భవిష్యత్ అంచనాలకు తగ్గట్టుగా అభివృద్ధి
నగరానికి నియో మెట్రో రైలు తీసుకొస్తాం
మామునూరు ఎయిర్పోర్ట్ బాధ్యత నాదే..
రూ.1589 కోట్లతో ఇంటింటికీ రోజూ తాగునీరు
గ్రేటర్లో ఉగాదికి ముందే అభివృద్ధి పండుగ
బల్దియాపై మళ్లీ గులాబీ జెండా ఎగరాలి
వరంగల్ పర్యటనలో రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
వరంగల్ /హన్మకొండ, ఏప్రిల్ 12 : చారిత్రక నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ప్రేమ ఉందని, ఉద్యమ గడ్డగా పేరున్న వరంగల్కు రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. సోమవారం వరంగల్ నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ. 2578.70 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధ్యక్షతన ఖిలా వరంగల్లో, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధర్యంలో న్యూ శాయంపేట జంక్షన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. భవిష్యత్ అంచనాలకు తగ్గట్లుగా నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్లో నియో మెట్రో రైలు పరుగులు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మామునూరు ఎయిర్పోర్టు బాధ్యత తనదేనని, టీఆర్ఎస్ది చేతల ప్రభుత్వమని, ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ నగరంలోని ప్రతి ఇంటికి నల్లాల ద్వారా రోజూ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసే బృహత్తర పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. రూ.1589 కోట్లతో సీఎం కేసీఆర్ ఇంటింటికీ రోజూ అమృత జలాలను అందిస్తున్నారని తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో ముందుకు తీసుకపోతున్నామని గుర్తుచేశారు.
నేను పోతా బిడ్డో సర్కారు దవాఖానకు..
గత ప్రభుత్వాల పాలనలో సర్కారు దవాఖానలపై సినీ కవులు వ్యంగంగా పాటలు రాసేవారని ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పాటను కేటీఆర్ గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ పాలనలో సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించడంతో ఇప్పుడు ‘నేడు పోతా బిడ్డో సర్కారు దవాఖానకు..’ అంటూ పాడుకుంటున్నారని సర్కారు దవాఖానల్లో వచ్చిన మార్పులపై వివరించారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో శిశు మరణాలు తగ్గాయని చెప్పారు.
బీజేపీ నాయకులు కొత్త బిచ్చగాళ్లు..
బీజేపీ నాయకులు కొత్త బిచ్చగాళ్లలెక్క చిల్లరగా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. నగరానికి బీజేపీ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం ఇవ్వడం లేదని, అదే మహారాష్టలోని లాతూర్కు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేశారని, ఇది వివక్ష కాదా అని ప్రశ్నించారు. అచ్చే దిన్ అయేగా.. లాయేగా అన్న ప్రధాన మంత్రి మోదీ తెలంగాణ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బీజేపీ చిల్లర మాటలను తిప్పికొట్టాలని, ఓట్లకు వచ్చే ప్రతిపక్ష నాయకులను ఏం చేశారో నిలదీయాలని పిలుపునిచ్చారు.
మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ నగరాన్ని గత పాలకులు నిరక్ష్యం చేశారని, గ్రేటర్ ఎన్నికలకు కొన్ని పార్టీలు ఎగేసుకు వస్తున్నాయని వాటికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ పార్టీకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని టూరిస్ట్ హబ్గా మార్చుతామని, నగరంలో కళాకారులను ప్రోత్సహించేందుకే సరిగమప లాంటి పార్కులను ప్రారంభించుకున్నామని చెప్పారు.
నగరాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ను కోరారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నేడు రూ.384కోట్లతో తూర్పు నియోజవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.139కోట్లతో అండర్ గ్రౌండ్ స్ట్రామ్ వాటర్ డ్రైనేజీని నిర్మిస్తున్నామని చెప్పారు. ఆయా సభల్లో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, వొడితల సతీష్ కుమార్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, మాజీ ఎంపీ సీతారాంనాయక్, రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు..
ఖిలావరంగల్/న్యూశాయంపేట : చారిత్రక నగరంలో సోమవారం గులాబీ గుబాళించింది. మహానగరంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వచ్చిన మంత్రి కేటీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఖిలావరంగల్ మైదానం, న్యూ శాయంపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు జనం భారీగా తరలివచ్చారు. ఎండను కూడా లెక్కచేయకుండా తరలివచ్చి సభలో పాల్గొని కేటీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న తనదైన శైలిలో ప్రతిపక్షాలను తూర్పారబట్టారు. కాంగ్రెస్, బీజేపీ కుయుక్తులు, చెబుతున్న అబద్ధాలను ప్రజలకు విడమరిచి చెప్పారు. కేటీఆర్ మాట్లాడిన ప్రతి మాట టీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
30 ఎకరాలు ఓపెన్ స్టేడియానికి..
ఖిలావరంగల్లో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన 30 ఎకరాల స్థలంలో రోజూ మూడు వేలకుపైగా క్రీడాకారులు, వాకర్లు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ స్థలాన్ని ఈ ప్రాంత క్రీడాకారులకు కేటాయించాలని, ఇందుకు రూ.7కోట్లు అవసరమున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కేటీఆర్ వెంటనే స్థలం కొనుగోలుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలు, యువత కేరింతలు కొడుతూ కేటీఆర్కు జైకొట్టారు. సభలో కళాకారుల ఆటాపాట ఆకట్టుకుంది. సీఎం కేసీఆర్ ఏడేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కళాకారులు తమ ఆటపాటల ద్వారా వివరించారు. అభివృద్ధిని డిస్ప్లేల ద్వారా ప్రదర్శించారు. ఇక్కడ మాజీ కార్పొరేటర్లు దిడ్డి నాగరాజు, శామంతుల ఉషశ్రీ, సోమిశెట్టి శ్రీలత, బైరబోయిన దామోదర్యాదవ్, కుందారపు రాజేందర్, కేడల పద్మ, టీఆర్ఎస్ నాయకులు చాంద్పాషా, మేరుగు అశోక్, గడ్డం రవి, పగడాల సతీశ్, కలకొండ అభినాష్, ఇనుముల మల్లేశం, కొత్తపెల్లి శ్రీనివాస్, సమీనా, గడల రమేశ్, విజయరాంచందర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు