ఉమ్మడి జిల్లాలో 21.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి అవకాశం
18.05 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్కు రావచ్చని అంచనా
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కొనుగోళ్లకు ఏర్పాట్లు
ఏప్రిల్ మొదటి వారంలో మొదలు
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
రైతుల హర్షాతిరేకాలు
సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు
యాసంగి సస్యశ్యామలమైంది. కాళేశ్వర జలాలతో పండిన వరి, పసిడి వర్ణంలో దగదగా మెరిసిపోతున్నది. కోతకు వస్తున్న పంటను చూసి ఆనందపడాల్సిన సమయాన.. కేంద్ర చట్టాలతో మొన్నటిదాకా రైతుల్లో ఆందోళన కనిపించింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వారం క్రితం అసెంబ్లీ వేదికగా భరోసా ఇవ్వడంతో సంతోషం వ్యక్తమైంది. కేంద్ర చట్టాలు ఎలా ఉన్నా రైతులకు ఇబ్బందుల్లేకుండా ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో కర్షకంలోకం సంబురపడుతున్నది. కరోనా నేపథ్యంలో ఎప్పటిలాగే యాసంగిలోనూ కొనుగోళ్లు చేయాలని సీఎం ఆదేశించడంతో జిల్లాల వారీగా అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. వచ్చే నెల మొదటివారం నుంచి కోతలు ముమ్మరమయ్యే అవకాశముండగా, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనేందుకు సిద్ధమైంది.
కరీంనగర్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర చట్టాలు ఎలా ఉన్నా రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా అధికారులకు ఆదేశాలివ్వడంతో ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో నాలుగైదు గ్రామాలకొక కేంద్రం ఉండగా, కరోనా నేపథ్యంలో గత రెండు సీజన్లలో గ్రామానికొకటి చొప్పున, పెద్ద గ్రామాల్లో అవసరమైతే రెండు అంతకంటే ఎక్కువ ఏర్పాటు చేశారు. ఈ సీజన్లోనూ ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు.
ఉమ్మడి జిల్లాలో 1,270 కేంద్రాలు..
ఉమ్మడి జిల్లాలో గత సీజన్కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, దీనివల్ల తక్కువ సమయంలో కొనుగోళ్లు పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులతో సమాలోచనలు చేసి, గ్రామానికో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 1,270 కేంద్రాలకు ప్రతిపాదనలు చేశారు. ఎక్కడెక్కడ ముందుగా కోతలు నిర్వహిస్తారో అక్కడ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 9.26 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 21.99 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేశారు. అందులో సీడ్, రైతులు తిండి కోసం ఉంచుకునే ధాన్యం పోను 18.05 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్కు రావచ్చని భావిస్తున్నారు.
కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు..
కేంద్రం చట్టాలు ఏవిధంగా ఉన్నా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రైతులు ఎఫ్సీఐ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం కోరుతున్నది. తేమ 17శాతం, చెత్త 1శాతం, మట్టి పెల్లలు 1శాతం, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం 5శాతం, పూర్తిగా తయారుకాని, ముడుచుకుపోయిన ధాన్యం 3శాతం, తక్కువ రకాల మిశ్రమం 6 శాతం చొప్పున ఉన్న ధాన్యానికి కనీస మద్దతు ధర 1,888 చెల్లిస్తారు. సాధారణ రకానికి 1,866 చెల్లిస్తారు. రైతులు తగిన జాగ్రత్తలతో ధాన్యాన్ని తెచ్చేలా వ్యవసాయ అధికారులు సన్నద్ధం చేస్తున్నారు.
వచ్చే నెల మొదటి వారంలో..
ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ముందుగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా నాట్లు వేస్తుంటారు. ఈసారి కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం, హుజూరాబాద్, వీణవంక, తదితర మండలాల్లో యాసంగి నాట్లు ముందుగానే పడ్డాయి. ఇవి ఇప్పుడు కోతకు వస్తుండగా, మిగతా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వచ్చే నెల మొదటివారంలో కోతకు రానున్నాయి. ఈ నేపథ్యంలో అవసరాన్ని బట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఏప్రిల్ మొదటి వారంలో 43,073 మెట్రిక్ టన్నుల ధాన్యం, రెండో వారంలో 86,145, మూడో వారంలో 53,841, నాలుగో వారంలో 32,305, మే మొదటి వారంలో 40,543, రెండో వారంలో 81,086, మూడో వారంలో 50,679, నాలుగో వారంలో 30,407 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వచ్చే అవకాశమున్నది. ఈ జిల్లాలో సీడ్ అధికంగా పండిస్తున్న నేపథ్యంలో ఈసారి 2.03 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సీడ్ దిగుబడి వచ్చే చాన్స్ ఉన్నది.
ప్రణాళికలు రూపొందించుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్
ఈ యాసంగి సీజన్లో వచ్చిన ధాన్యం మొత్తం గ్రామాల్లో కొనుగోలు చేసేందుకు వెంటనే కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో యాసంగి ధాన్యం సేకరణతో పాటు పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనాలు, ధరణి, హరితహారం, శాఖాహార, మాంసాహార సమీకృత మార్కెట్ల నిర్మాణం, కరోనా వైరస్ నివారణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యాన్ని ఆరబెట్టి తాలు లేకుండా, 17 శాతం తేమకు మించకుండా కొనుగోలు కేంద్రాలకు తెచ్చి కనీస మద్దతు ధర పొందేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కాన్ఫరెన్స్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం
జగిత్యాల జిల్లాలో 7.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. 387 కొనుగోలు కేంద్రాలను ప్రస్తుతం ప్రతిపాదించాం. అవసరమైతే మరిన్ని పెంచుతాం. మార్కెట్ యార్డులు, సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోళ్లు జరుగుతాయి. రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్నవే కాకుండా, మరిన్ని గన్నీ బ్యాగులను తెప్పిస్తున్నాం. ప్రతి కేంద్రంలోనూ డయ్యర్లు, తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లను అందుబాటులో ఉంచుతున్నాం. ధాన్యం తరలించేందుకు ఆర్టీఏ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో బృందాలను రూపొందించి, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేస్తున్నాం. కలెక్టరేట్లో టోల్ఫ్రీ నంబర్తో కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నాం. మరో పదిహేను రోజుల తర్వాత ధాన్యం రావచ్చు.
దళారులను నమ్మి మోసపోవద్దు
సిరిసిల్ల జిల్లాలో 4.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశాం. ఇందులో రైస్ మిల్లులకు పోను కొనుగోలు కేంద్రాల ద్వారా 3.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నాం. దీని కోసం ఇప్పటికే 227 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వేసవిని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో పది ఏర్పాటుకు ప్రతిపాదించాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు వెనువెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తాం. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నందున రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.