ప్రపంచ దేశాలు పోటీపడుతుంటాయి. ఈ వేడుకలకు యూరప్లోని చిన్న చిన్న దేశాల్లోని నగరాలు ఆతిథ్యమిచ్చాయి. ఇప్పటివరకు అత్యధికసార్లు అమెరికాలో ఒలింపిక్స్ నిర్వహించారు. లండన్, లాస్ఏంజిల్స్, పారిస్ వంటి నగరాల్లో అయితే మూడేసి సార్లు సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి ఆసియా దేశాలు కూడా ఈ వేడుకలకు ఆతిథ్యమిచ్చాయి. కానీ భారత్కు మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం రాలేదు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ వంటి అంతర్జాతీయ క్రీడాపోటీలు నిర్వహించినప్పటికీ.. ఒలింపిక్స్ నిర్వహించేందుకు మాత్రం భారత్కు అవకాశం రాలేదు. కనీసం ఒలింపిక్స్ నిర్వహణ కోసం పోటీ కూడా పడలేదు. మరో పదేళ్లు అంటే.. 2032 వరకు కూడా భారత్లో ఒలింపిక్స్ నిర్వహించే ఛాన్స్ కూడా లేదు. ఇంతకీ ఒలింపిక్ వేడుకలకు ఆతిథ్య నగరాలను ఎలా ఎంపిక చేస్తారు? వేటిని పరిగణనలోకి తీసుకుంటారు? ఒకసారి చూద్దాం..
ప్రస్తుతం సమ్మర్ ఒలింపిక్స్ టోక్యోలో జరుగుతున్నాయి. వాస్తవానికి 2020లో జరగాల్సిన ఈ క్రీడా పోటీలు కరోనా కారణంగా ఆలస్యంగా జరుగుతున్నాయి. ఇక 2024లో ఫ్రాన్స్లోని పారిస్లో, 2028లో అమెరికాలోని లాస్ఏంజిల్స్లో 2032 ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరగనున్నాయి. ఇక వింటర్ ఒలింపిక్స్ విషయానికొస్తే 2022లో మన పొరుగు దేశమైన చైనాలోని బీజింగ్లో, 2026లో ఇటలీలోని మిలాన్లో నిర్వహించేందుకు వేదికలు నిర్ణయించేశారు. దీంతో 2032 వరకు కూడా భారత్లో ఒలింపిక్స్ నిర్వహించే ఛాన్స్ లేకుండా పోయింది. ఒలింపిక్స్ జరిగే సంవత్సరానికి కనీసం ఏడేళ్ల ముందే ఆతిథ్య నగరాన్ని నిర్ణయిస్తారు. ఈ వేదికలను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ( ఐవోసీ ) ఎంపిక చేస్తుంది. 2032 ఒలింపిక్స్ నిర్వహించే నగరాన్ని ఇటీవల ఐవోసీ ప్రకటించేసింది. ఇక 2024, 2028 ఒలింపిక్స్ ఆతిథ్య నగరాలను 2017లోనే నిర్ణయించారు. అయితే ఈ నగరాలను ఎంపిక చేసేందుకు ముందు.. అక్కడ ఉన్న క్రీడా సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న స్టేడియాలు, అథ్లెట్లు ప్రాక్టీస్ చేయడానికి ఇతర స్టేడియాలు అందుబాటులో ఉన్నది లేనిదీ చూస్తారు. అలాగే క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు వచ్చే అథ్లెట్లు, వారి సిబ్బంది, ఆటలు చూసేందుకు వచ్చే పర్యాటకులు, జర్నలిస్టులకు వసతీ, ఇతర సదుపాయాల కల్పన, రవాణా వంటి సదుపాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ఒలింపిక్స్ నిర్వహణకు పోటీ పడే నగరం.. ముందుగా ఐవోసీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం 1.5లక్షల డాలర్ల ఫీజు చెల్లించాలి. రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకున్న నగరాలు తమ వద్ద సదుపాయాల గురించి నివేదిక ఇవ్వాలి. విజన్, గేమ్స్ కాన్సెప్ట్, లెగసీ; గవర్నెన్స్, లీగల్ అండ్ వెన్యూ ఫండింగ్; గేమ్స్ డెలివరీ, ఎక్స్పీరియన్స్ అండ్ వెన్యూ లెగసీ ఈ మూడు అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన ఐవోసీ ఎవాల్యూషన్ కమిటీ.. తుది జాబితాను రూపొందించి ఐవోసీ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు సమర్పిస్తుంది. ఆ జాబితాలో ఉన్న నగరాల్లో నుంచి రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఆతిథ్య నగరాన్ని ఎంపిక చేస్తారు. ఈ ఓటింగ్లో ఐవోసీ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ఐవోసీ గౌరవ సభ్యులు, సస్పెండైన సభ్యులకు ఓటింగ్ హక్కు ఉండదు. ప్రస్తుతం ఐవోసీలో 102 మంది సభ్యులు ఉన్నారు. భారత్ నుంచి నీతా అంబానీ సభ్యురాలిగా ఉన్నారు.
ఒలింపిక్స్ నిర్వహణకు ఖర్చు కూడా భారీగానే అవుతుంది. అయితే ఆతిథ్య నగరంలో ఉన్న మౌలిక సదుపాయాలను బట్టి ఆ ఖర్చులో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్తగా మౌలిక సదుపాయాలను నిర్మించాల్సిన అవసరం ఉన్న చోట మాత్రం ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ఈ ఖర్చు మొత్తం ఆతిథ్య నగరాలే భరించాల్సిన అవసరం లేదు. ఐవోసీ కూడా కాస్త ఆర్థిక మద్దతు అందిస్తుంది. 2016 సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహణ కోసం బ్రెజిల్లోని రియోడెజినారో నగరానికి 153.1 కోట్ల డాలర్లను ఐవోసీ ఇచ్చింది. అంతకుముందు 2012లో లండన్కు 137.4 కోట్ల డాలర్లు, 2008లో బీజింగ్కు 125 కోట్ల డాలర్లు, 2004లో ఏథెన్స్కు 96.5 కోట్ల డాలర్ల నిధులు అందించింది.
భారత్లో ఇప్పటివరకు ఎన్నో అంతర్జాతీయ క్రీడాపోటీలు జరిగాయి. క్రికెట్ వరల్డ్కప్లు, హాకీ వరల్డ్ కప్లు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు వంటి అంతర్జాతీయ పోటీలు ఎన్నింటినో భారత్ సమర్థంగా నిర్వహించింది. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఒలింపిక్ గేమ్స్ నిర్వహించలేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఒలింపిక్ నిర్వహణకు భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో పాటు.. క్రీడాకారులు, అనుబంధ రంగాల వారికి భద్రత కల్పించడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒలింపిక్స్ వేడుకలు నిర్వహణ కోసం పోటీపడే స్థాయిలో భారత్ ఇంకా సిద్ధం కాలేదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ( ఐవోసీ ) అధికారులే గతంలో వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ కింది విషయాల్లో భారత్ ఇంకా వెనుకబడి ఉందని ఐవీసీ అభిప్రాయపడింది. అవేంటంటే..